పారిస్: అదృష్టం ఉండాలేగానీ సంపద అయినా అంతకంటే విలువైన వస్తువైనా మనల్నే వెతుక్కుంటూ వస్తుందని మరోమారు నిరూపితమైంది. ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో కుంచె నుంచి జాలువారిన కళాఖండాలకు చిత్రకారులు, సంపన్నుల ప్రపంచంలో భలే డిమాండ్ ఉంది. సంపన్నులు మొదలు సాధారణ కళాకారుల దాకా ఎంతో మంది పికాసో ఒరిజినల్ పెయింటింగ్లను తమ సొంతం చేసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. అలాంటిది ఒక ఫ్రాన్స్ సేల్స్ ఇంజనీర్కు కేవలం 117 డాలర్లకే అంటే 10,915 రూపాయలకే ఏకంగా రూ.9.33 కోట్ల విలువైన పికాసో పెయింటింగ్ దక్కింది.
పెయింటింగ్ విక్రయం కోసం దాని యాజమాన్యం చేపట్టిన లక్కీ డ్రాలో 58 ఏళ్ల అరీ హొదారా అనే వ్యక్తి ఈ ‘హెడ్ ఆఫ్ ఏ ఉమెన్’పెయింటింగ్ను సొంతం చేసుకున్నారు. అల్జీమర్స్ వ్యాధి సంబంధ పరిశోధనకు కావాల్సిన నిధుల సమీకరణ కోసం రఫెల్ అనే సంస్థ ఈ పెయింటింగ్ను ‘క్రిస్టీస్’అనే వేలంసంస్థకు అప్పగించి అమ్మిపెట్టాలని సూచించింది. లక్కీ డ్రా టికెట్ ధరను 117 డాలర్లు నిర్ణయించారు. మొదారా కొన్న టికెట్కే లక్కీ డ్రా తగలడంతో అతను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ‘‘ఎవరో నన్ను ఆటపట్టించడానికి ఫోన్చేశారనుకున్నా. వేలంసంస్థ ఒకటికి రెండు సార్లు విషయం చెప్పడంతో నాకు ఇది అబద్ధం కాదు అని అర్ధమైంది’’మొదారా తెగ సంతోషం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా టికెట్ల అమ్మకాల ద్వారా రూ.130 కోట్లు సమకూరాయని రఫేల్ సంస్థ తెలిపింది. పికాసో తన ప్రేయసి డోరా మార్ను ఊహించుకుంటూ విభిన్నంగా 1941లో ఈ పెయింటింగ్వేశారు.


