సియోల్: ఉత్తర కొరియాపైకి డ్రోన్లు పంపినందుకు గాను దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు సియోల్ కోర్టు ఇవాళ(శుక్రవారం) ఆయనకు మరో 30 ఏళ్ల భారీ జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే, ఆయన ఇప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 2024 డిసెంబర్లో విఫలమైన మార్షల్ లా విధింపునకు దారితీసిన పరిణామాలపై విచారణ జరిపిన కోర్టు.. దేశద్రోహం, అధికార దుర్వినియోగం ఆరోపణల కింద ఆయనను దోషిగా తేల్చింది.
సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు తన తీర్పులో.. 2024 అక్టోబర్లో ఉత్తర కొరియాలోకి డ్రోన్లను పంపడం వెనుక యూన్ సుక్ యోల్ స్పష్టమైన వ్యూహం ఉందని పేర్కొంది. ఉత్తర కొరియాను రెచ్చగొట్టడం ద్వారా దేశంలో తీవ్ర భద్రతా సంక్షోభాన్ని సృష్టించి.. ఆ నెపంతో డిసెంబర్ 3, 2024న మార్షల్ లా విధించాలనేది ఆయన ప్రణాళిక అని కోర్టు నిర్ధారించింది.
ఈ సైనిక ఆపరేషన్లో భాగస్వాములైన మరికొందరు కీలక అధికారులపై కూడా కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. మాజీ రక్షణ మంత్రి కిమ్ యాంగ్-హ్యూన్.. ప్రత్యేక కౌన్సిల్ 25 ఏళ్ల శిక్షను కోరగా.. కోర్టు అంతకంటే ఎక్కువగా 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మాజీ కౌంటర్ ఇంటెలిజెన్స్ కమాండ్ చీఫ్ యో ఇన్-హ్యుంగ్కు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. డ్రోన్ ఆపరేషన్స్ మాజీ చీఫ్ కిమ్ యాంగ్ డేకు కూడా శిక్ష విధించింది.
సైనిక పాలన విధించేందుకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించడం కోసమే నిందితులు ఈ కుట్రకు పాల్పడ్డారు. ఉత్తర కొరియాను రెచ్చగొట్టి, సరిహద్దుల్లో ఘర్షణలు లేదా జాతీయ భద్రతా సంక్షోభాన్ని సృష్టించేందుకు మానసిక యుద్ధతంత్రాన్ని సైనిక వ్యూహంగా ఉపయోగించుకున్నారంటూ సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రక్షణ కోసం.. చట్టబద్ధమైన అవసరాల కోసం మాత్రమే సైనిక శక్తిని ఉపయోగించాలనే ప్రజల నమ్మకాన్ని అధ్యక్షుడు, రక్షణ మంత్రి పూర్తిగా వమ్ము చేశారని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇదంతా వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జరిగిందని వ్యాఖ్యానించింది.
అయితే, 2024లో ఉత్తర కొరియా.. దక్షిణ కొరియాపైకి పంపిన చెత్త బుడగలకు ప్రతిస్పందనగానే డ్రోన్లను పంపామని ఇది చట్టబద్ధమైన సైనిక చర్యేనని యూన్ తరఫు న్యాయవాదులు వాదించారు. కానీ కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. ఈ ఆపరేషన్ వల్ల దక్షిణ కొరియా సైనిక రహస్యాలు ఉత్తర కొరియాకు తెలిసిపోయాయని.. తద్వారా దేశ భద్రత ప్రమాదంలో పడిందని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే యూన్ సుక్ యోల్ న్యాయ బృందం ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ దాఖలు చేసింది.


