సెనెసెంట్‌ కణాలు తొలగిస్తే ‘షుగర్‌’కు చెక్‌

Deleting Dysfunctional Cells Alleviates Diabetes: Study - Sakshi

వయసు పెరిగే కొద్దీ శరీరంలో పేరుకుపోయే సెనెసెంట్‌ కణాల (విభజనకు గురయ్యే లక్షణాన్ని కోల్పోయినవి)ను తొలగిస్తే మధుమేహానికి బ్రేకులు వేయవచ్చునని కనెక్టికట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎలుకలపై ప్రయోగాల్లో ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు వారు తెలిపారు.

ఊబకాయంతో ఉన్న ఎలుకలకు సెనెసెంట్‌ కణాలను తొలగించే ప్రయోగాత్మక మందులు డసాటనిబ్, క్యుయెర్‌సెటిన్‌లు ఇచ్చినప్పుడు వాటి మధుమేహ లక్షణాలు మాయమైపోయాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మింగ్‌ షూ తెలిపారు. ఊబకాయం, వ్యాయామలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది మధుమేహుల్లో ఇనుల్సిన్‌ నిరోధకత ఉంటుంది. వాటితోపాటు కొవ్వులో ఉండే సెనెసెంట్‌ కణాలూ మధుమేహంపై ప్రభావం చూపుతున్నట్లు తాము గుర్తించామని మింగ్‌ షూ చెప్పారు. ఈ కణాలను తొలగిస్తే మధుమేహానికి బ్రేకులు పడ్డాయని వివరించారు.

డసాటనిబ్, క్యుయెర్‌సెటిన్‌లను తాము మానవ కొవ్వు కణజాలంపై ప్రయోగించినప్పుడు అందులోని సెనెసెంట్‌ కణాలు నశించాయని వివరించారు. ఊబకాయుల నుంచి సేకరించిన ఈ కణజాలాన్ని ఎలుకలకు అమర్చినప్పుడు మధుమేహ లక్షణాలు తగ్గాయని చెప్పారు. మానవుల్లోనూ ఈ మందుల ప్రభావం ఇదేలా ఉంటుందా? అన్నది పరిశీలించేందుకు త్వరలో విస్తృత ప్రయోగాలు చేస్తామన్నారు. 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top