
లండన్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలు ఆచరణలోకి వస్తున్నాయని, భారత్లో నిమ్నవర్గాల ప్రజలు కూడా అత్యున్నత రాజ్యాంగ పదవులు అధిరోహిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లండన్లోని చరిత్రాత్మక గ్రేస్ ఇన్లో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అంబేడ్కర్ బోధించారని గుర్తుచేశారు.
బడుగు వర్గాల ప్రజలు కూడా ఉన్నత పదవులు చేపట్టాలని ఆయన కలలుగన్నారని తెలిపారు. అంబేడ్కర్ కలలు సాకారం అవుతుండడం సంతోషంగా ఉందన్నారు. అంబేడ్కర్ సూచించిన దారితో తాము నడుస్తున్నామని తెలిపారు. తాను దళిత వర్గం నుంచే వచ్చినట్లు జస్టిస్ గవాయ్ గుర్తుచేశారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి అయ్యారని పేర్కొన్నారు. ఇది నిజంగా గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఇండియాలో అన్ని రంగాల్లో బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం పెరుగుతోందన్నారు.