అవయవదానం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని, సమాజంలో అవయవదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. శనివారం ప్రపంచ అవయవ మార్పిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో ‘‘ఎ కీ దట్ ఓపెన్స్ న్యూ హోప్ – సెలబ్రేటింగ్ ది గిఫ్ట్ ఆఫ్ లైఫ్’’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి డా. శ్రీభూషణ్ రాజు గౌరవ అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అపోలో ఆస్పత్రుల సీఈవో తేజస్వి రావు వీరపల్లి మాట్లాడుతూ అవయవదానం అనేది ఒక వ్యక్తి అందించగలిగే గొప్ప బహుమతి అని అన్నారు. అవయవాల అవసరానికి, లభ్యతకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. లివర్ ట్రాన్స్ ప్లాంట్ విభాగాధిపతి డా. శరత్ పుట్ట మాట్లాడుతూ, 1984లో ట్రాన్స్ ప్లాంట్ సేవలను ప్రారంభించినప్పటి నుంచి అపోలో దేశవ్యాప్తంగా 27,500కు పైగా ఘన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిందని తెలిపారు. వీటిలో 21,500కు పైగా కిడ్నీ, 5,000 లివర్, 400 హార్ట్–లంగ్ ట్రాన్స్ ప్లాంట్లు ఉన్నాయని చెప్పారు. అనంతరం అవయవదాత కుటుంబాలకు ఘనంగా సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య విద్యా సంచాలకుడు డా. ఏ. నరేంద్ర కుమార్, లివర్ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్స నిపుణులు డా. రాఘవేంద్రబాబు, డా. రవిచంద్, హార్ట్–లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డా. గోపాలకృష్ణ గోఖలే, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డా. ఏ. నాగేశ్, లంగ్ ట్రాన్స్ప్లాంట్ వైద్యులు డా. చైతన్య భట్టు, డా. చేతన్ రావు వడ్డెపల్లి, కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ నిపుణులు డా. సోమశేఖర్, డా. శ్రీధర్, డా. సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే యూరాలజిస్ట్ డా. సుబ్రహ్మణ్యం కొలనుకుదురు, హీమటో–ఆంకాలజిస్టులు డా. పవన్ కుమార్ బోయెల్ల, డా. పద్మజ లోకిరెడ్డి, నేత్ర వైద్య నిపుణుడు డా. రాజేష్ ఫోగ్లా, మైక్రో హ్యాండ్ సర్జన్ డా. జి.ఎన్. భండారి తదితరులు పాల్గొన్నారు.


