పుష్కర ప్రగతి.. పన్నెండేళ్లలో అభివృద్ధి ముద్ర | Hyderabad's Status As A Global City Is Expanding Into Three Corporations | Sakshi
Sakshi News home page

పుష్కర ప్రగతి.. పన్నెండేళ్లలో అభివృద్ధి ముద్ర

Jun 2 2026 8:34 AM | Updated on Jun 2 2026 12:30 PM

Hyderabad's Status As A Global City Is Expanding Into Three Corporations

‘భారత్‌ ఫ్యూచర్‌’ దిశగా పరుగులు

గ్లోబల్‌ సిటీగా మహానగర ఘనత

మూడు కార్పొరేషన్లుగా విస్తరణ

సాక్షి, హైదరాబాద్‌: నింగినంటే ఆకాశ హరŠామ్యలు, వేగం పెంచిన రహదారులు, ఫ్లైఓవర్లు, ప్రపంచ నగరాల చెంతన నిలిపిన అంతర్జాతీయ హంగులు.. వెరసీ గత పుష్కరకాలంలో భాగ్య నగరం గ్లోబల్‌సిటీగా అవతరించింది. దేశవిదేశాలకు చెందిన కార్పొరేట్‌ దిగ్గిజాలకు కేరాఫ్‌గా నిలిచింది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సులు, ఉత్కంఠభరితమైన పోటీలు జరిగాయి. నగరం అనేక మార్పులను సంతరించుకుంది.

‘భారత్‌ ఫ్యూచర్‌సిటీ’ దిశగా పరుగులు తీస్తోంది. మూడు మున్సిపల్‌ కార్పొరేషన్‌లుగా విస్తరించుకుంది. దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి, శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అందబేడ్కర్‌ 125 అడుగుల భారీ విగ్రహం, ఆ చెంతనే ఠీవీగా కొలువుదీరిన మాజీ ప్రధాని పీవీ విగ్రహం, లుంబినీ పార్కును ఆనుకొని నిర్మించిన అమరుల స్మారక భవనం.. చారిత్రక, పర్యాటక ఆనవాళ్లుగా నిలిచాయి.

ముచ్చటగా మూడు కార్పొరేషన్‌లు..
ఔటర్‌రింగ్‌ రోడ్డు వరకు ఉన్న నగరానికి కోర్‌ అర్బన్‌ సిటీగా పరిగణిస్తూ ప్రభుత్వం మూడు మున్సిపల్‌ కార్పొరేషన్‌లను కొత్తగా ఏర్పాటు చేసింది. ఇంతకుముందే ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు కొత్తగా మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉనికిలోకి వచ్చాయి. దీంతో మహా నగరం సుమారు 2000 చ.కి.మీ. వరకు విస్తరించింది. కొత్తగా 300 డివిజన్‌లుగా నగరం విస్తరించింది. మరోవైపు హెచ్‌ఎండీఏ పరిధిని సైతం ప్రభుత్వం పెంచింది. 7,200 చ.కి.మీ. నుంచి 10,080 చ.కి.మీ.పైగా హెచ్‌ఎండీఏ పరిధి పెరిగింది. ఓఆర్‌ఆర్‌ నుంచి రీజినల్‌ రింగ్‌రోడ్డు వరకు 16 చోట్ల గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి.

మెట్రో రయ్‌ రయ్‌..
సుమారు 17 సంవత్సరాలకు  పైగా ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) భాగస్వామ్య ప్రాజెక్టుగా కొనసాగిన హైదరాబాద్‌ మెట్రో మొదటిదశ ప్రాజెక్టును ప్రభుత్వం  ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీనం చేసుకొంది. మెట్రో రెండోదశ విస్తరణలో భాగంగా చేపట్టిన ఈ ప్రక్రియ మరో కీలకమైన పురోగతిగా భావించవచ్చు.

భూమి బంగారం..  
హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ చరిత్రలోనే కళ్లు చెదిరే రీతిలో రాయదుర్గంలో భూముల వేలం సరికొత్త రికార్డును సృష్టించింది. టీజీఐఐసీ ఇటీవల నిర్వహించిన ఈ– వేలంలో ఎకరం ఏకంగా రూ.237 కోట్లకు అమ్ముడుపోయింది. మొత్తం 6.29 ఎకరాల భూమిపై రూ.1,490.73 కోట్లు లభించాయి. గత ఏడాది అక్టోబర్‌లో రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోనే ఎకరం రూ.177 కోట్లు పలకగా, అంతకుముందు కోకాపేట నియోపోలిస్‌ వేలంలో ఎకరం రూ.100.75 కోట్లకు పైగా పలికింది.

బాచుపల్లి ఫ్లైఓవర్‌ త్వరలో ప్రారంభం.. 
సాక్షి, సిటీబ్యూరో: బాచుపల్లి–మియాపూర్‌–గండిమైసమ్మ కారిడార్‌లో ట్రాఫిక్‌ రద్దీ తగ్గించేందుకు రూ.65.53 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఎక్స్‌ రోడ్‌ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు హెచ్‌ఎండీఏ తెలిపింది. 17.5 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్ల రహదారిగా 1.3 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌లో 545 మీటర్ల వరకు వయాడక్ట్‌ ఉంటుంది.  మియాపూర్‌ ఎక్స్‌ రోడ్‌ నుంచి గండిమైసమ్మ వైపు ప్రయాణించే వాహనదారులకు  ఊరట లభించనుంది. 30 మీటర్ల స్పాన్‌లతో, ప్రత్యేక అవసరాలున్నచోట కాంపోజిట్‌ స్టీల్‌ గిర్డర్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ను ఉపయోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement