హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హన్మకొండ అర్బన్: ఈనెల 13న నిర్వహించే ఎన్డీఏ, నావల్ అకాడమీ–2, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్–2 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. ప్రతీ పరీక్ష సెషనన్కు అరగంట ముందే గేట్లు మూసేస్తామని తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో చేపట్టిన ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించే ఎన్డీఏ, నావల్ అకాడమీ పరీక్ష, సీడీఎస్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థలకు ఎలాంటి ఇబ్బందులు కల్గ కుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో కేంద్ర పరిశీలకులు ఉమేష్ మీనా, రాష్ట్ర పరిశీలకులు సురేశ్బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అధికారులతో మాట్లాడారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ గౌరీశంకర్, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, మై భారత్ కో–ఆర్డినేటర్ భూక్య సంజీవ్, కళాశాలల ప్రిన్సిపాళ్లు జ్యోతి, డాక్టర్ సుహాసిని, ఎస్ఐ ప్రసాద్, విద్యుత్ శాఖ ఏఈ అలేఖ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.


