ఖిలా వరంగల్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ ఉన్నతాఽధికారులను కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కక్కిరాల రమేశ్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి, ఉన్నతాధికారులకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. అనంతరం సమస్యలను వివరించగా.. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు.
నిరుపేదలకు సంజీవని ఆరోగ్యశ్రీ
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
కేయూ క్యాంపస్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ పథకం నిరుపేదలకు సంజీవనిలా పని చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం కేయూలోని ఫార్మసీ కళాశాలలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్సలు చేయించి పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యంను కల్పించాలనే డిమాండ్తో 2004లో ఎమ్మార్పీఎస్ చేసిన ఉద్యమం ఫలితంగానే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పథకాన్ని అమలు చేసిందన్నారు. సమావేశంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె.కృష్ణవేణి, ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ గాదె సమ్మయ్య, హాస్టళ్ల డైరెక్టర్ పి.శ్రీనివాస్, అంబేడ్కర్ స్టడీస్ సెంటర్ ఇన్చార్జ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పుల్లా శ్రీనివాస్, డాక్టర్ సంకినేని వెంకట్, బి.తిరుపతి మాదిగ, కుమ్మరి శ్రీనాథ్, నాయకులు పాల్గొన్నారు.
కళాశాల విద్యార్థులకు నోట్ బుక్స్
కాళోజీ సెంటర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయని వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలతోపాటు నోట్ బుక్స్, బ్యాగ్స్, షూ, స్టేషనరీ అందిస్తున్నట్లు వివరించారు. నగరంలోని కృష్ణాకాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు ఉచితంగా రాతపుస్తకాల (అన్ రూల్డ్ నోట్ బుక్స్) పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని 2,704 మంది విద్యార్థులకు 32,448 నోట్ బుక్స్ పంపిణీ చేసినట్లు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ, లైబ్రేరియన్ వనమాల, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.


