కాశిబుగ్గ: జన్మించిన మొదటి గంటలోపు వచ్చే ముర్రుపాలను తప్పనిసరిగా శిశువుకు పట్టించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో గురువారం తల్లిపాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముర్రుపాలు పుట్టిన శిశువులో సహజ నిరోధక శక్తిని పెంపొందిస్తాయని, వీటిలో అవసరమైన పోషకాలు ఉంటాయని తెలిపారు. తల్లిపాలు తాగిన పిల్లలకు డయేరియా, నిమోనియా, కామెర్లు తదితర వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని వివరించారు. అలాగే, మెదడు ఎదుగుదలకు, తల్లీబిడ్డల మధ్య అనుబంధం బలపడేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. శిశువుకు మొదటి ఆరునెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తర్వాత తల్లిపాలతో పాటు వయస్సుకు తగిన ఆహారాన్ని అందించాలని ఆమె సూచించారు. అవసరానికి మించి తల్లిపాలు ఉత్పత్తి అయ్యే తల్లులు పాలను మిల్క్ బ్యాంకుకు దానం చేయాలని, ఈపాలు అవసరమైన శిశువులకు అందించి వారి ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రాజారెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి, జిల్లా సంక్షేమ అధకారి రాజమణి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రకాశ్, డాక్టర్ రాజమౌళి, డాక్టర్ సాజిదా, డాక్టర్ ఇక్తదార్ అహ్మద్, డాక్టర్ అరుణ్జోషి, ఆర్ఎంఓలు డాక్టర్ సృజన్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
గురుకులాల్లో విద్యార్థులకు
వసతులు కల్పించాలి
న్యూశాయంపేట: ప్రభుత్వ గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా, మండలస్థాయి ప్రత్యేక అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాటాల్డారు. జిల్లాలోని 74 ప్రభుత్వ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీబీసీడీఓ పుష్పలత అధికారులు పాల్గొన్నారు.
పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై సమీక్ష
ఖిలా వరంగల్ ఖుష్మహల్ వేదికగా ఈనెల 15న నిర్వహించే పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేడుకల నిర్వహణ, వేదిక ఏర్పాట్లు పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, ట్రాఫిక్, భద్రత, వైద్య సదుపాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, జె డ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు.


