సవరించిన షెడ్యూల్ ఇలా...
● ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు,
ధ్రువపత్రాల అప్లోడ్: ఆగస్టు 15
● వెరిఫై అయిన అభ్యర్థుల జాబితా విడుదల: ఆగస్టు 16
● ఫేజ్–1 వెబ్ ఆప్షన్లు: ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు
● వెబ్ ఆప్షన్ల సవరణ: ఆగస్టు 19
● తాత్కాలిక సీట్ల కేటాయింపు: ఆగస్టు 22
● కళాశాలల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ల ధ్రువీకరణ: ఆగస్టు 24 నుంచి 26వ తేదీ వరకు
సాక్షి, వరంగల్: ఎల్ఎల్ఎం (మాస్టర్ ఆఫ్ లా) ప్రవేశాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల అప్లోడ్కు ఈనెల 15 వరకు గడువు పొడిగిస్తూ టీజీసెట్ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్ఎల్ఎం అడ్మిషన్లలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సాక్షి దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన ‘ఎల్ఎల్ఎం అడ్మిషన్పై ఆందోళన’ కథనానికి టీజీ సెట్ (ఇతర కోర్సులు) అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ పాండు రంగారెడ్డి స్పందించారు. జూలై 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుండంతో వందలాది మంది విద్యార్థులు అడ్మిషన్లకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని, ముఖ్యంగా ప్రొవిజనల్ మెమోలు, లాంగ్ మెమోలు ఇంకా అందని కారణంగా అభ్యర్థులు నమోదు చేసుకోలేకపోతున్నారని విద్యార్థుల వెతలను సాక్షి దినపత్రిక ప్రస్తావించింది. దీనిపై స్పందించిన కన్వీనర్.. విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ సవరించిన షెడ్యూల్ను విడుదల చేశారు. ‘మా ఇబ్బందులను టీజీ సెట్ ఉన్నతాధికారుల దృష్టికి సాక్షి తీసుకెళ్లడంతో ఎల్ఎల్ఎం రిజిస్ట్రేషన్ గడువు పొడిగించారు’ అని లా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కేయూ పరీక్షల నియంత్రణ విభాగాధికారులు సాధ్యమైనంత త్వరగా ప్రస్తుతం రాస్తున్న మూడేళ్ల కోర్సు, ఐదేళ్ల కోర్సు ఫైనల్ ఇయర్ విద్యార్థుల థియరీ పరీక్షల ఫలితాలను ప్రకటించాలని వారు కోరారు.
జూలై 31తో రిజిస్ట్రేషన్ల గడువుపై
‘సాక్షి’లో ప్రత్యేక కథనం
ఎల్ఎల్ఎం అడ్మిషన్ల ఆందోళనపై స్పందించిన టీజీసెట్ కన్వీనర్


