మత్తుబిళ్ల.. ఒళ్లుగుల్ల! | - | Sakshi
Sakshi News home page

మత్తుబిళ్ల.. ఒళ్లుగుల్ల!

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

మత్తుబిళ్ల.. ఒళ్లుగుల్ల!

యువతను వేటాడుతున్న ఔషధ మాఫియా

హనుమకొండ జిల్లా శాయంపేటలో ఫిబ్రవరి 21న రాచర్ల ప్రభాకర్‌ నిర్వహిస్తున్న క్వాక్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ క్లినిక్‌పై దాడి చేసిన డీసీఏ అధికారులు.. 30 రకాల మందులు, ఫిజిషియన్‌ శాంపిళ్లు, స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్‌, మత్తు అలవాటు చేసే ట్రామడాల్‌ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.

బుధవారం వరంగల్‌ చార్‌బౌళిలో జిమ్‌లకు మత్తు ఇంజక్షన్ల సరఫరా చేస్తున్న సెంటర్‌పై డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ), టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. 38 టెర్మిన్‌ (మెఫెంటర్మైన్‌ సల్ఫేట్‌) ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎంఏ సోహైబ్‌ అనే వ్యక్తి ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు.

హనుమకొండ మండలం ఇందిరానగర్‌లో ‘ఫస్ట్‌ ఎయిడ్‌ క్లినిక్‌’ పేరుతో నడుస్తున్న ఓ క్లినిక్‌పై ఈ నెల 4న హైదరాబాద్‌ డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. బత్తుల రాజుకుమార్‌ అనే వ్యక్తి అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించి.. 41 రకాల మందులు, యాంటీబయాటిక్స్‌, స్టెరాయిడ్లు, నొప్పి నివారణ మందులు, ఐవీ ఫ్లూయిడ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

డ్రగ్స్‌పై పోలీసులు, నార్కొటిక్స్‌ విభాగం ఉక్కుపాదం మోపుతున్న వేళ.. ఇప్పుడు మత్తు కోసం వినియోగించే ఔషధాల అక్రమ విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైద్యుల చీటీతో మాత్రమే విక్రయించాల్సిన కొన్ని మందులు విచ్చలవిడిగా అమ్ముడవుతుండగా, యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా ముఠాలు పనిచేస్తున్నట్లు డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) అధికారుల దాడుల్లో వెలుగులోకి వస్తోంది.

ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా డీసీఏ అధికారులు చేపట్టిన వరుస దాడుల్లో మత్తు కోసం వినియోగించే ఔషధాలు, ఇంజెక్షన్లు, నిద్ర మాత్రలు భారీగా స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్న మెడికల్‌ షాపులు, ఫస్ట్‌ఎయిడ్‌ కేంద్రాలు, అనధికార నిల్వల కేంద్రాల గుట్టురట్టయ్యింది. కొన్ని ప్రాంతాల్లో వైద్య అర్హతలు లేకుండానే ఫస్ట్‌ఎయిడ్‌ కేంద్రాల పేరుతో

చికిత్సలు అందిస్తూ మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరికొన్ని చోట్ల ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మత్తు ప్రభావం కలిగించే ఔషధాలను విక్రయిస్తున్నట్లు అధికారులు తేల్చారు.

యువతే లక్ష్యం.. నిఘా అత్యవసరం

కాలేజీ విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, వ్యసనాలకు అలవాటు పడిన వారే ప్రధానంగా ఈ ముఠాల లక్ష్యంగా మారుతున్నారు. సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపులు, పరిచయాల ద్వారా మందుల సరఫరా జరుగుతున్నట్లు సమాచారం. మొదట చిన్న మోతాదులతో ప్రారంభమైన అలవాటు క్రమంగా తీవ్రమైన వ్యసనంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండువేలకు పైగా మెడికల్‌ షాపులు ఉండగా.. చాలామంది నిబంధనలకు విరుద్ధంగా ప్రిస్కిప్షన్‌ లేకుండా విక్రయిస్తున్నట్లు అంచనా. హనుమకొండ, వరంగల్‌ నగరాలతో పాటు జిల్లా కేంద్రాల్లో ఔషధ దుకాణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందుల విక్రయాలు జరుగుతున్నాయా? అనే అంశంపై ప్రత్యేక నిఘా అవసరమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

నగరం నుంచి

గ్రామీణ క్లినిక్‌ల దాకా దందా

డ్రగ్స్‌కు బదులు.. డేంజర్‌ ట్యాబ్లెట్లు

అడ్డూఅదుపు లేని

అక్రమ ఔషధాల వ్యాపారం

ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే విక్రయాలు

డీసీఏ దాడులతో బండారం బట్టబయలు

Advertisement
 
Advertisement
Advertisement