మహబూబాబాద్ అర్బన్ : కొత్తగూడ మండలంలోని మోడల్ క్రీడా పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గుగులోత్ దేశీరాం నాయక్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోని మండల స్థాయి పోటీల్లో పాల్గొనాలని, దరఖాస్తుతో పాటు, ధ్రువపత్రాలను కొత్తగూడ క్రీడా పాఠశాలలో అందజేయాలని వివరించారు. ఈ నెల 28నుంచి 31 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపిక పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 94924 40711, 94924 40710, 94406 97433 నంబర్లలో సంప్రదించాలన్నారు.
జాతీయ వాలీబాల్
సెలక్షన్ కమిటీలో చోటు
గోవిందరావుపేట : యూత్ నేషనల్ వాలీబాల్ చాంపియన్ షిప్నకు సంబంధించిన భారత జట్టు సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ములుగు జిల్లా వాసి కోసరి కృష్ణప్రసాద్ను నామినేట్ చేయగా గురువారం సాయంత్రం ఫెడరేషన్ కార్యదర్శి రామానంద్ చౌదరి అధికారిక లేఖను విడుదల చేశారు. గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన కృష్ణప్రసాద్ ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ నెల 15 నుంచి 20 వరకు భువనేశ్వర్లోని కేఐఐటీ యూనివర్సీటీ ప్రాంగణంలో నిర్వహించనున్న పురుషుల విభాగానికి కృష్ణప్రసాద్ సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా తనను కమిటీ సభ్యుడిగా ఎంపిక చేసినందుకు వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వీరేందర్ కన్వీనర్తో పాటు ప్రతినిధులకు కృష్ణప్రసాద్ కృతజ్ఞతలు తెలి పారు. కృష్ణప్రసాద్కు జాతీయ స్థాయి బాధ్యత పొందటంతో క్రీడాభిమానులు, యువ క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రూ.3 లక్షల విలువైన
గంజాయి స్వాధీనం
రామన్నపేట : వరంగల్ నగరంలోని బ్యాంకు కాలనీ–2 కాల్వ బ్రిడ్జి సమీపంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.ఎస్సై శివకృష్ణ తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి స్కూటర్పై అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో అతడిని ఆపి తనిఖీ చేయగా స్కూటర్ ముందు భాగంలో ఆరు కిలోల గంజాయి దొరికినట్లు సీఐ తెలిపారు. విచారణలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి వేణురావు కాలనీకి చెందిన గోలి సుమన్ అని, అతడు ఆంధ్రప్రదేశ్లోని సీలేరు ప్రాంతం నుంచి వరంగల్కు గంజాయి విక్రయించేందుకు తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు. గంజాయిని తూకం వేయగా 6 కిలోల ఉండగా దాని విలువ రూ.3 లక్షలుగా గుర్తించారు. ఈ ఘటనలో గంజాయితో పాటు సెల్ఫోన్, బైక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.
కేసు నమోదు
రామన్నపేట : వరంగల్ నగరంలోని రంగంపేట ప్రాంతంలో ఆన్లైన్ లావాదేవీల్లో మోసం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్, పోలీసుల కథనం ప్రకారం.. రంగంపేటకు చెందిన భరతపురం సంధ్య నర్సుగా పనిచేస్తోంది. తన వ్యక్తిగత అవసరాల కోసం పరిచయమైన వ్యక్తికి ఫోన్పే ద్వారా రూ.50 వేలు పంపాలని ప్రయత్నించగా ఆ మొత్తం తెలియని వ్యక్తి యూపీఐ ఖాతాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. తప్పు జరిగినట్లు గుర్తించిన వెంటనే ఆమె సంబంధిత వ్యక్తికి ఫోన్ చేసి డబ్బు తిరిగి ఇవ్వమని కోరగా అతడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి స్పందించకపోవడంతో బాధితురాలు సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి డబ్బు రికవరీకి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


