ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ పిలుపు పోస్టర్ను ఆవిష్కరించిన నాయకులు
లక్ష్మీపురం: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఏపీసీఓఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 13న గుంటూరులోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగే ‘రణభేరి–ఇక సమరమే’ సదస్సులో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ చైర్మన్ బి లక్ష్మణరావు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బ్రాడీపేటలోని సీఐటీయూ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో, వివిధ ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత లేదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఆప్కాస్ ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే పోరుబాటకు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో ఏపీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ బి ముత్యాలరావు, సీఐటీయూ కోశాధికారి ఎం.సాంబశివరావు, వివిధ విభాగాల రాష్ట్ర జిల్లా నాయకులు ఎస్ శ్యామ్, వి రమేష్బాబు, సీహెచ్ గోపాలకృష్ణ, పి శ్రీనివాసరావు, రామకృష్ణలు పాల్గొన్నారు.


