గుంటూరు ఎడ్యుకేషన్: పర్యావరణ విద్యపై విద్యార్థులు, యువత చైతన్యవంతులు కావాలని కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ ఎండీ నజీమా బేగం పేర్కొన్నారు. గ్రీన్ సింథసిస్ ఆఫ్ నానో పార్టికల్స్, బయోలాజికల్ యాక్టివిటీ అనే అంశంపై పరిశోధన చేసి ఇటీవల ఏఎన్యూ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్న ప్రభుత్వ మహిళా కళాశాల బోటనీ విభాగాధిపతి డాక్టర్ ఎన్.సంతోషికుమారిని శనివారం జేకేసీ కళాశాల రోడ్డులోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా నజీనా బేగం మాట్లాడుతూ డాక్టరేట్ సాధించడం అనేది కృషి, పట్టుదల, అంకితభావంతో సాధ్యమయ్యే గొప్ప విజయమని పేర్కొన్నారు. సంతోషి కుమారి సాధించిన ఘనత యువతకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు పర్యావరణ విద్య, పరిరక్షణపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు విశేష కృషి చేస్తున్నారని అన్నారు. విద్యార్థులు, యువత, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ కాలుష్య నివారణ, పరిశుభ్రత, మొక్కల పెంపకం, నీటి సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, పర్యావరణ చైతన్యాన్ని వ్యాప్తి చేయడంలో ఆమె చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటీసీ ప్రతినిధి కె.నారాయణ, పర్యావరణ విద్య సమన్వయకర్త డి.తిరుపతి రెడ్డి, ఎవర్గ్రీన్ ఎర్త్ ఫౌండేషన్ ప్రతినిధి జి. చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పర్యావరణ ఇంజినీర్ నజీమాబేగం


