ఒకరిపై ఒకరు మూక దాడులు ఒకే రోజు మూడు ప్రాంతాల్లో ఘటనలు రాత్రిళ్లు కనిపించని పోలీసుల గస్తీ
తాడేపల్లి రూరల్: వీవీఐపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు నివసిస్తున్న తాడేపల్లి పట్టణ పరిధిలో పలు ప్రాంతాల్లో రాత్రిళ్లు గంజాయి, మద్యం మత్తులో తిరుగుతూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ముఖ్య రహదారులైన ఎన్టీఆర్ కరకట్ట, కేఎల్రావు కాలనీ ప్రాంతాల్లో 10 నుంచి 15 మంది యువకులు మూక దాడి చేసుకున్నారు. ఎన్టీఆర్ కరకట్ట వినాయకుడి గుడివద్ద జరిగిన ఘర్షణలో వాహనాలకు అడ్డంగా వెళ్లి కార్లు ఆపి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం విశేషం. ఇంత జరుగుతున్నా అక్కడకు పోలీసులు మాత్రం ఎవరూ రాకపోవడం గమనార్హం.
సీఎం నివాసానికి సమీపంలో
జోరుగా పేకాట
తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి అతి సమీపంలో ఉండవల్లికి చెందిన ఓ యువకుడు పేకాట స్థావరాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నాడు. గుంటూరు టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ పేకాట స్థావరంపై మంగళవారం దాడిచేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ సీఐ–2 మల్లిఖార్జునరావు మాట్లాడుతూ ఎస్బీ డీఎస్పీ ఆదేశాల మేరకు ఉండవల్లిలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో తాడేపల్లి పోలీస్స్టేషన్ సిబ్బంది తోకలసి దాడి చేశామని, ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను, ఆరు ద్విచక్రవాహనాలు, రెండు సెల్ఫోన్లు, రూ. 24500 లు సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ పేకాట స్థావరాన్ని ఉండవల్లికి చెందిన పవన్కుమార్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా టాస్క్ఫోర్స్ పోలీసులు పేకాట నిర్వహిస్తున్న పవన్కుమార్ను అరెస్ట్ చేశారు. స్టేషన్ బెయిల్ తీసుకున్న రెండు రోజుల్లోనే పవన్ మళ్లీ పేకాట నిర్వహించడం విశేషం. ఒకసారి పేకాటలో దొరికిన వారిపై పోలీసుల నిఘా లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నారని స్ధానికులు వ్యాఖ్యానిస్తున్నారు.


