కార్మికుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు
లక్ష్మీపురం: కార్మికవర్గ సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేకపోవడం శోచనీయమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంధ్రనాథ్ అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలనే నినాదంతో ఏఐటీయూసీ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో వివిధ అనుబంధ సంఘాలతో కలిసి కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు చల్లా చినఆంజనేయులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రావులపల్లి మాట్లాడుతూ సుదీర్ఘకాలం కార్మికవర్గం పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లేబర్ కోడ్లను ఉపసంహరించుకుని 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలైన కార్మికుల సమస్యల పరిష్కారానికి కనీసం ఐదు నిముషాలు కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. జూనియర్ డాక్టర్ల సమస్య పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఆకిటి అరణ్కుమార్, నగర అధ్యక్షుడు మంగా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు రావుల అంజిబాబు మాట్లాడారు. ఇష్టా జాతీయ కార్యదర్శి గని తదితరులు పాల్గొన్నారు.


