కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో పంటల బీమా పథకం (పీఎంఎఫ్బీవై) కింద ఖరీఫ్–2026 సంవత్సరానికి ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి మంగళవారం తెలిపారు. వరి పంట వేసుకోవడంతోపాటు రుణం తీసుకున్న రైతులకు మాత్రమే ఈ బీమా గడువు అవకాశం ఉందని పేర్కొన్నారు.
కొల్లూరు: అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు బాపట్ల జిల్లా కొల్లూరు విద్యార్థులు ఇద్దరు ఎంపిక అయ్యారు. నేపాల్లో నిర్వహించనున్న ఇండో – నేపాల్ చాంపియన్ షిప్ పోటీలకు దేశ వ్యాప్తంగా 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఈ పోటీలకు కొల్లూరు పోర్ ప్రంట్ పాఠశాలకు చెందిన గరిక రిత్విక్, మునిపల్లి పునీత్ జట్టుతో కలిసి నేపాల్కు వెళ్లారు.
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన పీజీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఎ.వెంకటేశ్వర్లు మంగళవారం విడుదల చేశారు. డిప్లమా మ్యూజిక్ (వోకల్), ఎంబీఏ మీడియా మేనేజ్మెంట్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నాలుగో సెమిస్టర్లో 94.32 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యూయేషన్ కోసం ఆగస్టు 27 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రతి సబ్జెక్టుకు ఫీజు రూ.1,860, పర్సనల్ వెరిఫికేషన్ ఫీజు రూ.2,190గా నిర్ణయించినట్లు ఆయన వివరించారు.
ఏఎన్యూ (పెదకాకాని): ఫొటోగ్రఫీలో గుర్తింపు కలిగిన మాస్టర్ అవార్డు అందుకోవడం అభినందనీయమని వర్సిటీ వీసీ కె.గంగాధరరావు అన్నారు. 180వ ఫొటోగ్రఫీ దినోత్సవంలో భాగంగా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం ఇద్దరిని ఎంపిక చేసింది. అందులో తెలుగువారైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫొటోగ్రఫీ అతిథి అధ్యాపకుడు శ్రీనివాసరెడ్డి ఉండటం విశేషం. ఏఎన్యూ స్వర్ణోత్సవాలు జరుపుకొంటున్న తరుణంలో అంతర్జాతీయంగా గుర్తింపు సాధించిన శ్రీనివాసరెడ్డిని మంగళవారం వైస్ చాన్సలర్ గంగాధర్రావు, రెక్టార్ ప్రొఫెసర్ ఆర్.శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం తదితరులు ఘనంగా సత్కరించారు.
గుంటూరు వెస్ట్(క్రీడలు): అంతర్జాతీయ ఈత పోటీలకు పలువురు ఎంపికై నట్లు ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం కార్యదర్శి వజ్జా రామకృష్ణ మంగళవారం తెలిపారు. స్విమ్మర్లు అంబటి మన్మథరావు, గంపల సాంబశివరావు, షేక్ ఖాజా మొహిద్దీన్ ఎంపికైనట్లు చెప్పారు. నరసరావుపేటలో ఏపీ అమెచ్యూర్ ఆక్వాంటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆక్వాంటిక్ చాంపియన్షిప్లో వీరు ప్రతిభ చూపారు. అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు బెంగళూరులో నిర్వహించనున్న 2వ ఏషియన్ మాస్టర్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్లో పాల్గొంటారని చెప్పారు. వీరిని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు అభినందించారు.


