గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గుంటూరు జీజీహెచ్లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె మంగళవారానికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు జీజీహెచ్కు చెందిన జూనియర్ వైద్యులు, సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట సమావేశమై స్వచ్ఛంద రిలే నిరాహార దీక్షలు చేశారు. సమ్మె వల్ల గుంటూరు జీజీహెచ్కు వస్తున్న రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా రెండు రోజులుగా అత్యవసర వైద్య సేవలు జూడాలు బహిష్కరించడంతో చికిత్స కోసం వచ్చిన పేద రోగులు వైద్య సేవల్లో జాప్యం ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 500 మందికిపైగా పీజీ వైద్యులు, సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ పీజీలు, సీనియర్ రెసిడెంట్లు, హౌస్ సర్జన్లు, గుంటూరు జీజీహెచ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ మెడికల్ కాలేజ్, మూడు బొమ్మల సెంటర్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. మూడు బొమ్మల సెంటర్లో మానవ హారంగా ఏర్పడి తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ జూడాలు నినాదాలు చేశారు. ప్రభుత్వం న్యాయబద్ధంగా స్టయిఫండ్ను పెంచాల్సి ఉండగా, ఎనిమిది నెలలుగా తాత్సారం చేయడం దారుణమన్నారు. ర్యాలీలో గుంటూరు మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యు.ఈశ్వర్శంకర్, వైస్ ప్రెసిడెంట్స్ ఎ.వి.కృష్ణచౌదరి, కె.ప్రసన్న ఆదిలక్ష్మి, షేక్ సోహిల్ అలీ, జనరల్ సెక్రటరీలు జగదీష్ గాదె, పి.ఎస్.వి.కల్యాణి, విఘ్నేష్ ఆపతి, కోశాధికారులు జేత్ర మర్రిపాటి, అనురాగ్, జాయింట్ సెక్రటరీలు బి.వంశీకష్ణ, బి.స్నేహసాహిత్య, జి.రాధిక, కునపవర్ కార్తిక్, నిషిరాగ్ బికుంతె, పి.సందీప్కుమార్, ఎగ్జిక్యూటీవ్ సభ్యులు ఎన్.సాయిప్రదీప్, ఉదయ్సాగర్, సాయిప్రదీప్, తరుణ్కుమార్, హేమంత్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిదో రోజుకు చేరిన సమ్మె


