ఆగుదామా... సాగుదామా..! | - | Sakshi
Sakshi News home page

ఆగుదామా... సాగుదామా..!

Aug 19 2026 1:47 AM | Updated on Aug 19 2026 1:47 AM

ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌కు కష్టకాలం వానల జాడ లేక వెలవెలబోతున్న పొలాలు వరుణుడి కరుణ కోసం రైతుల ఎదురుచూపులు

కొరిటెపాడు (గుంటూరు): వాన కోసం రైతన్న ఎదురుచూస్తున్నాడు. తొలకరి పలకరింపుతో పొలాల్లో పచ్చని పంటలు కళకళలాడాల్సిన సమయంలో పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఇప్పటికే సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే పంటల సాగు గణనీయంగా తగ్గే పరిస్థితి నెలకొంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నా వర్షం కురవకపోవడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. జూన్‌, జూలై నెలల్లో కురవాల్సిన వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. కృష్ణా పశ్చిమ డెల్టా, నాగార్జునసాగర్‌, గుంటూరు చానల్‌ నుంచి సాగునీరు లేదు. ఒకవేళ బోర్లు, బావుల కింద సాగు చేయాలనుకున్నా రైతులు సైతం భూగర్భ జలాల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. వర్షం పడితేనే సాగు పనులు ప్రారంభించాలని పలువురు ఎదురుచూస్తున్నారు.

భిన్నంగా పరిస్థితి

జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సాగు నత్తనడకతో సాగుతోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు పొలాల్లో విత్తనాలు వేసినా చాలా చోట్ల మొలకెత్తలేదు. గుంటూరు జిల్లాలో 18 మండలాలు ఉండగా, నాలుగు వ్యవసాయ సబ్‌ డివిజన్లు ఉన్నాయి. సాధారణంగా ఖరీఫ్‌లో రైతులు వరి, పత్తి, మిర్చి, మినుము, పెసర, పసుపు, కంది, పూలు, కూరగాయలు, ఆముదం తదితర పంటలు సాగు చేస్తారు. సాధారణంగా ఖరీఫ్‌లో ఈ పాటికి జిల్లాలో కనీసం 90 శాతానికి పైగా పంటలు సాగు కావాల్సి ఉంది. ఈ ఏడాది పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఎల్‌నినోతో జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.

వర్షపాతం అంతంతే..

జూన్‌ నెలలో జిల్లాలో సాధారణ వర్షపాతం 97.10 మి.మీ. పడాల్సి ఉండగా, 90.10 మి.మీ. నమోదైంది. జూలై నెలలో సాధారణ వర్షపాతం 164.90 మి.మీ. పడాల్సి ఉండగా, కేవలం 67.30 మాత్రమే పడింది. ఆగస్టు మాసంలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 95.6 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 48.4 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. మొత్తంగా జూన్‌ నెల నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 357.60 మి.మీ. పడాల్సి ఉండగా, కేవలం 205.8 మి.మీ. మాత్రమే కురిసింది. అంటే 151.80 మి.మీ. లోటు వర్షపాతం ఉంది. ఖరీఫ్‌ ప్రారంభమై రెండున్నర నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, పొలాలు పదునెక్కకపోవడంతో వ్యవసాయం ముందుకు సాగడం లేదు. గుంటూరు జిల్లాలో ఖరీఫ్‌లో 1,09,228 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 52.48 శాతంతో కేవలం 57,325 హెక్టార్లలోనే సాగయ్యాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పడుతున్న వర్షపు జల్లులు తేమ శాతాన్ని పెంచుతున్నాయే తప్ప పంటలు సాగు చేసేందుకు ఉపయోగపడటం లేదు. గత ఏడాదితో పోల్చితే పంటల సాగు గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,06,634 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావడం గమనార్హం. సాగు కాలం తగ్గిపోవడం, దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగైన విస్తీర్ణం

(హెక్టార్లలో)

డ్రై ఫ్రూట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement