నగరంపాలెం: జిల్లాలోని టోల్గేట్, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైవే పెట్రోలింగ్ బృందాలు వాహన తనిఖీలు చేపట్టారు. రాత్రుళ్లు ఎక్కువసేపు వాహనాలు నడిపే లారీ, బస్, ఇతర వాహనాల డ్రైవర్లకు అలసట వల్ల ప్రమాదాలు జరగకుండా స్టాప్ – వాష్ అండ్ గోను అమలు చేశారు. డ్రైవర్లను కాసేపు నిలిపి విశ్రాంతి తీసుకునేలా, నీటితో ముఖం శుభ్రం చేసుకునేలా చేశారు. అలసటగా ఉంటే రహదారుల వెంట కాకుండా, గుర్తించిన పార్కింగ్ ప్రదేశాలు/ సురక్షిత విశ్రాంతి కేంద్రాల్లో వాహనాలను నిలిపాలని సూచించారు. అతివేగం, వక్రమార్గంలో ప్రయాణించడం, మద్యం తాగి వాహనాలు నడపడం, పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్లే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.


