పెదకాకాని: శ్రీ మల్లేశ్వరస్వామి వారి సన్నిధిలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పెదకాకాని శివాలయంలో మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు మంగళవారం ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, అర్చకస్వాములు, వేదపండితుల పర్యవేక్షణలో శ్రీకారం చుట్టారు. కార్యక్రమాలను ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, ధర్మకర్తలు పర్యవేక్షించారు. మొదటి రోజు ఉదయం పవిత్రములు గల వెదురుపేటికలతో యజ్ఞశాల ప్రదక్షిణ పూర్వకంగా యాగశాల ప్రవే శం, శివానుజ్ఞ, శ్రీ విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య పూజ, ప్రాశనం, రక్షాసూత్ర పూజ, ధారణ, బృత్విగ్వరణం, దీక్షాధారణ, అఖండ దీపస్థాపన, యాగేశ్వర కుంభస్థాపన పూజ, వాస్తు కుంభస్థాపన పూజ, వాస్తు శాంతి హోమం, బలి పర్యగ్నీకరణ, బలిహరణ, తీర్థప్రసాద వినియోగం జరిగింది. సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవాయిద్యాలు, చతుర్వేద పారాయణాలు, గోపూజ అనుజ్ఞ, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యం, వాస్తుశాంతి, వాస్తు పర్యగ్నీకరణ, మృత్సంగ్రహణం, అంకురార్పణం, రక్షాబంధనం, మంత్రపుష్పం, హారతి, విభూతి, కుంకుమ ప్రసాద వితరణ జరిగినట్లు ఆలయ ఉప కమిషనర్ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎక్స్అఫీషియో సభ్యుడు పేటేటి ధన మహేశ్వరప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు, ప్రధాన అర్చకులు పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాదు, ఉప ప్రధాన అర్చకులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.


