గుంటూరు వెస్ట్: స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకుడు, మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలు స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాలులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలిలు ఘనంగా నివాళులర్పించారు. జేసీ మాట్లాడుతూ వెంకట కృష్ణారావు జీవిత విశేషాలు, విద్యా రంగానికి, తెలుగు భాషాభివృద్ధికి, సామాజిక సేవకు ఆయన చేసిన విశిష్ట సేవలను వివరించారు. యువతలో సేవాభావం, దేశభక్తి, తెలుగు భాష పట్ల గౌరవాన్ని పెంపొందించేలా వ్యవహరించారన్నారు. మండలి ఆశయాలను భావితరాలకు చేరవేయడం, ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుల్లో ఒకరని, ఆయన రాజకీయవేత్త, గాంధేయవాది, సంఘసేవకుడు, విద్యా–సాంస్కృతిక పరిరక్షకుడుగా సేవలు అందించారన్నారు. ప్రజాసేవను జీవిత ధ్యేయంగా తీసుకొని నిరాడంబర జీవనం గడిపిన ఆయనను ‘దివిసీమ గాంధీ‘ అని గౌరవంగా పిలవడం, ఆయన పట్ల ప్రజలకు గల గౌరవం తెలియజేస్తుందన్నారు. కార్యక్రమంలో పర్యాటక అధికారి రమ్య, కలెక్టరేట్ ఏఓ మల్లేశ్వరి, స్టెప్ సీఈఓ పి.వి.ఎన్.సత్యనారాయణ, మాజీ ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డి.సుబ్రహ్మణ్యం, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.మాణిక్యాలరావు, సీనియర్ సిటిజన్ మాధా రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


