గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు పారా లీగల్ వలంటీర్లకు గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత శాశ్వత న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.ఆర్.రాజీవ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో శాశ్వత న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.వి.రాజీవ్ పారా లీగల్ వలంటీర్ల ముఖ్యమైన బాధ్యతల గురించి వివరించారు. వాటిలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం అంశంపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానంగా మధ్యవర్తిత్వం, సంధానం, రాజీ విధానం ద్వారా న్యాయ పరంగా కేసుల పరిష్కారానికి ఉపయోగపడుతుందని తెలిపారు. సమాజంలో పారా లీగల్ వలంటీర్ల పాత్ర చాలా ముఖ్యమైనదన్నారు. న్యాయ సహాయం అవసరమైన వారిని గుర్తించి వారికి తగు సలహాలు, సూచనలు ఇచ్చి, చట్ట పరమైన సేవల గురించి కూడా అవగాహన కల్పించే బాధ్యత ఉందని తెలిపారు. చిన్న చిన్న ఉదాహరణలతో వలంటీర్లకు అర్ధమయ్యే రీతిలో సివిల్, క్రిమినల్ కేసులను ఎలా పరిష్కరించాలో వివరించారు. ప్యానెల్ అడ్వకేట్ కె.కాళిదాసు, సీనియర్ పారా లీగల్ వలంటీర్ షేక్ మొహమ్మద్ రఫీ మాట్లాడారు.
శాశ్వత న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్
పీవీ రాజీవ్


