పాప ఆరోగ్యం బాగోలేదని లీవ్ తీసుకున్నందుకు చర్యలా? టెక్ మహీంద్రా వైఖరిపై సాఫ్ట్వేర్ ఉద్యోగిని నిరసన
సుభాష్నగర్: దుండిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్పల్లి టెక్ మహీంద్రా కార్యాలయం ఎదుట ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగి ధర్నాకు దిగింది. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన రాజుపాలెం భావన ఈసీఐఎల్ లో నివాసము అంటూ బహదూర్ పల్లి లోని టెక్ మహీంద్రా లో ప్రాసెస్ అసోసియేట్ పనిచేస్తుంది. మూడు రోజులుగా సెలవు తీసుకున్నందున తనను ఉద్యోగం నుంచా అకారణంగా తీసి వేశారు అంటూ బుధవారం దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎలాంటి న్యాయం దొరకకపోవడంతో గురువారం టెక్ మహేంద్ర ముందు కూర్చొని నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న దుండిగల్ పోలీసులు అక్కడికి చేరుకొని యాజమాన్యంతో మాట్లాడగా తనకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ బాధితురాలు భావన ఆరోపించింది. ఈ సందర్భంగా భావన మాట్లాడుతూ తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈనెల 17, 18 20 మూడు రోజులు సెలవు కావాలని యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చి అనుమతి కోరినట్లు వెల్లడించింది. సెలవు కోరిన అనంతరం తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తూ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందిందని ఆరోపించింది. యాజమాన్యం తమపై అనవసర ఒత్తిడి తెస్తోందని, వాష్రూమ్కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని భావన పేర్కొంది. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ విధులకు హాజరు కావాలని ఈ మెయిల్ ద్వారా ఆదేశించారని, సిక్ లీవ్కు వేతనం చెల్లించకపోయినా పనికి రావాలని ఒత్తిడి చేశారని ఆరోపించింది. దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తనకు న్యాయం జరగలేదని, నాకు న్యాయం జరిగే వరకూ కంపెనీ ముందు నిరసన కొనసాగుతుందని సాయంత్రం వరకు అలాగే బైఠాయించింది.


