సర్కారు సంక్షేమ హాస్టళ్లలో వరుస వివాదాలు అధికారి మారినా కొలిక్కిరాని ఇబ్బందులు తీవ్ర ఒత్తిడితో సెలవు ఆలోచనలో జిల్లా అధికారి?
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ బాధ్యతారాహిత్యం రోజురోజుకూ తీవ్రమవుతోంది. నిత్యం వివాదాలు మూటగట్టుకుంటోంది. సిబ్బంది పర్యవేక్షణ లోపంతో హాస్టళ్ల నిర్వహణ గాడితప్పుతోంది. గుంటూరు నగరంలోని సంక్షేమ హాస్టళ్లలో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నగరంలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్కు చెందిన ఓ విద్యార్థిని ఎవరికీ చెప్పకుండా తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. తిరిగి సాయంత్రానికి రావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో కంగుతిన్న సంక్షేమ శాఖ అధికారులు నగరంపాలెం పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ పంచాయితీ నిర్వహించాల్సి వచ్చింది. ఇది హాస్టళ్లలో భద్రతా వైఫల్యాన్ని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో ’ఆకలి’ కేకలు
ఈ ఘటన మరువకముందే.. ఈ నెల 17వ తేదీన ఎస్వీఎన్ కాలనీలోని ఎస్సీ హాస్టల్లో దాదాపు 20 మంది విద్యార్థులకు సరిపడా భోజనం లేకపోవడంతో ఆకలితో అలమటించారు. విద్యార్థులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే హాస్టల్లో కొద్ది నెలల కిత్రం తినే ఆహారంలో బల్లి పడిన విషయం తెలిసిందే. దీంతో హుటాహుటిన అధికారులు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎవరికీ ఏమీ కాలేదని తెలుసుకున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో, కనీస పర్యవేక్షణ చేయడంలోనూ అధికారులు విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శాఖను సమర్థవంతంగా నడిపించేందుకు ఇటీవల కొత్తగా గ్రూప్–1 స్థాయి అధికారిని జిల్లా అధికారిగా నియమించినప్పటికీ, పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదు. జిల్లా అధికారిగా హర్షిత విధులో చేరిన రోజే హాస్టల్ విద్యార్థిని మిస్సింగ్ అవ్వడంతో ఆమె 5 రోజులు సెలవు పెట్టి వెళ్లారు. బాయ్స్ హాస్టల్లో విద్యార్థులకు సక్రమంగా ఆహారం పెట్టకపోవడంపై వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కిందిస్థాయి సిబ్బంది అలసత్వం, పర్యవేక్షణ లోపంతో శాఖపై కంట్రోల్ పూర్తిగా తప్పినట్లు తెలుస్తోంది. రోజుకో వివాదం తెరపైకి రావడం, ప్రభుత్వం వద్ద సమాధానం చెప్పుకోలేక ఒత్తిడి పెరిగిపోవడంతో సంబంధిత జిల్లా అధికారి సెలవుపై వెళ్లేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.


