ప్రజలకు వాస్తవాలను తెలియనివ్వకుండా పాలకుల కుట్రలు నిజాలు ఎప్పటికప్పుడు చెప్పేందుకే ‘జగన్ 2.0 సూపర్ యాప్’ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
గుంటూరు ఎడ్యుకేషన్: ముఖ్యమంత్రి చంద్రబాబు పెంచి పోషిస్తున్న ఎల్లో మీడియా చెప్పిందే వేదం అన్నట్లుగా అబద్ధాలనే నిజాలుగా ప్రచారం సాగిస్తున్న పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవాలను తెలియచెప్పాల్సిన బాధ్యతను వైఎస్సార్ సీపీ తన భుజస్కంధాలపై వేసుకుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం గుంటూరు బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ‘‘జగన్ 2.0 సూపర్ యాప్’’ పోస్టర్లను పార్టీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు (డైమండ్బాబు)తో కలసి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ రాష్ట్రంలోని మెజార్టీ చానల్స్, పత్రికలను తన గుప్పెట్లో పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలు, అరాచకాలను ప్రజలకు తెలియనివ్వడం లేదన్నారు. తన పరిపాలన ఆహో, ఓహో అనే విధంగా ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న వార్తలను ఎల్లో మీడియా పత్రికల్లో రాయరు, చానల్స్లో ప్రసారం చేయరని చెప్పారు. చైతన్యవంతంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ అక్రమాలను ఎండగడుతున్నందున ప్రభుత్వం సోషల్ మీడియా పోస్టులపై దృష్టి పెట్టిందని చెప్పారు. సోషల్ మీడియాపైనా నియంత్రణ తెస్తూ, పోలీసులతో నోటీసులు ఇస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఇవన్నీ వివరించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ‘‘జగన్ 2.0 సూపర్ యాప్’’ను ఆవిష్కరించారని చెప్పారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో తాను పోలీసులపై దాడికి పాల్పడ్డానని ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసిందన్నారు. ఉండవల్లిలో కానిస్టేబుల్ తల పగులగొట్టిన టీడీపీకి చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేయలేదన్నారు. యాప్ను అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు డౌన్లోడ్ చేసుకుని తాజా సమాచారాన్ని, వాస్తవాలను తెలుసుకోవాలని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, విద్యార్థి విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి బి. భానుకిరణ్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూరసాని వెంకట్రెడ్డి, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానం
గూగుల్ ప్లే స్టోర్లో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ అని టైపు చేయగానే వైఎస్ జగన్ చిత్రంతో కూడిన యాప్ కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. అనంతరం సెల్ నంబరు, ఓటీపీ నమోదు చేయాలి. యాప్ వినియోగించే వారి పేరు నమోదు చేసుకుని, ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. తద్వారా ఎప్పటికప్పుడు తాజా పరిణామాలు, వాస్తవాల గురించి తెలుసుకోవచ్చు.


