ఫినిషింగ్ పనులకు గ్రహణం గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలను సకల హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనతో పోల్చితే, రెండేళ్లుగా పాఠశాలల అభివృద్ధికి పైసా నిధులు విదల్చని టీడీపీ సర్కారు పాలన పేరు గొప్ప... ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది. పేద, బడుగు, బలహీనవర్గాలకు నాణ్యమైన విద్యను ఆధునిక వసతులతో అందించాలనే ఆశయంతో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేశారు. ఈ విధంగా నాడు–నేడు మొదటి దశలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ.283 కోట్ల వ్యయంతో 1,183 పాఠశాలలు ఆధునికీకరించారు. అదే విధంగా రెండో విడతలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 563 స్కూళ్లలో రూ.215.75 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. వీటిలో 165 పాఠశాలల్లో 656 అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు 10 కాంపొనెంట్స్ వారీగా పాఠశాలల్లో సకల వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు.
టీడీపీ సర్కారు రాకతో గత రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు అటకెక్కాయి. గత ప్రభుత్వంలో మూడొంతులకు పైగా పూర్తయిన పనులను సైతం పట్టించుకోకపోవడంతో ఆయా పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. అదనపు తరగతి గదులను నిర్మించినా వాటికి ఫినిషింగ్ పనులు చేయకపోవడంతో నిర్మాణం పూర్తయినప్పటికీ తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ పనులు పూర్తి కాక మొండిగోడలతో ఉన్న తరగతి గదులు దర్శనమిస్తున్నాయి. ఒక్కో పాఠశాలలో రూ.లక్షల వ్యయంతో నిర్మించిన తరగతి గదులకు రూ.ఐదు నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేసి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నా, టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
గత ప్రభుత్వంలో 75 శాతానికి పైగా పనులు పూర్తి కాగా, టీడీపీ అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలో ఒక్కపైసా నిధులు కేటాయించకపోవడంతో కిటికీలు, తలుపులు లేని అవే తరగతి గదుల్లో విద్యార్థినులు నేలపై కూర్చుని తరగతులకు హాజరవుతున్నారు. ఫర్నీచర్ సైతం లేకపోవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమీపంలోని మరొక మున్సిపల్ పాఠశాలలో ఉన్న బెంచీలను తెచ్చి ఇక్కడ విద్యార్థినులు కూర్చునేందుకు వేశారు. గతంలో రూ.59.33 లక్షలతో నిర్మించిన మూడు తరగతులకు మరొక రూ.ఐదు లక్షల నుంచి రూ.10 లక్షలు ఖర్చు చేస్తే తరగతి గదులు అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నా, టీడీపీ ప్రభుత్వం దాన్ని విస్మరించింది. దీంతో మారుమూల ప్రాంతాల్లోని హైస్కూళ్లలో సైతం లేని విధంగా గుంటూరు నగరంలోని నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు నేలపై కూర్చోవాల్సిన దుస్థితి ఎదురైంది.
పైసా విదల్చని టీడీపీ ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ హయాంలో
నాడు–నేడు ద్వారా తరగతి
గదులు నిర్మాణం
ఫినిషింగ్ వర్క్స్ చేయడంలో
నేటి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం
గతంలో మూడొంతులకు పైగా పూర్తి
చేసిన పనులకు నేడు మంగళం
కిటికీలు, తలుపులు లేని గదుల్లోనే
నేలపై కూర్చుని చదువులు
కొనసాగిస్తున్న విద్యార్థినులు
ఉపాధ్యాయులకు
కుర్చీలు సైతం కరువు