2014–19 మధ్య టీడీపీ పాలనలో సమస్యలతో కునారిల్లిన ప్రభుత్వ పాఠశాలలకు ప్రాణం పోసిన వైఎస్సార్సీపీ సర్కారు నాడు–నేడు ద్వారా సకల వసతులతో పాఠశాలలను ఆధునికీకరించింది. ఈ విధంగా నాడు–నేడు మొదటి దశలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 1,183 పాఠశాలలను రూ.283 కోట్లతో కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 563 పాఠశాలలను రూ.202 కోట్లతో 10 కాంపొనెంట్ల వారీగా చేపట్టిన పనులు గత ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు 80 శాతానికిపైగా పూర్తయ్యాయి. వీటిలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా చేపట్టిన 600 తరగతి గదుల నిర్మాణాలు సైతం ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే నాడు–నేడు పనులను అటకెక్కించింది. ఒక్కో పాఠశాలకు కేవలం రూ.ఐదు లక్షలు ఖర్చు పెడితే పూర్తయ్యే అవకాశమున్నచోట సైతం పట్టించుకోలేదు. అదనపు తరగతి గదులకు సిమెంట్, ఇసుక సరఫరా చేయకపోవడంతో సివిల్ పనులు మధ్యలోనే అగిపోయాయి. నాడు–నేడు మొదటి దశలో విద్యార్థులకు సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం పంపిణీ చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లు నిర్వహణ లేక, వినియోగంచకుండా పక్కన పడేశారు. రెండో దశలో పాఠశాలలకు ఆర్వో వాటర్ ప్లాంట్లు ఇచ్చినా ఇన్స్టాలేషన్ చేయకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉచిత విద్యకు ఇచ్చిన భరోసా రెండేళ్ల కూటమి పాలనలో కరువైంది.


