రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి బెల్లంకొండ మేజర్ కాలువలో పడి మహిళ మృతి రాజుపాలెం: ద్విచక్రవాహనంపై గ్రామానికి వెళుతూ ప్రమాదవశాత్తూ భార్యాభర్తలు ఎన్ఎస్పీ కాలువలో పడగా భార్య మృతి చెందిన ఘటన మండలంలోని అనుపాలెం సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని అంచులవారిపాలేనికి చెందిన నీలం వెంకయ్య, భార్య అంకమ్మ బైక్పై గుంటూరు బయలుదేరారు. బెల్లంకొండ అడ్డరోడ్డులో ఉంచి, బస్సులో గుంటూరు వెళ్లారు. వైద్యశాలలో మందులు తీసుకుని స్వగ్రామానికి బస్సులో బయలుదేరి అడ్డరోడ్డు వద్ద శనివారం రాత్రి 10 గంటలకు దిగారు. ఇరువురు ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గంమధ్యలో పెద్దకాలువ వద్దకు వెళ్లే సరికి ఎదురుగా లారీ వచ్చింది. లారీ లైట్ల వెలుతురుకు రోడ్డు మార్జిన్ కనిపించకపోవడంతో ద్విచక్రవాహనంతోపాటు భార్యాభర్తలు పెద్ద కాలువలో పడిపోయారు. వెంకయ్య బయటకు రాగా భార్య అంకమ్మ (38)నీటిలో కొట్టుకుపోయింది. వెంకయ్య వేరే ఫోన్ ద్వారా బంధువులకు తెలియపరచడంతో గ్రామస్తులు కాలువ వద్దకు చేరుకుని గాలింపు ప్రారంభించారు. సుమారు రాత్రి 2 గంటల సమయంలో పడిన దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని మాచాయపాలెం లాకుల వద్ద అంకమ్మ మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ మణికృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
బెల్లంకొండ మేజర్ కాలువకు ఇరువైపుల రెయిలింగ్ లేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్ఎస్పీ అధికారులు రెయిలింగ్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం జరిగిందని, రెయిలింగ్ ఉన్నట్లైతే దానికి తగిలి ద్విచక్ర వాహనం ఆగిపోయేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రమాదానికి అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు
ఎనిమిది మందికి గాయాలు
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలైన సంఘటన సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి 20 మంది మత్స్యకారులు ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామంలోని చెరువులో రొయ్యలు పట్టేందుకు వస్తున్నారు.బొల్లేరో వాహనంలో మత్స్యకారులు వస్తుండగా సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్దకు చేరుకోగానే డ్రైవర్కు నిద్రమత్తు రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సంగడి జోగేశ్వరరావు (45) మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కరెయిలింగ్ లేకపోవడంతో ప్రమాదం