
గంజాయి కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు
నగరంపాలెం: గంజాయి కేసుల్లో చిక్కిన నిందితులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ హెచ్చరించారు. జిల్లాలోని పదిహేడు పోలీస్స్టేషన్లల్లో 2016–24 వరకు నమోదైన 113 కేసుల్లో సీజ్ చేసిన 1,868 కిలోల గంజాయి (ఆకు), 2,233 లీటర్ల లిక్విడ్ గంజాయి, 0.023 గ్రాముల ఎండీఎం, ఇతర సింథటిక్ మాదక ద్రవ్యాలను దహనం చేశామని తెలిపారు. నగరంపాలెం పోలీస్ కల్యాణ మండపంలో మంగళవారం ఈగల్ సెల్ ఎస్పీ నగేష్కుమార్, జిల్లా ఏఎస్పీ (ఎల్/ఓ) ఏటీవీ రవికుమార్తో కలిసి జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటిదాకా 44 కేసులు నమోదవ్వగా, 143.96 కిలోల పొడి గంజాయి, 1.172 లీటర్ల ద్రవ గంజాయి, 500 గ్రాముల హైడ్రో గంజాయి, ఇతరత్రా మాదక ద్రవ్యాలను తక్కువ పరిమాణంలో స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ కేసుల్లో 219 మంది నిందితులకు 173 మందిని అరెస్టు చేశామన్నారు. వీరంతా 14– 40 ఏళ్లులోపు వయసు వారు అని చెప్పారు. 107 మంది 25 ఏళ్ల కంటే తక్కువ వయసు వారేనని అన్నారు. గంజాయి సంబంధిత నేరాలకు పాల్పడే వారికి శిక్షలు విధించేందుకు పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం ఉందన్నారు. పదే పదే నేరాలకు పాల్పడే వారిపై ఈ చట్టం కింద ఒక ఏడాది వరకు జైలు శిక్ష ఉంటుందని చెప్పారు. ఈగల్ సమన్వయంతో సోదాలు చేస్తున్నామని పేర్కొన్నారు. రెండుకుపైగా కేసుల్లో నిందితులుగా ఉన్న 82 మందిని గుర్తించగా.. పది మందికి జియో టాగింగ్ పెట్టామని చెప్పారు. తద్వారా వారెవరితో కలుస్తున్నారు, ఎక్కడకెళ్తున్నారు, ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్తున్నారా అనే కోణంలో విచారిస్తున్నామని అన్నారు. ఒడిశా, మల్కాన్గిరి నుంచి గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. జిల్లాలో 36 మాదకద్రవ్య దుర్వినియోగ హాట్స్పాట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆ ప్రాంతాలపై నిఘా ఉందన్నారు. నగర, శివార్లల్లో నిరుపయోగంగా, శిథిలావస్థకు చేరిన భవనాలు, నిర్మాణాలను కూల్చివేయాలని జీఎంసీ అధికారులకు దృష్టికి తీసుకెళ్లామన్నారు. విద్యుత్ లేని ప్రదేశాల్లో దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపామని అన్నారు. ఈగల్ సెల్ విభాగం ఎస్పీ నగేష్బాబు మాట్లాడుతూ ఇప్పటిదాకా 68 వేల కిలోల గంజాయి సీజ్ చేశామన్నారు. వాటిని ధ్వంసం చేసేందుకు జిల్లాల్లో బృందాలను నెలకొల్పామని అన్నారు. ఈగల్ ఏర్పాటయ్యాక గంజాయి నిర్మూలనకై ఎన్ఫోర్స్మెంట్తోపాటు డ్రగ్స్ వద్దు బ్రో, సేఫ్ క్యాంపస్ జోన్, ఆపరేషన్ ఎన్నారై స్టడ్స్ వంటి నూతన అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ఇటీవల తెనాలిలో కొన్ని హాట్స్పాట్ను పరిశీలించామని అన్నారు. ఆయా ప్రాంతాల్లో నిఘా ఉంటుందని అన్నారు. సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ శివాజీరాజు, సీఐలు రాజశేఖర్రెడ్డి (డీటీసీ), విక్టర్ (ఈగల్) తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిందాల్ ప్లాంట్ వారి సహకారంతో ఓబులునాయుడుపాలెం సమీపంలోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లో గంజాయి తదితరాలను దహనం చేశారు.
జిల్లా ఎస్పీ సతీష్కుమార్ హెచ్చరిక ఈగల్ సెల్ సమన్వయంతో విస్తృత సోదాలు చేస్తున్నట్లు వెల్లడి రెండుకుపైగా కేసుల్లో నిందితులైన వారిపై ‘జియో ట్యాగింగ్’ నిఘా గతంలో పట్టుబడిన గంజాయిని దహనం చేసిన పోలీసులు