భర్తపై భార్య యాసిడ్‌ దాడి | - | Sakshi
Sakshi News home page

భర్తపై భార్య యాసిడ్‌ దాడి

Apr 30 2025 5:10 AM | Updated on Apr 30 2025 5:10 AM

భర్తప

భర్తపై భార్య యాసిడ్‌ దాడి

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

పెదకాకాని: భర్తపై భార్య యాసిడ్‌తో దాడి చేసిన సంఘటన పెదకాకానిలో చోటు చేసుకుంది. విశాఖపట్నం గాజువాకకు చెందిన గండికోట బాలకృష్ణ సొంతగా లారీలు బాడుగకు తిప్పుకుంటున్నాడు. అతనికి గుంటూరుకు చెందిన రమణమ్మతో రెండు నెలల కిందట అడిగొప్పలలో వివాహమైంది. అప్పటికే రమణమ్మకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఈనెల 26వ తేదీన వట్టిచెరుకూరు మండలంలో కుర్నూతల ఉన్న బాలకృష్ణ సోదరి ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈ శుభకార్యానికి వెళ్లడానికి వీలులేదంటూ భార్య రమణమ్మ అడ్డుతగలడంతో వెళ్లకుండానే ఆగిపోయారు. ఈ నేపధ్యంలో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. సోమవారం రాత్రి బాలకృష్ణ గుంటూరు నుంచి మంగళగిరి మండలంలోని కాజ గ్రామంలో ఉన్న స్నేహితుడిని కలిసేందుకు బైక్‌పై బయలు దేరాడు. మార్గమధ్యంలో పెదకాకాని శివారులో జాతీయ రహదారి పక్కనే ఉన్న పల్లాలమ్మ చెరువు వద్దకు మరొక వ్యక్తి సహకారంతో కారులో భార్య రమణమ్మ అక్కడికి చేరుకుంది. రోడ్డుపై వెళుతున్న భర్త బైక్‌ను ఆపి వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను ముఖంపై పోసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ దాడిలో గాయపడిన బాలకృష్ణను స్థానికులు 108 వాహనంలో గుంటూరు తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు.

ముగిసిన మహా మంజీరనాదం

నగరంపాలెం: గత వారం రోజులుగా బృందావన్‌గార్డెన్స్‌ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ నిర్వహిస్తున్న 15వ అంతర్జాతీయ నృత్య దినోత్సవాలు (మహా మంజీర నాదం –2025) మంగళవారంతో ముగిశాయి. నటరాజ స్వామి ‘వందన రఘు నందన‘ అనే త్యాగరాజ కీర్తనకు దాదాపు 200 మంది కళాకారులు నృత్యర్చన చేశారు. సాయంత్రం జరిగిన ముగింపు సభకు ఆలయ అధ్యక్షుడు మస్తానయ్య జ్యోతిప్రజ్వలన చేయగా, సంస్థ నిర్వాహకులు భూసురపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సిరిపుల్‌ రాజమోహన్‌ (కేరళ) మోహిని అట్టం, అవిజిత్‌ కుందు (బెంగళూరు) భరత నాట్యం ప్రదర్శించారు. అనంతరం కళారత్న పురస్కార గ్రహీత డాక్టర్‌ కాజ వెంకటసుబ్రహ్మణ్యంకు పసుమర్తి కృష్ణమూర్తి స్మారక జీవిత సాఫల్య శత గురు జయంతి పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి, సంస్థ కోశాధికారి వెంకటగిరి నాగలక్ష్మి పాల్గొన్నారు.

శిరిగిరిపాడు ఎస్సీ కాలనీలో ఇరువర్గాల ఘర్షణ

వెల్దుర్తి: మండలంలోని శిరిగిరిపాడు ఎస్సీ కాలనీలో ఇరువర్గాలు ఘర్షణ పడి రాళ్లు రువ్వుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ఆరుమళ్ల విజయ్‌, కొమ్ము బొంగురు మాచర్ల పట్టణంలో సోమవారం రాత్రి పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ పడి దాడులు చేసుకున్నారు. వీరు స్వగ్రామమైన శిరిగిరిపాడులో బంధువులకు సమాచారం అందింది. మంగళవారం ఉదయం ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. మధ్యాహ్నం మరోసారి రాళ్లు వేసుకున్నారు. కాలనీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలనీకి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. కాలనీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.

భర్తపై భార్య యాసిడ్‌ దాడి 1
1/1

భర్తపై భార్య యాసిడ్‌ దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement