
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
చేబ్రోలు: ప్రమాదవశాత్తూ రెండు వాహనాలు ఢీ కొన్న సంఘటనలో ఆటో డ్రైవర్ అక్కడక్కడే మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాపట్లకు చెందిన గోదాటి కిరణ్ (35) ఆటోలో గుంటూరులో ముగ్గురు ప్రయాణికులను ఎక్కించుకొని బాపట్లకు బయలు దేరాడు. మార్గ మధ్యలో చేబ్రోలు సినిమా హాలు దాటిన తరువాత వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న టాటా ఇంద్ర వాహనం ఢీ కొట్టింది. ఆటో నడుపుతున్న కిరణ్ తలకు బలమైన గాయవటంతో ఆటోలోనే అక్కడక్కడే మరణించాడు. ఆటోలో ఉన్న మిగిలిన ముగ్గురికి ఎటువంటి గాయాలు కాలేదు. చేబ్రోలు పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కిరణ్ బాపట్ల పట్టణంలోని బేతానీ కాలనీ వాసిగా గుర్తించారు.
26 నుంచి ఏఐఎస్ఎఫ్ శిక్షణ తరగతులు
లక్ష్మీపురం: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఏప్రిల్ 26, 27, 28వ తేదీలలో కడప నగరంలో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి కరపత్రాలు విడుదల చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా బందెల నాసర్జీ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపై తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికి రూ. 15వేలు ఇస్తామని హామీ ఇచ్చినా ఈ సంవత్సరం అమలు చేయలేమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రణీత్, వెంకట్, అజయ్, అమీర్, సాయి గణేష్, చందు, కిషోర్, ఏలియా, అశోక్
లైంగిక వేధింపుల కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలి రూరల్: వివాహితను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితను అదే గ్రామానికి చెందిన పాలపర్తి మహేష్బాబు లైంగికంగా వేధిస్తున్నాడని ఈ నెల 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు అందింది. పరారీలో ఉన్న నిందితుడిని రూరల్ ఎస్సై కె. ఆనంద్ మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిపై గతంలో ఆరు కేసులు ఉన్నాయి. రౌడీ షీట్ తెరుస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
ప్రాథమిక విద్య గ్రామంలోనే
కొనసాగించాలి
అచ్చంపేట: ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తమ గ్రామంలోనే నిర్వహించాలని, పాఠశాలను పక్కగ్రామాలకు తరలిస్తే తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని మండలంలోని ఓర్వకల్లు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. తమ పిల్లలతో కలిసి రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తమ గ్రామానికి చెందిన పిల్లలు తమ గ్రామంలోనే చదువుకోవాలంటూ నినాదాలు చేశారు. ఓర్వకల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు వరకు ఉండేవి. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి 1,2 తరగతులను మాత్రమే ఇక్కడ ఉంచి 3,4,5 తరగతుల వారిని పక్క గ్రామమైన రుద్రవరానికి మార్చారు. దీంతో ప్రాథమిక విద్య మొత్తం తమ గ్రామంలోనే నిర్వహించాలంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ధర్నా చేపట్టారు. వెంటనే జిల్లా కలెక్టర్, డీఈఓ, ప్రజాప్రతినిధులు జోక్యంచేసుకుని తమకు న్యాయం చేయాలంటూ మొర పెట్టుకున్నారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి రోడ్డుపై బైఠాయించిన వారికి నచ్చచెప్పి ధర్నాను విరమింపచేశారు.

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి