దక్షిణాసియా ప్రస్తుతం ఒక విరుద్ధమైన కూడలిలో నిలిచి ఉంది. సాంకేతికత, వ్యవస్థాపకత కారణంగా ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థలు అద్భుతమైన వేగంతో దూసుకు పోతుండగా, మరోవైపు ఒక నిశ్శబ్ద జీవ క్రియ సంక్షోభం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లా దేశ్ టైప్ 2 డయాబెటిస్ (మధుమేహం), గుండె జబ్బులకు ప్రపంచ కేంద్రాలుగా మారాయి. ఆందోళనకరమైన విషయం ఏంటంటే, పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే దాదాపు పదేళ్లు ముందే – అంటే 30 ఏళ్ల చివర్లో, 40 ఏళ్ల ప్రారంభంలోనే – ఇక్కడి ప్రజలు గుండెపోట్లు, తీవ్రమైన జీవక్రియ రుగ్మతల బారిన పడుతున్నారు.
శతాబ్దాల నాటి పొదుపు వాస్తవికత
ఇది కేవలం జీవనశైలి లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మాత్రమే జరుగుతున్నది కాదు. దీని వెనుక ‘దక్షిణాసియా థిన్–ఫ్యాట్ ఫినోటైప్’ అనే ప్రత్యేకమైన జీవశాస్త్ర సత్యం దాగుంది. ఇక్కడి ప్రజలు బయటికి చూసేందుకు సన్నగా కనిపించినప్పటికీ, వారి లోపల ముఖ్యమైన అవయవాల చుట్టూ ప్రమాదకరమైన స్థాయిలో అంతర్గత కొవ్వు (విసెరల్ ఫ్యాట్) పేరుకుపోయిఉంటుంది. ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవడం, దీనికి పరిష్కారం కనుగొనడం దక్షిణాసియా దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికీ, కుటుంబ సంక్షేమానికీ అత్యంత అవసరం.
శతాబ్దాలుగా పదే పదే వచ్చిన కరవులు, ఆహార కొరత ఇక్కడి ప్రజల జన్యురూపాన్ని ప్రభావితం చేశాయి. ప్రకృతి ఎంపిక ప్రకారం, శరీరంలో శక్తిని అత్యంత సమర్థవంతంగా నిల్వ చేసు కోగల వ్యక్తులకే మనుగడ సాధ్యమైంది. ఈ మనుగడ యంత్రాంగాన్నే ఇప్పుడు ‘థ్రిఫ్టీ జీన్’ (పొదుపు జన్యువు) సిద్ధాంతం అని పిలుస్తున్నారు. కేలరీలు సమృద్ధిగా లభిస్తున్న, శారీరక శ్రమ లేని ఆఫీస్ ఉద్యోగాలు, మోటారు వాహనాలు, విపరీతంగా ప్రాసెస్ చేసిన ఆహారాలున్న నేటి యుగంలో, ఒకప్పుడు ప్రాణాలు కాపాడిన ఈ జన్యు లక్షణమే ఇప్పుడు శాపంగా మారింది.
దీని ఫలితంగా శరీరంలో దీర్ఘకాలిక తక్కువ స్థాయి వాపు, ఇన్సులిన్ నిరోధకత, అవయవాల చుట్టూ వేగంగా కొవ్వు పేరుకు పోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. లక్షలాది కుటుంబాలలో, ఒకే ఒక్క దీర్ఘకాలిక అనారోగ్యం – ముఖ్యంగా అదికుటుంబ పెద్దకు వచ్చినప్పుడు – వారిని తీర్చలేని వైద్య అప్పుల్లోకీ, తరతరాల పేదరికంలోకీ నెట్టేస్తుంది.
ప్రధానంగా పాశ్చాత్య జనాభాను బట్టి రూపొందించిన సాంప్ర దాయ బి.ఎమ్.ఐ. (బాడీ మాస్ ఇండెక్స్) బరువు చార్టులు తరచుగా దక్షిణాసియా ప్రజలకు ఒక తప్పుడు భద్రతా భావాన్ని (భ్రమను) కల్పిస్తాయి. దీనివల్ల, చాలామంది అంతర్గతంగా ఆరోగ్య ప్రమాదా లను ఎదుర్కొంటున్నప్పటికీ, వారి బరువు ‘సాధారణంగానే’ఉంటుంది.
‘ప్రామాణిక’ కొలతలు పట్టించే తప్పుదోవ
పాశ్చాత్యులలో అధిక బరువు పరిమితి 25.0 బీఎంఐగా ఉంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రజలకు దీనిని 23.0 గానే నిర్ణయించింది; ఎందుకంటే మనకు తక్కువ బరువు ఉన్నప్పటికీ శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే, పాశ్చా త్యులలో 50 ఏళ్ల తర్వాత మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువగాఉంటే, దక్షిణాసియా వాసులలో 30 ఏళ్ల నుండే ఈ ప్రమాదంపొంచి ఉంది. పాశ్చాత్యులలో సాధారణంగా చర్మం కింద కొవ్వు చేరితే, దక్షిణాసియా ప్రజలలో కీలక అవయవాల చుట్టూ పేరుకు పోతుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపించి మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తుంది.
ఖరీదైన జిమ్లు, సుదీర్ఘమైన వర్కవుట్ సెషన్ లతో కూడిన పాశ్చాత్య తరహా ఫిట్నెస్ సంస్కృతి ఇక్కడి రద్దీ నగరాలు, ట్రాఫిక్, కాలుష్యం కారణంగా ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. అదృష్టవ శాత్తూ, సైన్స్ మనకు ఒక ఆచరణాత్మకమైన, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది: అదే ‘ఎక్సర్సైజ్ స్నాకింగ్’ (చిన్న చిన్న విరామాలలో వ్యాయామం చేయడం).
‘డయాబెటోలాజియా’ వంటి జర్నల్స్లో ప్రచురితమైన పరిశో ధనల ప్రకారం – ముఖ్యంగా భోజనం చేసిన 20–30 నిమిషాల తర్వాత 8–12 నిమిషాల పాటు వేగంగా నడవడం, మెట్లు ఎక్కడం లేదా ఒకే చోట నిలబడి మార్చ్ చేయడం వంటి చిన్నపాటి శారీరక శ్రమలు భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు ప్రమాదకరంగా పెరగకుండా గణనీయంగా తగ్గిస్తాయి. సహజంగానే తక్కువకండర ద్రవ్యరాశి (మన శరీరంలోని సహజ ‘గ్లూకోజ్ సింక్’) ఉండే దక్షిణాసియా శరీర తత్వానికి, ఈ చిన్న, స్థిరమైన పనులు ఎంతో శక్తిమంతంగా పనిచేస్తాయి.
ఆచరణాత్మక పరిష్కారాలు
30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ సింపుల్ పరీక్షల ద్వారా తమ వార్షిక ‘మెటబాలిక్ బేస్లైన్’ (జీవక్రియ స్థితి)ని తెలుసుకోవాలి: హెబీఏ1సీ (3 నెలల సగటు రక్తంలో చక్కెర శాతం), ఫాస్టింగ్ గ్లూకోజ్, బీపీ, మూత్రపిండాల పనితీరు (క్రియాటినిన్), కాలేయ ఎంజైములు, థైరాయిడ్ ఆరోగ్యం కోసం టీఎస్హెచ్ పరీక్షలు చేయించుకోవాలి. స్థానిక ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ స్క్రీనింగ్ పరీక్షలను గ్రామాల్లో సైతం అందుబాటులోకి తేవచ్చు.
భారీగా కార్బోహైడ్రేట్లు ఉండే భోజనాలకు దూరంగాఉండండి. పప్పులు, శనగలు, పెరుగు, గుడ్లు, మొలకెత్తిన గింజలు వంటి మనకు అలవాటైన ఆహారాలతో ప్రోటీన్ పరిమాణాన్నిపెంచండి. సబ్జా గింజలు, ఇసబ్గోల్ను రోజూ మీ ఆహారంలో చేర్చుకోండి. ఈ సాంప్రదాయ పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయు లను స్థిరీకరించడానికీ, ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ అద్భుతంగా పనిచేస్తాయి. ప్రధాన భోజనంలో ప్రోటీన్, కార్బో హైడ్రేట్ల నిష్పత్తి సుమారుగా 1:1 ఉంచడంవల్ల శరీరంలో వాపు గణనీయంగా తగ్గుతుంది. పాశ్చాత్య నమూనాలను గుడ్డిగా అనుస రించకుండా మన ప్రత్యేక జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, మన శరీరాలకూ, మన వాస్తవికతలకూ సరిపోయే పరిష్కారాలను మనం కనుగొనవచ్చు.
-వ్యాసకర్త ఇండో–అమెరికన్ బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్త; ‘రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్’ డైరెక్టర్
-మేడా పరమేశ్వర రెడ్డి


