breaking news
Economies
-
‘ఎడారి’ బతుకు.. బితుకు!
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రాచ్యంలో ఇరాన్ సంక్షోభం తీవ్రం కావడంతో గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా దుబాయ్ రంగుల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలింది. విమానయానం, పర్యాటకం, నిర్మాణ రంగాలపై ఆధారపడిన ఈ ఎడారి నగరాలు ఇప్పుడు నిరుద్యోగ నిలయాలుగా మారాయి. గల్ఫ్ రీజియన్లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రైవేటు రంగాలు భారీగా నష్టాల్లో కూరుకుపోయాయి. భార త విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం కేవ లం ఫిబ్రవరి చివరి వారం నుంచి ఏప్రిల్ మధ్య కాలం నాటి కే సుమారు 10 లక్షల మంది భారతీయ కార్మికులు గల్ఫ్ ప్రాంతంలో ఉద్యోగాలు కోల్పోయి, లేదా రక్షణ లేక స్వదేశానికి తిరిగి వచ్చేశారంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.యూఏఈలోని కంపెనీల యజమానులపై ‘మ్యాన్పవర్ గ్రూప్’జరిపిన సర్వే ప్రకారం 25 శాతం కంపెనీలు ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగులను పూర్తిగా తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.33 శాతం కంపెనీలు కొత్తగా ఎలాంటి రిక్రూట్మెంట్లు చేయకూడదని నిర్ణయించాయి. 50 శాతం వరకు వేతనాల కోత విధించడంతోపాటు ఉద్యోగాల్లో కొనసాగుతున్న మిగిలిన కార్మికులకు 20–50 శాతం వరకు జీతాలు తగ్గించారు. గల్ఫ్ దేశాలలో ఉన్న మొత్తం 90 లక్షల మంది భారతీయ వలస కార్మికులలో దాదాపు సగానికి పైగా జనాభా ఈ ఉద్యోగ ముప్పు పరిధిలో ఉన్నారు. తగ్గిన రెమిటెన్స్ ఆదాయం.. విదేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపే నిధుల (రెమిటెన్స్) ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున విదేశీ మారకం లభిస్తోంది. అయితే ఈ యుద్ధ వాతావరణం వల్ల భారత ఆదాయానికి గండిపడింది. కేవలం గల్ఫ్ దేశాల నుంచి ఏడాదికి వచ్చే సుమారు రూ.4 లక్షల కోట్లకు పైగా రెమిటెన్స్ ఆదాయం ఇప్పుడు నిలిచిపోయే ప్రమాదంలో పడింది. భారత్కు ప్రపంచవ్యాప్తంగా వచ్చే మొత్తం రెమిటెన్స్లలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల వాటానే 38 శాతం ఉంటోందని సమాచారం. దుబాయ్ నుంచే అత్యధికంగా 19 శాతం నిధులు వస్తాయి. ఈ ఆదాయం ఆగిపోవడంతో భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్యాకేజీ ప్రకటించినా.. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడుల నేపథ్యంలో యూఏఈ వైమానిక మార్గాలు మూతపడడం, పర్యాటకం క్షీణించడంతో దుబాయ్ లూప్లైన్లోకి వెళ్లిపోయింది. వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం గల్ఫ్ రీజియన్ ఆర్థిక వృద్ధి రేటు గత ఏడాది ఉన్న 4.4 నుంచి ప్రస్తుతానికి 1.3 శాతానికి పడిపోయింది. స్థానిక వ్యాపారాలు దివాళా తీయకుండా కాపాడటానికి దుబాయ్ ప్రభుత్వం రూ.5,600 కోట్లకు పైగా అత్యవసర ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అయినప్పటికీ అంతర్జాతీయ విమాన సర్వీసులు తగ్గడం వల్ల హోటళ్లు, రిటైల్ మాల్స్ వెలవెలబోతున్నాయి. నిర్మాణ రంగం స్తంభన దుబాయ్ అనగానే గుర్తొచ్చే ఆకాశహార్మ్యాల నిర్మాణం ఇప్పుడు పూర్తిగా మందగించింది. అబుదాబి చాంబర్ ఆఫ్ కామర్స్ నివేదికల ప్రకారం ప్రైవేట్ రంగంలో దాదాపు 45 శాతం నిర్మాణ ప్రాజెక్టులు తాత్కాలికంగా నిలిచిపోయాయి లేదా రద్దయ్యాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ రవాణా మార్గంలో ఉద్రిక్తతల వల్ల ఉక్కు, సిమెంట్, ఇతర బిల్డింగ్ మెటీరియల్స్ సరఫరా నిలిచిపోయింది. రవాణా ఖర్చులు పెరగడంతో నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగింది. దీనివల్ల నిర్మాణ రంగంలో రోజువారీ కూలీలుగా పనిచేసే లక్షలాది మంది భారతీయులు జీతాలు అందక లేబర్ క్యాంపులకే పరిమితమయ్యారు. ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఈ సునామీ దుబాయ్ను నిర్మించిన శ్రామిక శక్తిని రోడ్డున పడేసింది. అటు గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోల్పోయి, ఇటు స్వదేశంలో సరైన ఉద్యోగాలు దొరక్క లక్షలాది మంది వలస జీవులు నిరుద్యోగ ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. వెసులుబాటు దుర్పినియోగం.. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతర్లోని కొన్ని కంపెనీలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒక నెల వేతనం చెల్లించకపోతే కంపెనీలను గతంలో బ్లాక్ లిస్టులో పెట్టేవారు. ఇప్పుడు మూడు నెలలు వేతనాలు ఇవ్వకపోయినా బ్లాక్ లిస్టులో పెట్టకుండా కంపెనీలకు ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. ఈ అవకాశాన్ని కొన్ని కంపెనీలు దుర్పినియోగం చేస్తున్నాయి. కంపెనీలు స్థోమత ఉన్నప్పటికీ వేతనాలు చెల్లించడం లేదు.బహ్రెయిన్ రావొద్దు.. యుద్ధ ప్రభావం బహ్రెయిన్లో అధికంగా ఉంది. అనేక కంపెనీలు కార్మికులకు తాత్కాలిక సెలవులు ప్రకటించి ఇంటికి పంపిస్తున్నాయి. 3–4 నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదు. కంపెనీలు ఆర్థికంగా నష్టపోవడంతో కార్మికుల ఉపాధిపై దెబ్బ పడింది. ఎవరైనా ఇప్పట్లో బహ్రెయిన్ రాకపోవడమే మంచిది. ఇక్కడ ఉన్నవాళ్లే క్రమక్రమంగా ఇంటికి వస్తున్నారు. – శ్రీనివాస్ గుప్తా, రేకులపల్లి గ్రామం, నిజామాబాద్దారులు మూసుకుపోయాయి వ్యక్తిగత కారణాలతో రెండు నెలల క్రితం బహ్రెయిన్ నుంచి ఇంటికి వచ్చాను. యుద్ధం తీవ్రం కావడంతో కంపెనీ సెలవులు ఇచ్చింది. సెలవు ముగిసినప్పటికీ అక్కడికి వెళ్లలేకపోతున్నాను. ఖతర్ వెళ్తామంటే కొత్త వీసాల జారీపై ఆంక్షలు విధించారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధికి అడ్డంకులు ఏర్పడ్డాయి. యుద్ధం ఆగితే తప్ప గల్ఫ్ ఉపాధిపై ఆశలు చిగురించే అవకాశం లేదు. – కొట్టూరి రాకేష్ , తొర్తి గ్రామం, నిజామాబాద్ -
దక్షిణాసియాలో కనబడని సంక్షోభం
దక్షిణాసియా ప్రస్తుతం ఒక విరుద్ధమైన కూడలిలో నిలిచి ఉంది. సాంకేతికత, వ్యవస్థాపకత కారణంగా ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థలు అద్భుతమైన వేగంతో దూసుకు పోతుండగా, మరోవైపు ఒక నిశ్శబ్ద జీవ క్రియ సంక్షోభం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లా దేశ్ టైప్ 2 డయాబెటిస్ (మధుమేహం), గుండె జబ్బులకు ప్రపంచ కేంద్రాలుగా మారాయి. ఆందోళనకరమైన విషయం ఏంటంటే, పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే దాదాపు పదేళ్లు ముందే – అంటే 30 ఏళ్ల చివర్లో, 40 ఏళ్ల ప్రారంభంలోనే – ఇక్కడి ప్రజలు గుండెపోట్లు, తీవ్రమైన జీవక్రియ రుగ్మతల బారిన పడుతున్నారు.శతాబ్దాల నాటి పొదుపు వాస్తవికతఇది కేవలం జీవనశైలి లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మాత్రమే జరుగుతున్నది కాదు. దీని వెనుక ‘దక్షిణాసియా థిన్–ఫ్యాట్ ఫినోటైప్’ అనే ప్రత్యేకమైన జీవశాస్త్ర సత్యం దాగుంది. ఇక్కడి ప్రజలు బయటికి చూసేందుకు సన్నగా కనిపించినప్పటికీ, వారి లోపల ముఖ్యమైన అవయవాల చుట్టూ ప్రమాదకరమైన స్థాయిలో అంతర్గత కొవ్వు (విసెరల్ ఫ్యాట్) పేరుకుపోయిఉంటుంది. ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవడం, దీనికి పరిష్కారం కనుగొనడం దక్షిణాసియా దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికీ, కుటుంబ సంక్షేమానికీ అత్యంత అవసరం.శతాబ్దాలుగా పదే పదే వచ్చిన కరవులు, ఆహార కొరత ఇక్కడి ప్రజల జన్యురూపాన్ని ప్రభావితం చేశాయి. ప్రకృతి ఎంపిక ప్రకారం, శరీరంలో శక్తిని అత్యంత సమర్థవంతంగా నిల్వ చేసు కోగల వ్యక్తులకే మనుగడ సాధ్యమైంది. ఈ మనుగడ యంత్రాంగాన్నే ఇప్పుడు ‘థ్రిఫ్టీ జీన్’ (పొదుపు జన్యువు) సిద్ధాంతం అని పిలుస్తున్నారు. కేలరీలు సమృద్ధిగా లభిస్తున్న, శారీరక శ్రమ లేని ఆఫీస్ ఉద్యోగాలు, మోటారు వాహనాలు, విపరీతంగా ప్రాసెస్ చేసిన ఆహారాలున్న నేటి యుగంలో, ఒకప్పుడు ప్రాణాలు కాపాడిన ఈ జన్యు లక్షణమే ఇప్పుడు శాపంగా మారింది. దీని ఫలితంగా శరీరంలో దీర్ఘకాలిక తక్కువ స్థాయి వాపు, ఇన్సులిన్ నిరోధకత, అవయవాల చుట్టూ వేగంగా కొవ్వు పేరుకు పోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. లక్షలాది కుటుంబాలలో, ఒకే ఒక్క దీర్ఘకాలిక అనారోగ్యం – ముఖ్యంగా అదికుటుంబ పెద్దకు వచ్చినప్పుడు – వారిని తీర్చలేని వైద్య అప్పుల్లోకీ, తరతరాల పేదరికంలోకీ నెట్టేస్తుంది. ప్రధానంగా పాశ్చాత్య జనాభాను బట్టి రూపొందించిన సాంప్ర దాయ బి.ఎమ్.ఐ. (బాడీ మాస్ ఇండెక్స్) బరువు చార్టులు తరచుగా దక్షిణాసియా ప్రజలకు ఒక తప్పుడు భద్రతా భావాన్ని (భ్రమను) కల్పిస్తాయి. దీనివల్ల, చాలామంది అంతర్గతంగా ఆరోగ్య ప్రమాదా లను ఎదుర్కొంటున్నప్పటికీ, వారి బరువు ‘సాధారణంగానే’ఉంటుంది. ‘ప్రామాణిక’ కొలతలు పట్టించే తప్పుదోవపాశ్చాత్యులలో అధిక బరువు పరిమితి 25.0 బీఎంఐగా ఉంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రజలకు దీనిని 23.0 గానే నిర్ణయించింది; ఎందుకంటే మనకు తక్కువ బరువు ఉన్నప్పటికీ శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే, పాశ్చా త్యులలో 50 ఏళ్ల తర్వాత మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువగాఉంటే, దక్షిణాసియా వాసులలో 30 ఏళ్ల నుండే ఈ ప్రమాదంపొంచి ఉంది. పాశ్చాత్యులలో సాధారణంగా చర్మం కింద కొవ్వు చేరితే, దక్షిణాసియా ప్రజలలో కీలక అవయవాల చుట్టూ పేరుకు పోతుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపించి మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఖరీదైన జిమ్లు, సుదీర్ఘమైన వర్కవుట్ సెషన్ లతో కూడిన పాశ్చాత్య తరహా ఫిట్నెస్ సంస్కృతి ఇక్కడి రద్దీ నగరాలు, ట్రాఫిక్, కాలుష్యం కారణంగా ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. అదృష్టవ శాత్తూ, సైన్స్ మనకు ఒక ఆచరణాత్మకమైన, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది: అదే ‘ఎక్సర్సైజ్ స్నాకింగ్’ (చిన్న చిన్న విరామాలలో వ్యాయామం చేయడం).‘డయాబెటోలాజియా’ వంటి జర్నల్స్లో ప్రచురితమైన పరిశో ధనల ప్రకారం – ముఖ్యంగా భోజనం చేసిన 20–30 నిమిషాల తర్వాత 8–12 నిమిషాల పాటు వేగంగా నడవడం, మెట్లు ఎక్కడం లేదా ఒకే చోట నిలబడి మార్చ్ చేయడం వంటి చిన్నపాటి శారీరక శ్రమలు భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు ప్రమాదకరంగా పెరగకుండా గణనీయంగా తగ్గిస్తాయి. సహజంగానే తక్కువకండర ద్రవ్యరాశి (మన శరీరంలోని సహజ ‘గ్లూకోజ్ సింక్’) ఉండే దక్షిణాసియా శరీర తత్వానికి, ఈ చిన్న, స్థిరమైన పనులు ఎంతో శక్తిమంతంగా పనిచేస్తాయి. ఆచరణాత్మక పరిష్కారాలు30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ సింపుల్ పరీక్షల ద్వారా తమ వార్షిక ‘మెటబాలిక్ బేస్లైన్’ (జీవక్రియ స్థితి)ని తెలుసుకోవాలి: హెబీఏ1సీ (3 నెలల సగటు రక్తంలో చక్కెర శాతం), ఫాస్టింగ్ గ్లూకోజ్, బీపీ, మూత్రపిండాల పనితీరు (క్రియాటినిన్), కాలేయ ఎంజైములు, థైరాయిడ్ ఆరోగ్యం కోసం టీఎస్హెచ్ పరీక్షలు చేయించుకోవాలి. స్థానిక ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ స్క్రీనింగ్ పరీక్షలను గ్రామాల్లో సైతం అందుబాటులోకి తేవచ్చు.భారీగా కార్బోహైడ్రేట్లు ఉండే భోజనాలకు దూరంగాఉండండి. పప్పులు, శనగలు, పెరుగు, గుడ్లు, మొలకెత్తిన గింజలు వంటి మనకు అలవాటైన ఆహారాలతో ప్రోటీన్ పరిమాణాన్నిపెంచండి. సబ్జా గింజలు, ఇసబ్గోల్ను రోజూ మీ ఆహారంలో చేర్చుకోండి. ఈ సాంప్రదాయ పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయు లను స్థిరీకరించడానికీ, ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ అద్భుతంగా పనిచేస్తాయి. ప్రధాన భోజనంలో ప్రోటీన్, కార్బో హైడ్రేట్ల నిష్పత్తి సుమారుగా 1:1 ఉంచడంవల్ల శరీరంలో వాపు గణనీయంగా తగ్గుతుంది. పాశ్చాత్య నమూనాలను గుడ్డిగా అనుస రించకుండా మన ప్రత్యేక జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, మన శరీరాలకూ, మన వాస్తవికతలకూ సరిపోయే పరిష్కారాలను మనం కనుగొనవచ్చు.-వ్యాసకర్త ఇండో–అమెరికన్ బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్త; ‘రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్’ డైరెక్టర్-మేడా పరమేశ్వర రెడ్డి -
వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి..
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా ఒక ట్వీట్ చేసారు. ఇందులో ''ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినప్పుడు ధనవంతులు కావడం ఎలా'' అనే విషయం వెల్లడించారు.ధనవంతుడిని $లో కొలుస్తారు.సంపన్నుడిని TIMEలో కొలుస్తారు.ఉదాహరణకు ఒక ధనవంతుడు ఇలా అనవచ్చు: “నా దగ్గర బ్యాంకులో $1 మిలియన్ ఉంది.ఒక సంపన్నుడు ఇలా అనవచ్చు: “నేను ఈ రోజు పని చేయకపోయినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏడు నెలలు జీవించగలను.ఇప్పుడు చెప్పు.. నువ్వు డబ్బు ఎక్కువగా సంపాదించడానికి పనిచేస్తున్నావా?, లేక దీర్ఘకాలంగా సంపదను నిర్మించుకుని నిజమైన ధనవంతుడు కావడానికి పనిచేస్తున్నావా?. ధనవంతుడు డబ్బు సంపాదించాలి, సంపన్నుడి కోసం డబ్బు పనిచేస్తుందని కియోసాకి పేర్కొన్నారు.ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో, అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే పాటించాను.ఆర్థిక సంక్షోభం సమయంలో మీ సంపదను పెంచుకోవడానికి మీరు ఏమి చేస్తారు?. ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కఠినమైన ఆర్థిక పరిస్థితులు తలత్తే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండు అని కియోసాకి ట్వీట్ ముగించారు.LESSON # 7:: How to get richer as the world economies crash:Are you working to get rich or are you working to get wealthy?Definitions: Rich is measured in $.Wealth is measured in TIME.For example a rich person might say: “I have $1 million in the bank.”A wealthy…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 8, 2025 -
ప్రపంచంలోని 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు: లేటెస్ట్ రిపోర్ట్
భారత ఆర్ధిక వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ఇండియా.. జర్మనీ, జపాన్లను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పలువురు నిపుణులు చెబుతూనే ఉన్నారు.భారతదేశం ప్రపంచానికి విద్యా కేంద్రంగా మారగలదని, మిగతావన్నీ పక్కన పెడితే మన దేశంలోని ప్రజాస్వామ్యమే మనకు అతిపెద్ద ప్రయోజనమని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాన్ని ఇటీవలే వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ అతిపెద్దది. వచ్చే ఏడాది చివరి నాటికి మనం నాల్గవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉండబోతున్నాము. ఆ తర్వాత ఏడాది మూడవ అతిపెద్దదిగా ఉంటామని ఆయన వివరించారు.ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ GDPకి గణనీయంగా దోహదపడతాయి. అంతే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక విధానాలపై కూడా బలమైన ప్రభావాన్ని చూపుతాయి. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక ప్రకారం.. టాప్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇలా..➤యునైటెడ్ స్టేట్స్ (యూఎస్): 30.507 ట్రిలియన్ డాలర్లు➤చైనా: 19.231 ట్రిలియన్ డాలర్లు➤జర్మనీ: 4.744 ట్రిలియన్ డాలర్లు➤భారతదేశం: 4.187 ట్రిలియన్ డాలర్లు➤జపాన్: 4.186 ట్రిలియన్ డాలర్లు➤యునైటెడ్ కింగ్డమ్ (యూకే): 3.839 ట్రిలియన్ డాలర్లు➤ఫ్రాన్స్: 3.211 ట్రిలియన్ డాలర్లు➤ఇటలీ: 2.422 ట్రిలియన్ డాలర్లు➤కెనడా: 2.225 ట్రిలియన్ డాలర్లు➤బ్రెజిల్: 2.125 ట్రిలియన్ డాలర్లు -
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే?
భారతదేశం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంతో పోలిస్తే టెక్నాలజీ ఇప్పుడు మరింత ఊపందుకుంటోంది. ఈ కారణంగా 2023లో ప్రపంచంలోని అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థలుగా వృద్ధి చెందిన దేశాల జాబితాలో ఇండియా 5 వ స్థానంలో చేరింది. ఒక దేశం GDPని అంచనా వేయడానికి మొత్తం వినియోగ వస్తువులు, కొత్త పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయాలు, ఎగుమతుల నికర విలువ ఉపయోగపడుతుంది. అయితే 2023లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఏది? ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో అమెరికా మొదటి జాబితాలో ఉంది. ఐదవ స్థానంలో భారత్ చేరగా.. 10వ స్థానంలో బ్రెజిల్ ఉంది. 2023లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన 10 దేశాలు & జీడీపీ.. అమెరికా - 26854 బిలియన్ డాలర్లు చైనా - 19374 బిలియన్ డాలర్లు జపాన్ - 4410 బిలియన్ డాలర్లు జర్మనీ - 4309 బిలియన్ డాలర్లు ఇండియా - 3750 బిలియన్ డాలర్లు యూకే - 3159 బిలియన్ డాలర్లు ఫ్రాన్స్ - 2924 బిలియన్ డాలర్లు ఇటలీ - 2170 బిలియన్ డాలర్లు కెనడా - 2090 బిలియన్ డాలర్లు బ్రెజిల్ - 2080 బిలియన్ డాలర్లు ప్రపంచంలోని టాప్ 10 దేశాల వారీగా జీడీపీ.. 👉అమెరికా జీడీపీ: 26854 బిలియన్ తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 80,030 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 1.6 శాతం 👉చైనా జీడీపీ: 19374 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 13,720 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 5.2 శాతం 👉జపాన్ జీడీపీ: 4,410 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 35,390 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 1.3 శాతం 👉జర్మనీ జీడీపీ: 4,309 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 51,380 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: -0.1 శాతం 👉ఇండియా జీడీపీ: 3,750 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 2,601 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 5.9 శాతం 👉యూకే (యునైటెడ్ కింగ్డమ్) జీడీపీ: 3,159 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 46,370 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: -0.3 శాతం 👉ఫ్రాన్స్ జీడీపీ: 2,924 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 44,410 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 0.7 శాతం 👉ఇటలీ జీడీపీ: 2,170 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 36,810 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 0.7 శాతం 👉కెనడా జీడీపీ: 2,090 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 52,720 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 1.5 శాతం 👉బ్రెజిల్ జీడీపీ: 2,080 బిలియన్ డాలర్లు తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ: 9,670 డాలర్లు వార్షిక జీడీపీ వృద్ధి రేటు: 0.9 శాతం -
ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధిలో మనమే టాప్!
న్యూఢిల్లీ: భవిష్యత్లో ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల (అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్) వృద్ధి స్పీడ్లో భారత తొలి దేశంగా ఉంటుందని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ ఉద్ఘాటించారు. భారత్ పురోగతిలో ప్రవాస భారతీయులను ఒక ఉ్రత్పేరకం వలె పని చేయాలని, భారతదేశాన్ని అతిపెద్ద అవకాశంగా మార్చడంలో ప్రభుత్వ ప్రయత్నాలకు అనుబంధంగా ఉండాలని కోరారు. రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ గ్లోబల్ నివేదిక భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 3.4 ట్రిలియన్ డాలర్ల 2031 నాటికి రెట్టింపై 6.7 ట్రిలియన్ల డాలర్లకు రెట్టింపు అవుతుందని పేర్కొన్న ఇటీవలి నివేదికను సోమనాథన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. జనాభా ప్రకారం ఇది అతిపెద్ద దేశం. ఏ ప్రాతిపదికన చూసినా, భారతదేశ వృద్ధి రేటు మొదటి నాలుగు దేశాల కంటే చాలా వేగంగా ఉంది. ఈ నాలుగు దేశాలూ భారతదేశం కంటే తక్కువ వృద్ధి రేటునే కలిగి ఉంటాయని మనం బల్లగుద్దిమరీ చెప్పగలం’’ అని ఆయన ఒక ప్రసంగంలో పేర్కొన్నారు. అవకాశాల పరిమాణం పరంగా చూస్తే, భారతదేశం భవిష్యత్తులో అతిపెద్ద అభివృద్ధి అవకాశంగా నిస్సందేహంగా కొనసాగుతుందని చెప్పవచ్చని ఇండియాస్పోరా జీ20 ఫోరమ్లో సోమనాథన్ అన్నారు. 2022–23లో 7.2 శాతంగా ఉన్న భారత్ వృద్ధి రేటు 2023–24 మధ్య 6 నుంచి 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉందని వివిధ సంస్థలు అంచనావేస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో దాతృత్వం కంటే పెట్టుబడి చాలా ముఖ్యమైనది కావచ్చు. పెట్టుబడి కంటే సాంకేతికత బదిలీ కీలకం కావచ్చు. డబ్బు కంటే మీ జ్ఞానం ముఖ్యమైనది కావచ్చు. – ఇండియాస్పోరా జీ20 ఫోరమ్లో ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ -
రష్యా చమురు ధరపై పరిమితితో సంక్షోభం!
ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాను నయానో, భయానో తమ దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా, దాని మిత్రదేశాలూ శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే కొత్తగా జీ7, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ దేశాలు... రష్యా ఎగుమతి చేసే ముడి చమురు ధరపై బ్యారెల్కు 60 డాలర్ల కనీస పరిమితి విధిస్తూ క్రితం వారం నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఒపెక్ ప్లస్ (రష్యా) దేశాలు మాత్రం రానున్న నెలల్లో ముడిచమురు ఉత్పత్తిని రోజుకు 20 లక్షల బ్యారెల్స్ తగ్గిస్తామని వెల్లడించాయి. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు మందకొండిగా ఉండటమే ఇందుకు కారణమంటున్నాయి. కాగా చమురు ఉత్పత్తిని పెంచమని అమెరికా అధ్యక్షుడు సౌదీ అరేబియాపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రపంచ చమురు ఎగుమతి చేసే దేశాల్లో 2వ స్థానంలో రష్యా ఉంది. చమురు ధరపై కనీస పరిమితి విధించి చమురు ఎగుమతి ద్వారా వచ్చే ఆదాయాలను నీరుగార్చి రష్యా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి తీసుకెళ్లాలనేది ఈయూ దేశాల తపన. ఇది సఫలీకృతమైతే అమెరికా తన ఆధిపత్యం కొనసాగనీయ వచ్చనేది వ్యూహం. రష్యా ముడిచమురు ధరపై పరిమితి విధించడాన్ని క్రెమ్లిన్ తీవ్రస్థాయిలో ఖండించింది. రష్యాపై ఆంక్షలు విధించినప్పుడల్లా ప్రపంచ దేశాలపై ముఖ్యంగా ఐరోపా దేశాలపై అవి తీవ్ర ప్రతికూల ప్రభావాల్ని కలుగ జేస్తున్నాయని రష్యా గుర్తుచేసింది. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో ముడిచమురు ధరలు 2022 ఫిబ్రవరి నుండి పెరుగుతూ వస్తున్నాయి. దీనితో ఈ సంవత్సరం రష్యా అదనంగా 41 శాతం లాభాలను పెంచుకొని ఆంక్షలు విధించిన దేశాలకు, అమెరికాకు షాక్ ఇచ్చింది. రష్యాతో స్నేహంగా లేని దేశాలకు మొత్తం ముడిచమురు ఎగుమతులను ఆపేసి, ప్రత్యామ్నాయ మార్కెట్లుగా వేరే దేశాలను (భారత్, చైనాలు) ప్రోత్సహిస్తామని రష్యా అంటోంది. మన విదేశాంగమంత్రి జైశంకర్ కూడా రష్యాపై ఆంక్షలకూ భారత్కూ సంబంధంలేదని స్పష్టం చేశారు. ఈ వారంలో జర్మనీ విదేశాంగమంత్రి అన్నాలేనా బేర్బాక్ న్యూఢిల్లీలో జైశంకర్ను కలిసి ఈయూ విధించిన పరిమితి ధరకు మద్దతునివ్వాలని అభ్యర్థించగా జైశంకర్ తోసి పుచ్చారు. యూరప్ ఇంధన అవసరాలకు అనుగుణంగా భారత్ ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోజాలదని అన్నారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభం కాక ముందునుందే భారత్, రష్యాల మధ్య ముడిచమురు వాణిజ్యం ఉందని జైశంకర్ అన్నారు. బ్యారెల్ ముడి చమురు ధర 60 డాలర్లకూ, అంత కన్నా తక్కువ బిల్లు చేస్తే... ప్రపంచ ఇన్సూరెన్స్ కంపె నీలు బీమా చేయడానికి ముందుకురావు. దీనితో రష్యా ముడిచమురు రవాణా స్తంభించి పోతుందని ఈయూ ఆలోచన. ముడి చమురుపై పరిమితి విధించిన రెండురోజుల్లో బ్యారెల్ చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 2 శాతం పెరిగింది. పరిశ్రమలకు అత్యంత అవసరమైన ఇంధన రవాణాను నిలిపివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు చిన్నా భిన్నమైపోతాయి. ఇదివరలో యూరప్ దేశాలకు రష్యా ముడి చమురు చాలా ఎగుమతి జరిగేది. తాత్కాలికంగా కొంతమేర దిగుమతులు ఆపినప్పటికీ రష్యా ఇంధనాన్ని ఈయూ దేశాలు వేరే మూడవ దేశం ద్వారా దిగుమతి చేసుకొంటున్నాయి. లిథువేనియా 83 శాతం, ఫిన్లాండ్ 80 శాతం, స్లొవేకియా 74 శాతం, పోలాండ్ 58 శాతం, హంగేరి 43 శాతం, ఎస్తోనియా 34 శాతం, జర్మనీ 30 శాతం, గ్రీస్ 29 శాతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాయి. మిగతా దేశాల దిగుమతి కూడా ఇంచు మించు 15 శాతం తగ్గకుండా ఉంది. ఇప్పుడు అకస్మాత్తుగా ధరల పరిమితి విధింపుతో రష్యాతోపాటుగా ఈయూ దేశాల ఆర్థిక వ్యవస్థలూ చాలా నష్టపోనున్నాయి. రానున్న వారాల్లో ముడి చమురు ధర అంతర్జాతీయంగా 100 డాలర్లు దాటుతుందని నిపుణుల అభిప్రాయం. ఇదివరకటి ‘విన్–విన్’ వాణిజ్య పరిస్థితులు ఇప్పుడు ‘లాస్–లాస్’ పరిస్థితులుగా పరిణమించాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ధరలు తగ్గినప్పుడల్లా లాభాలను కార్పొరేట్లు అనుభవిస్తున్నారు. ధరలు పెరుగు తునప్పుడు నష్టాల భారాన్ని ప్రజలపై మోపటంతో ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతూ వస్తోంది. ఫలితంగా ప్రతి దేశంలోనూ ద్రవ్యోల్బణం పెరుగుదలతోపాటు నిరుద్యోగం, నిత్యా వసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇందువల్ల జీవన ప్రమాణాలు తగ్గిపోతూ ఆర్థిక మాంద్యం వైపు దేశాలు కుంటుతున్నాయి. ఉక్రెయిన్–రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణించిన సైనికుల కంటే... ఈ చలికాలం యూరప్లో ప్రజలు ఇంధన కొరతతో ఎన్నో రెట్లు చలిబారిన పడి చనిపోతారని అంచనా వేస్తున్నారు. యుద్ధాన్ని నివారించక, శాంతి చర్చలు జరగనీయకుండా ఆయుధాలతో, ఆంక్షలతో యుద్ధం పరిసమాప్తమవుతుందని అనుకోవటం అవివేకం. ఇప్పటికే రష్యాపై ఆంక్షలతో యూరప్ ప్రజలు, పరోక్షంగా అభివృద్ధి చెందుతున్న దేశాలూ తీవ్రంగా నష్టపోతున్నాయి. అమెరికా మాత్రం లబ్ధిపొందుతోంది. 3 సంవత్సరాల క్రితం ఒపెక్ దేశాలు, రష్యా ఆర్థిక వ్యవస్థలను నష్ట పరచే విధంగా అమెరికా షేల్ చమురును ప్రవేశపెట్టడంతో బ్యారెల్ చమురు 28 డాలర్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా విధించిన ఈ కనీస 60 డాలర్ల పరిమితి వల్ల నష్టపోయేదీ ఈయూ దేశాలే. ప్రపంచ సాకర్ వేళ ఇది ఈయూ ‘సెల్ఫ్ గోల్’ కానుందా! (క్లిక్ చేయండి: డేటా రక్షణకు ఢోకా లేనట్లేనా?!) - బుడ్డిగ జమిందార్ అసోసియేట్ ప్రొఫెసర్, కె. ఎల్. వర్సిటీ -
సంపన్న ఎకానమీపై గీతా గోపీనాథ్ వ్యాఖ్యలు
దావోస్: అభివృద్ధి చెందిన ఎకానమీలు 2024 నాటికి తిరిగి ట్రాక్లోకి వస్తాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు మళ్లీ పురోగతి పట్టాలెక్కకపోతే, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు 5 శాతం దిగువనే ఉంటుందని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం 2022 సందర్భంగా ‘ప్రపంచ తదుపరి వృద్ధి ధోరణి’ అనే అంశంపై జరిగిన ప్రత్యేక సెషన్లో ఆమె చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... ♦ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ప్రతికూల ప్రభావాలకు లోనయ్యాయి. నెమ్మదిగా తిరిగి కోలుకుంటున్నాయి. ఈ రికవరీకి ఉక్రెయిన్లో రష్యా యుద్ధం మళ్లీ విఘాతంగా మారింది. ♦ యుద్ధం వల్ల ఇంధనం, ఆహారంతో సహా వస్తువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ప్రపంచం తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటోంది. దీనితో ప్రపంచ వృద్ధి ధోరణిపట్ల డౌన్గ్రేడ్ దృక్పధాన్ని కలిగి ఉన్నాము. ♦ ప్రధానంగా అధిక స్థాయి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. వడ్డీ రేట్లను తీవ్రంగా పెంచుతున్నాయి. ఈ చర్యలు తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంది. అయితే ఆయా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక, వాణిజ్య విభాగాలపై త్రీవ ప్రతికూల పరిణామాలకు దారితీసే వీలుంది. ♦ కోవిడ్, తదనంతరం యుద్ధ వాతావారణ పరిస్థితుల నేపథ్యంలో వృద్ధికి సంబంధించి ప్రపంచ దేశాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు నెలకొన్నాయి. ఆర్థిక వనరుల వినియోగం, వ్యాక్సినేషన్ వంటి అంశాల్లో వైరుధ్యాలు దీనికి కారణం. ♦ ఆహారం, ఇంధనం, వనరుల సంక్షోభాలు ఇప్పుడు వృద్ధి అసమతౌల్యతకు దారితీసే అవకాశాలు ఏర్పడినందున దీర్ఘకాలిక ఆర్థిక శ్రేయస్సు, అంతర్జాతీయ పరస్పర సహకారం వంటి అంశాలపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యం అధికారాలు మరోసారి చేపట్టడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. చైనాను పదేపదే విమర్శిస్తూ.. రాబోయే ఎన్నికల్లో గెలవాలని ట్రంప్ భావిస్తున్నారా అంటే అవుననే ఊహాగానాలే వినిపిస్తున్నాయి. నవంబర్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాగా.. చైనా- అమెరికా సంబంధాలపై అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్ జైజర్ గురువారం ఓ ట్వీట్ చేస్తూ.. అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. వెంటనే దీనిని డొనాల్డ్ ట్రంప్ ఖండిస్తూ.. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను పూర్తిస్థాయిలో విడదీయడం సహేతుకమైన విధానం కాదంటూ వ్యాఖ్యానించారు. కాగా.. చైనా- అమెరికా వాణిజ్య ఒప్పందం చాలా గొప్పదని నేను భావిస్తున్నాను. మేము చైనీస్ ప్లేగుతో బాధపడుతున్నప్పటి నుంచి కూడా ఆ దేశంతో ప్రతిదానికీ నేను భిన్నంగా ఉన్నాను. నేను ఎప్పుడూ చైనాపై కఠినంగానే వ్యవహరిస్తున్నాను. అమెరికా- చైనా వాణిజ్య ఒప్పందం ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులను చైనా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని చైనా అధికారి యాంగ్ జీజీ, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో పేర్కొన్నారు. అయితే.. అమెరికాలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ట్రంప్.. బీజింగ్కు వ్యతిరేకంగా తన మాటల వేడిని పెంచారు. కరోనాని 'చైనా నుండి వచ్చిన ప్లేగు'గా పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి ప్రారంభ దశలో ఆ దేశం సమాచారాన్ని ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిందని ఆరోపించారు. చదవండి: ట్రంప్పై బోల్టన్ సంచలన వ్యాఖ్యలు దీనిపై ట్రంప్ యొక్క మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ పలు ఆరోపణలు చేశారు. అమెరికా రైతుల నుంచి వ్యవసాయోత్పతులను చైనా కొనుగోలు చేయాలని ఆ దేశాన్ని ట్రంప్ కోరారని, పైగా అధ్యక్ష పదవికి నవంబరులో జరిగే ఎన్నికల్లో తనకు సాయం చేయాల్సిందిగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఒసాకాలో గత ఏడాది జూన్లో జరిగిన జీ-20 సమావేశం సందర్భంగా వాణిజ్య అంశాలపై ఇరు దేశాల అధ్యక్షలు చర్చించారని జాన్ బోల్టన్ తన పుస్తకంలో వెల్లడించాడు. అదే సమయంలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచేందుకు చైనా అధ్యక్షుడి సాయాన్ని కోరినట్లు ‘ది రూమ్ వేర్ ఇట్ హ్యాపెండ్’ పుస్తకంలో జాన్ బోల్టన్ వివరించాడు. ఈ విమర్శల బారినుంచి బయటపడడానికి జాన్ బోల్టన్ రాసిన ఓ పుస్తకాన్ని డొనాల్డ్ ట్రంప్ బ్యాన్ చేశారు. దీంతో ట్రంప్ చర్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. బోల్టన్ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ.. ఈ రచయిత చట్టాన్ని ఉల్లంఘించారని, ఇది తప్పుడు సమాచారమంటూ ట్వీట్ చేశారు. ఇందులో అన్నీ అబధ్ధాలు, ఫేక్ స్టోరీస్ ఉన్నాయని అన్నారు. జాన్ బోల్టన్ ప్రచారం చేసుకుంటున్న సంఘటనలేవీ జరగలేదన్నారు. ఆయనను మూర్ఖుడుగా అభివర్ణించారు. చదవండి: డీఏసీఏపై ట్రంప్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ -
ఆశ, శ్వాస.. యువ భారతమే
ఒక దేశ ఆర్థికాభివృద్ధికి.. ఆ దేశంలోని కార్మిక శక్తి అత్యంత కీలకం. సహజ వనరులు ఎన్నున్నా.. భారీగా పెట్టుబడులు, అద్భుతమైన విధానాలు, సాంకేతికత అందుబాటులో ఉన్నా వీటికి పనిచేసే చేతులు తోడైతేనే సమాజానికి సంపద అందుతుంది. మానవాభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే.. అన్ని హంగులు, సామర్థ్యాలున్నా ప్రపంచంలోని చాలా దేశాల్లో పనిచేసేందుకు అవసరమైన కార్మికశక్తి లేకపోవడం ఆ దేశాలను కలవరపెడుతోంది. జనన రేటు తగ్గుదల కారణంగా జనాభా పెరుగుదల రేటు బాగా మందగించడం పెద్ద సమస్యగా మారింది. రాబోయేతరం పెద్దగా లేకపోవడంతో కార్మికశక్తి కొరత ఉంది. ఉత్పాదకత తగ్గిపోవడం, ఆర్థికవృద్ధి మందగించడం, అదే సమయంలో వృద్ధుల అవసరాల కోసం మరిన్ని నిధులు కేటాయించాల్సిరావడం వల్ల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఆ దేశాల్లో ఈ పరిస్థితులు దశాబ్దాల పాటు కొనసాగుతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) పేర్కొంది. భారత్లో పరిస్థితి భిన్నం భారతదేశ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మన జనాభాలో సగం పాతికేళ్ల లోపువారే. మూడింట రెండొంతుల మంది 35 ఏళ్లలోపు వారే. ఈ స్థాయిలో యువశక్తి ఉన్న దేశం భారత్ ఒక్కటే. ఒక విశ్లేషణ ప్రకారం 2027 నాటికి భారత్లో పని చేయగల సామర్థ్యం ఉన్న జనాభా (15–64 వయోశ్రేణి) వంద కోట్లకు చేరనుంది. దేశంలో సగటు సంతానోత్పత్తి రేటు 2.3 (సగ టున ఒక్కో మహిళకు పుట్టే బిడ్డలు). తమిళ నాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లో ఇది 1.6గా ఉంది. ఈ మూడు చోట్ల సంతానోత్పత్తి రేటు ఇంచుమించు జర్మనీ, ఇటలీ (1.5) స్థాయిలో క్షీణించిందని, ఫ్రాన్స్ (2) బ్రిటన్, అమెరికా (1.9) కంటే తగ్గిపోయిందని యూఎన్ఎఫ్పీఏ (ఐరాస జనాభా నిధి) డేటా చెబుతోంది. యూపీ, మధ్యప్రదేశ్, బిహార్లలో సగటున ప్రతి మహిళా ముగ్గురికి పైగా పిల్లల్ని కంటున్నారు. బిహార్లో దేశంలో అత్యధిక జననాలు (3.3) నమోదవుతున్నాయని తాజా రికార్డులు వెల్లడిస్తున్నాయి. వీరందరికీ విద్య, శిక్షణ, నైపుణ్యాలను అందించడం, మౌలిక సదుపాయాలపరంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించడం వంటి నిర్మాణాత్మక చర్యలపై ప్రభుత్వాలు ఎంతమేరకు దృష్టి పెడతాయనే దానిపైనే మన దేశ ఆర్థికాభివృద్ధి ఆధారపడి వుందని సామాజికవేత్తలు చెబుతున్నారు. క్షీణించిన విద్యా ప్రమాణాలు.. దేశంలో 14–18 వయసు పిల్లల్లో 57% మంది కనీసం రెండో తరగతి భాగాహారాలు కూడా చేయలేకపోతున్నారని ఇటీవల వెలువడిన వార్షిక విద్యా స్థితిగతుల నివేదిక వివరించింది. క్షీణించిన విద్యా ప్రమాణాలను మెరుగు పరచడంపై దృష్టి పెట్టాలని ఇలాంటి ఎన్నో నివేదికలు పదే పదే నొక్కి చెబు తున్నాయి. విద్య, వైద్య రంగాలపై పెట్టుబడుల పెట్టడం వల్ల నాణ్యమైన మానవ వనరులు సమకూరుతాయని, వృద్ధిరేటును పెంచుకోవడంలో ఇది అత్యంత కీలకమని సామాజికవేత్తలు వివరిస్తు న్నారు. స్కిల్ ఇండియా వంటి పథకాలను సమర్థంగా అమలు చేయడం, పని చేయగల జనాభాను ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తిలో భాగస్వాముల్ని చేయడం, సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడంపై కేంద్రం మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. వన్ చైల్డ్ పాలసీకి నో ప్రపంచంలోని రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో.. దీర్ఘకాలంగా అమలు చేసిన ఒకే బిడ్డ విధానం (వన్ చైల్డ్ పాలసీ) కారణంగా జనాభా పెరుగుదల రేటు తగ్గింది. జననాల రేటు ఎక్కువగా వుండటం, 30 ఏళ్ల లోపు జనాభా మూడింట రెండొంతులకు చేరడం వంటి కారణాల నేపథ్యంలో చైనా ప్రభుత్వం 1979లో ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. వృద్ధ జనాభా పెరిగిపోయిన కారణంగా 35 ఏళ్ల పాటు కొనసాగించిన ఈ విధానానికి 2016లో స్వస్తి పలికింది. అధిక యువ జనాభాకి ఆర్థిక సరళీకరణ విధానాలు తోడవడంతో.. దాదాపు మూడు దశాబ్దాల పాటు చైనా దూసుకుపోయింది (1990 తర్వాత తొలిసారిగా ఆ దేశ వృద్ధి రేటు 2018లో 6.6%కు పడిపోయింది). వచ్చే పాతికేళ్లలో పని చేయగల సామర్థ్యమున్న వయో శ్రేణి 67% నుంచి 57% పడిపోనుంది. దీనికారణంగా 2040 నాటికి చైనా తలసరి జీడీపీ 15% మేర క్షీణిస్తుందని తాజా అంచనాలు చెబుతున్నాయి. తగ్గుతున్న వర్కింగ్ ఏజ్ గ్రూప్ - పని చేయగల జనాభా (15–64 వయోశ్రేణి) తగ్గిపోతున్న దేశాల సంఖ్య ప్రస్తుతం 40కి చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం.. అమెరికాలో 1975–2015 మధ్య 20–64 ఏళ్ల మధ్యనున్న వారి జనాభా ఏడాదికి 1.24% మేర పెరిగింది. కానీ తర్వాతి 40 ఏళ్లలో ఈ పెరుగుదల 0.29% మించబోదని అంచనా. ఐరోపాలో 2015–2055 మధ్య పని చేసే జనాభా 20శాతానికి పడిపోనుంది. - జపాన్లో మరెక్కడా లేనంతగా వృద్ధులు పెరిగిపోయారు. 65 ఏళ్లు పైబడిన వారే 26.3%గా ఉన్నారు. 2030 నాటికి వీరి సంఖ్య 32.2%కు చేరుతుందని అంచనా. - 2030 నాటికి బ్రిటన్లో 65ఏళ్లు పైబడిన వారు దాదాపు 50%కు చేరుకోనున్నారు. ఉద్యోగ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో పనుల్లో కొనసాగుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. - ఇటలీలో 65% వయసు పైబడిన వారు 22.4% దాటారు. అక్కడ యువ జనాభా 14% మాత్రమే. - పలు అభివృద్ధి చెందిన దేశాలూ సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల జీడీపీపై, వినియోగంపై ఇది ప్రభావం చూపనుంది. బడ్జెట్లో వృద్ధుల ఆరోగ్యం, పింఛను సహా సామాజిక భద్రత కోసం వెచ్చించాల్సిన మొత్తాలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఉదాహరణకు 2014లో జర్మనీ జీడీపీలో 26శాతం పింఛను సహా ఇతరత్రా వృద్ధుల అవసరాలకు వెచ్చించాల్సి వచ్చింది. - 2015లో ఇటలీ జీడీపీలో 16.5 శాతం పింఛన్లదే. యూరోపియన్ యూనియన్లో గ్రీస్ తర్వాత పింఛన్ల కోసం ఇంత మొత్తం వెచ్చిస్తున్న రెండో దేశం ఇటలీయే. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. పేద దేశాలు మరింతగా సంక్షోభంలోకి కూరుకుపోతాయని ఐరాస హెచ్చరిస్తోంది. కృత్రిమ మేధతో భర్తీ అయ్యేనా? వృద్ధ జనాభా పెరుగుదల సమస్య ఒక సంక్షోభం రూపు దాల్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చుట్టుముట్ట గలదని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని.. అమెరి కాకు చెందిన పీటర్సన్ ఇనిస్టిట్యూట్ హెచ్చరిస్తోంది. అయితే, ఈ సమస్యను చాలా మంది తక్కువ అంచనా వేస్తున్నారు. కృత్రిమ మేధ సహా రకరకాల సాంకేతికతల సాయంతో కార్మిక, ఉద్యోగుల కొరతను అధిగమించవచ్చునని భావిస్తున్నారు. ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని మానవ కొరత దుష్ప్రభావాన్ని ఊహించడం కష్టమని స్పష్టం చేసింది. బిడ్డల్ని కనండి.. జననాల రేటు పెంచేందుకు కొన్ని దేశాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. జర్మనీ దశాబ్ద కాలంగా పిల్లలను కనేవారికి కల్పించే ప్రయోజనాలను, శిశు సంరక్షణ సౌకర్యాలను విస్తరించింది. దీంతో అక్కడ 2016లో (1996 తర్వాత తొలిసారిగా) ఎక్కువ మంది బిడ్డలు జన్మించారు. ఫ్రాన్స్, సింగపూర్, దక్షిణ కొరియా, టర్కీ, జపాన్ తదితర దేశాలు ఈ దిశగా ప్రోత్సహిస్తు న్నాయి. జపాన్లో 2దశాబ్దాల తర్వాత 2015లో జననాల రేటు స్వల్పంగా (1.46) పెరిగింది. వలసదార్లే దిక్కు భారీగా వస్తున్న వలసదారుల కారణంగా.. కొన్ని దేశాలు కార్మికుల కొరతను అధిగమిస్తున్నాయి. అలాంటి దేశాల్లో అమెరికా ఒకటి. అయితే, ట్రంప్ అవలంభిస్తున్న వలస వ్యతిరేక విధానాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. వలస దార్లను తగ్గించుకోవడం వల్ల రానున్న దశాబ్దంలో అమెరికాకు కార్మిక కొరత తప్పేట్లు లేదు. వృద్ధులకు శిక్షణ ఇవ్వడం, వారి నైపుణ్యాలకు సానబెట్టడం వంటి చర్యల ద్వారా కార్మిక కొరతను కొంతవరకు అధిగమించవచ్చని.. ఐఎల్ఓ సూచిస్తోంది. సింగపూర్ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. స్త్రీల భాగస్వామ్యమేదీ? దేశ ఉత్పత్తిలో మహిళలు భాగస్వాములు అయినప్పుడే.. వారు ఆర్థిక సాధికారత దిశగా పయనించగలుగుతారు. ఆర్థిక వ్యవస్థలూ వృద్ధి చెందుతాయి. కానీ వీరికి పని కల్పించడంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు. మన దేశంలో ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొనే మహిళలు 27%ను మించడం లేదు. పురుషులతో సమానంగా స్త్రీలను కార్మిక శక్తిలో భాగం చేసినట్టయితే, భారత్ జీడీపీలో 27% మేరకు వృద్ధి నమోదవుతుందంటున్నారు ఐఎంఎఫ్ చీఫ్ క్రిష్టినా లగారే. -
విదేశీ నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాలివే!
విదేశీ నిల్వలు.. ఇవి లేక కొన్నిసార్లు కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోలేని పరిస్థితులు చూసుంటాం. ఇవి దేశీయ కరెన్సీకి ఇచ్చే మద్దతు అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఒక ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో వీటి పాత్ర చాలా కీలకం. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొనప్పుడు విదేశీ నిల్వలుంటే చాలు, ఎలాగోఅలా గట్టెక్కే అవకాశాలుంటాయి. తాజాగా అంతర్జాతీయ ద్రవ్య సంస్థ ఓ డేటా రూపొందించింది. దీనిలో ఏ దేశంలో విదేశీ నిల్వలు అధికంగా ఉన్నాయో వెల్లడించింది. ఈ జాబితాలో చైనా టాప్లో ఉందట. 3.2 ట్రిలియన్ డాలర్ల రిజర్వులతో విదేశీ నిల్వల్లో చైనా అగ్రస్థానంలో ఉన్నట్టు పేర్కొంది. ఐఎంఎఫ్ డేటా ప్రకారం హోమ్మచ్.నెట్ లో పొందుపరిచిన జాబితా ఈ విధంగా ఉంది. ర్యాంకు దేశం విదేశీ నిల్వలు 1 చైనా 3,161.5 బిలియన్ డాలర్లు 2 జపాన్ 1,204.7 బిలియన్ డాలర్లు 3 స్విట్జర్లాండ్ 785.7 బిలియన్ డాలర్లు 4 సౌదీ అరేబియా 486.6 బిలియన్ డాలర్లు 5 హాంకాంగ్ 437.5 బిలియన్ డాలర్లు 6 భారత్ 397.2 బిలియన్ డాలర్లు 7 దక్షిణ కొరియా 385.3 బిలియన్ డాలర్లు 8 బ్రెజిల్ 358.3 బిలియన్ డాలర్లు 9 రష్యా 356.5 బిలియన్ డాలర్లు 10 సింగపూర్ 279.8 బిలియన్ డాలర్లు ఈ జాబితాలో అత్యంత కీలకమైన ఆర్థిక వ్యవస్థలు అమెరికా, యూరప్ దేశాలు లాంటి దేశాలను పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే అమెరికా డాలర్ను, యూరోను అంతర్జాతీయ లావాదేవీల్లో అత్యంత సాధారణ రిజర్వు కరెన్సీలుగా పరిగణించడమే దీనికి గల కారణం. దీంతో అమెరికా లాంటి దేశాలు ఎక్కువ రిజర్వులను కలిగి ఉండాల్సినవసరం లేదు. సెంట్రల్ బ్యాంకులు ఏ విదేశీ కరెన్సీని ఎక్కువగా కలిగి ఉన్నాయి.... ర్యాంక్ రిజర్వు కరెన్సీ గ్లోబల్ హోల్డింగ్స్ 1 అమెరికా డాలర్ 63.5 శాతం 2 యూరో 20.0 శాతం 3 జపనీస్ యెన్ 4.5 శాతం 4 బ్రిటీష్ పౌండ్ 4.5 శాతం 5 కెనడియన్ డాలర్ 2.0 శాతం 6 ఆస్సి డాలర్ 1.8 శాతం 7 చైనీస్ యువాన్ 1.1 శాతం 8 ఇతర కరెన్సీ 2.6 శాతం విదేశీ కరెన్సీ నిల్వలు ఎందుకు అవసరం ? విదేశీ నిల్వలు తమ దేశీయ కరెన్సీ విలువను ఒక స్థిర రేటు వద్ద నిర్వహించడానికి ఆ దేశానికి అనుమతిస్తాయి. ఆర్థిక సంక్షోభ సమయంలో లిక్విడిటీని నిర్వహించడానికి విదేశీ నిల్వలు సహకరిస్తాయి. విదేశీ పెట్టుబడిదారులకు ఈ రిజర్వులు నమ్మకాన్ని కల్పిస్తాయి. వారి పెట్టుబడులను కాపాడేందుకు సెంట్రల్ బ్యాంకు ఎప్పడికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. బాహ్య చెల్లింపు బాధ్యతల కోసం విదేశీ కరెన్సీ నిల్వలు దేశానికి అదనపు బీమాగా ఉంటాయి మౌలిక సదుపాయాలు వంటి పలు రంగాలకు నిధులు ఇవ్వడానికి విదేశీ నిల్వలు ఉపయోగపడతాయి మొత్తంగా పోర్టుఫోలియోలో ప్రమాదకర పరిస్థితులను తగ్గించుకోవడం కోసం సెంట్రల్ బ్యాంకులకు ఇవి ఎంతో సహకరిస్తాయి. -
ఆర్థిక వృద్ధికి సర్కారు రోడ్మ్యాప్
బడ్జెట్పై చర్చకు లోక్సభలో ఆర్థిక మంత్రి న్యూఢిల్లీ: దేశ ఆర్థికరంగ పునరుత్తేజానికి రోడ్మ్యాప్ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. సాధారణ బడ్జెట్పై జరిగిన చర్చకు శుక్రవారం లోక్సభలో సమాధానమిస్తూ.. పన్ను విధానాల్లో పరివర్తన, కనిష్ట పన్ను రేట్లు, సబ్సీడీ వ్యవస్థను హేతుబద్ధీకరించడం, మౌలిక వసతులు, గృహనిర్మాణ రంగానికి ఊతం.. సహా ఆర్థికరంగ పునరుత్తేజానికి చేపట్టనున్న పలు ప్రణాళికలను వివరించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు, సమాజంలో అణగారిన వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు వ్యాపార అనుకూల విధానాలు తప్పనిసరి అని జైట్లీ చెప్పారు. ప్రస్తుత ఆర్థికరంగ ప్రస్తుత దుస్థితికి గత యూపీఏ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కీలక రంగాల్లో ఎఫ్డీఐలను అనుమతించడం సహా బడ్జెట్లో పేర్కొన్న పలు ప్రతిపాదనలు పారిశ్రామిక, ఉత్పత్తిరంగ అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు అత్యవసరమని జైట్లీ వివరించారు. నిరుత్సాహపూరిత పన్ను విధానాల వల్ల గత కొన్నేళ్లుగా పెట్టుబడిదారుల్లో భారత్పై అనుమానాలు బలపడ్డాయని, వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ పన్ను రేట్ల విధానం వల్ల దేశీయంగా ఉత్పత్తి పెరుగుతుందని, పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని తెలిపారు. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచడాన్ని జైట్లీ సమర్థించారు. కాగా, జైట్లీ గోవర్ధన గిరినెత్తిన శ్రీకృష్ణుడి వలె ఒంటిచేత్తో ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కొన్నారని స్పీకర్ సుమిత్రా మహాజన్ కొనియాడారు.


