మాతృభాషా? మార్కులా? | Intermediate Education Telugu Language Disappearing Mother Tongue | Sakshi
Sakshi News home page

మాతృభాషా? మార్కులా?

Aug 29 2026 11:40 AM | Updated on Aug 29 2026 11:46 AM

Intermediate Education Telugu Language Disappearing Mother Tongue

ఇన్‌ బాక్స్‌

నేటి ఆధునిక విద్యా విధానంలో విద్యార్థి వికాసానికి ప్రధాన కూడలి ఇంటర్‌ విద్య. దీని ద్వారానే సాంకేతిక, వైద్య, బ్యాంకింగ్‌ రంగాలకు చెందిన నిష్ణాతులైన విద్యావంతులు తయారై ఆ యా రంగాలను సుసంపన్నం చేయగలరు. ఇంటర్‌ విద్య ఎంత కీలకమో అందులో ద్వితీయ భాష కూడా అంతే ప్రధానం. ఇంటర్‌ వ్యవస్థ ఏర్పడ్డప్పుడే మాతృభాషల వికాసమే లక్ష్యంగా విద్యార్థులు తమ తమ మాతృభాషలు ఎంపిక చేసుకొని చదువుకునే వెసులుబాటు కల్పిస్తూ తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్, ఫ్రెంచ్, సంస్కృతం, ఆంగ్లం భాషలకు అవకాశం కల్పించారు. ‘మాతృభాష సంస్కృతి సాహిత్య వికాసాల వేదిక ద్వితీయ భాష’ అనే సూత్రంతో దీన్ని ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఇంటర్‌ విద్యార్థి మాతృభాషతో ప్రమేయం లేకుండా ‘తక్కువ నిడివి–స్వల్ప బోధన–అధిక మార్కులు’ అనే ఆధునిక సూత్రంతో కార్పొరేట్‌ కళాశాలలు నిర్బంధ సంస్కృత విద్యను అంటగడు తున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోనూ ద్వితీయ భాష మాతృభాష సూత్రం తుంగలో తొక్కి అడ్మిషన్లు పెంచు కోవడం వల్ల ద్వితీయ భాషగా తెలుగు చదివేవారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. ఎంతో పవిత్రమైన సంస్కృత భాషకు మనం ఎంత గౌరవం ఇస్తున్నాం? ప్రాథమిక తరగతుల్లో నేర్చుకోని సంస్కృతాన్ని రెండు సంవత్సరాల్లో ఎలా నేర్పగలం? అదేవిధంగా హిందీ చదివిన విద్యార్థులకు కనీసం చదవడం, రాయడం, మాట్లాడటం వస్తుందా? కేవలం మూల్యాంకనంలో అధిక పేపర్లు ఉండి అధిక మొత్తంలో పారితోషికం రావాలనే ఆశతో విద్యార్థుల భావి జీవితాలను భాషాపరంగా నాశనం చేయడం గౌరవప్రదమైన గురువులుగా మనకు తగునా?

ఇంటర్‌ విద్యాభ్యాసం చేస్తున్న లక్షలాది మంది విద్యార్థుల్లో 80% విద్యార్థులు తెలుగు మాతృభాష కలవారే ఉన్నారు. అవసరార్థం ఆంగ్ల భాషలో విద్యాభ్యాసం చేస్తున్నా దాన్ని అర్థం చేసుకునేది మాత్రం వారి అమ్మ భాషలోనే. ద్వితీయ భాష తెలుగు పాఠ్యపుస్తకాలు మానవతా విలువలు, శతక సాహిత్యం, స్థానిక సంస్కృతి, సాంప్ర దాయాలు, రచయితలు, రచనలను పరిచయం చేస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేలా ఉన్నాయి. ‘మన ప్రోత్సహం విద్యార్థి ఉన్నతికి ఉపకరించాలి తప్ప వినాశనానికి దోహదపడకూడదు’ అని గౌరవ ఉపన్యాసకులు తెలుసుకోవాలి. మూల్యాంకన కేంద్రాల్లో ఉన్నత స్థాయి అధికారులను నియమించి సూక్ష్మ పరిశీలన చేస్తే మూల్యాంకన విలువలు పెరుగుతాయి.  అప్పుడే విద్యా లక్ష్యాలు నెరవేరతాయి. లేకపోతే భవిష్యత్తులో ఇంటర్‌ విద్యలో తెలుగు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
– డా. అమ్మిన శ్రీనివాసరాజు. సీనియర్‌ తెలుగు ఉపన్యాసకులు(నేడు వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి)

ఇవి కూడా చదవండి: నేడు నేపాల్‌... రేపు ఇండియా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement