2026 మార్చి 25న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీ యాంశమైంది. ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా, యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ ఒక యువతి మానసిక ఆరోగ్యానికి హాని కలిగించాయని జ్యూరీ నిర్ధారించింది. బాధితురాలికి 6 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా న్యాయ నిపుణులు సోషల్ మీడియా యాప్స్ బయటకు వినోదం, సమాచారం, స్నేహాలు అందిస్తున్నట్టే కనిపించినా లోపల మాత్రం పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెల్లగా దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే మొదటిసారి సోషల్ మీడియా వేదికలను ‘లోప భూయిష్టమైన ఉత్పత్తులు’గా గుర్తిస్తూ వచ్చిన తీర్పు కావడం దీనికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.
ఈ కేసులో వాది అయిన కెలీ అనే యువతి చిన్న వయస్సులోనే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వాడటం ప్రారంభించింది. ఇతరులతో తన రూపాన్ని పోల్చుకోవడం, బ్యూటీ ఫిల్టర్స్ వాడటం, లైక్స్, కామెంట్స్ కోసం ఎదురుచూడటం ఆమె మానసిక స్థితిని ప్రభావితం చేశాయి. చివరకు ఆమె డిప్రెషన్, ఆందోళన, బాడీ డిస్మోర్ఫియా వంటి సమస్యలకు గురైంది. ‘నా జీవితంలోని అమూల్యమైన సంవత్సరాలు స్క్రీన్ వెనుక మాయ మయ్యాయి’ అన్న ఆమె మాటలు ఎందరినో ఆలోచనలో పడేశాయి.
భారతదేశంలో 75 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా, 40 కోట్లకు పైగా సోషల్ మీడియా వేదికలను వాడుతున్నారు. ముఖ్యంగా 13 నుండి 24 ఏళ్ల మధ్య యువత రోజుకు అనేక గంటలు యాప్స్లో గడుపు తున్నారు. ఇందువల్ల నిద్రలేమి, ఆందోళన, సైబర్ బుల్లీయింగ్, బాడీ షేమింగ్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరి స్తున్నారు. పాఠాలపై శ్రద్ధ తగ్గడం, కుటుంబ సంబంధాలు దూరమవడం, అవుట్డోర్ ఆటలపై ఆసక్తి తగ్గడం వంటి ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి. భారతదేశపు ‘ఎకనామిక్ సర్వే 2025–26’ నివేదిక పిల్లల్లో పెరుగు తున్న డిజిటల్ వ్యసనాన్ని ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా వినియోగానికి తప్పనిసరి వయసు నిర్ధారణ ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. భారత ప్రభుత్వం కూడా ఆస్ట్రేలియా తరహాలో 18 ఏళ్ల లోపు వారికి వయస్సు ఆధారిత నియంత్రణలు పెట్టాలనీ, రాత్రి పూట సోషల్ మీడియా లాగిన్ అవ్వకుండా టైమ్–లిమిట్స్ పెట్టాలనీ యోచిస్తోంది.
లాభాల కోసం రూపొందించిన అడిక్టివ్ టెక్నాలజీ ఇప్పుడు పిల్లల బాల్యాన్నీ, యువత మానసిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తోందనే విషయం స్పష్టమవుతోంది. ఈ విధమైన సాంకేతికతను తిరస్కరించడం సాధ్యం కాక పోయినా, బాధ్యతాయుత వినియోగం అత్యవసరం. భవిష్యత్ భారతాన్ని నిర్మించే యువతను పుస్తకాలు, క్రీడలు, సృజనాత్మకత, మానవ సంబంధాల వైపు మళ్లించాల్సిన సమయం వచ్చింది. – ఏటూరి సోమశేఖర్ శర్మ, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి


