భారతదేశంలో చాపకింది నీరులా ముంచుకొస్తున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య రక్తహీనత. ముఖ్యంగా ప్రతి నలుగురు మహిళల్లో ముగ్గురు ఐరన్ లోపంతో ఉన్నారనే గణాంకాలు దేశంలో అనీమియా తీవ్రతను రుజువు చేస్తున్నాయి. ఇది నివారించదగినది, చికిత్స చేయదగినది అయినప్పటికీ విద్య, ఆదాయం, ప్రాంతం అనే వాటితో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు అనీమియాతో పోరాడవలసి రావడం దురదృష్టకరం.
దేశవ్యాప్తంగా 70% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. 1549 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో 68.4% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
దేశంలోని 67.1% మంది చిన్న పిల్లలు రక్తహీనతతో పోరాడుతున్నారు. కౌమారదశలో ఉన్న అంటే 519 ఏళ్లు వయసులో ఉన్న బాలికల్లో 59.1% మంది రక్తహీనత బారిన పడ్డారు.
⇒ గ్రామీణ మహిళల్లో రక్తహీనత 70.4% ఉండగా, పట్టణ మహిళల్లో 64.7% గా ఉంది.
⇒ 50% పైగా గర్భిణులు రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు.
⇒ గిరిజన ప్రాంతాల్లో రక్తహీనత 80% (అత్యధికంగా) ఉంది.
⇒ ప్రతి నలుగురు భారతీయ మహిళల్లో ముగ్గురు అంటే 75% మంది తక్కువ ఐరన్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు.
⇒ రక్తహీనత 20 శాతం మంది ప్రసూతి మరణాలకు కారణమవుతోంది.
⇒ అనీమియా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో జార్ఖండ్ 65.2%, హర్యానా 62.7%, పశ్చిమ బెంగాల్ 62.5% ఉన్నాయి. రక్తహీనత తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ప్రథమ స్థానంలో ఉంది.
ప్రపంచవ్యాప్త గణాంకాలు
⇒ ప్రపంచవ్యాప్తంగా రక్తహీనత ఒక పెను సవాలుగా మారింది. 1549 ఏళ్ల మధ్య వయసున్న 500 మిలియన్ల మంది మహిళలు దీని బారిన పడ్డారు.
⇒ 5 ఏళ్లలోపు పిల్లల్లో 269 మిలియన్ల మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
⇒ గర్భిణులలో సుమారు 37% మంది దీని ప్రభావానికి గురవుతున్నారు.
ఏమిటీ సమస్య?
రక్తహీనత అంటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయులు తగ్గడం. దీనివల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గి నీరసం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. పిల్లల్లో ఇది మెదడు ఎదుగుదలను దెబ్బతీస్తే, గర్భిణులలో అకాల ప్రసవం, శిశు మరణాలకు దారితీసే ప్రమాదం ఉంది.
రక్తహీనతతో ప్రభావితమవుతున్నవారు
⇒ 5 ఏళ్లలోపు పిల్లల్లో, ముఖ్యంగా 2 ఏళ్లలోపు ఉన్న చిన్నారుల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది.
⇒ కౌమార బాలికలు, మహిళలు నెలసరి కారణంగా ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.
⇒ గర్భిణులు, బాలింతలకు ఐరన్ అవసరాలు ఎక్కువగా ఉంటాయి.
ఆహారమే ఔషధం
⇒ ఐరన్ అధికంగా ఉండే ఆహారం పాలకూర, తోటకూర, బెల్లం, వేరుశనగలు, మాంసం వంటివి తీసుకోవాలి
⇒ ఐరన్ గ్రహించడానికి శరీరానికి ఫోలేట్, విటమిన్ బి 12, విటమిన్ ఏ కూడా చాలా అవసరం.
⇒ అన్ని రకాల పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
⇒ వైద్యుల సూచనతో ఐరన్ టాబ్లెట్లు, సిరప్లు వాడవచ్చు.
రక్తహీనత అనేది కేవలం ఒక పోషకాహార లోపం మాత్రమే కాదు, అది ఒక దేశ భవిష్యత్తు ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశం. దీని నివారణకు ప్రభుత్వ కృషి, ప్రజల అవగాహన అవసరం.


