బంగారు భారతం..! తప్పక సందర్శించాల్సిన యాత్ర.. | Swarnim bharat yatra tour package offered by IRCTC | Sakshi
Sakshi News home page

స్వర్ణ భారత యాత్ర..! తప్పక సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

Jun 16 2025 10:23 AM | Updated on Jun 16 2025 10:44 AM

Swarnim bharat yatra tour package offered by IRCTC

ఇండిపెండెన్స్‌డే రోజు గాంధీజీ హృదయ్‌కుంజ్‌...ఆ తర్వాత... రోజుకొకటిగా అనేక ప్రదేశాలు. దేశఐక్యత ప్రతీక స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ... గాంధీజీ కారాగారం అగాఖాన్‌ ప్యాలెస్‌.మరాఠాల శౌర్యానికి ప్రతీక శనివార్‌వాడా... వావ్‌ అనిపించే గుజరాత్‌ మెట్ల బావులు...అదాలజ్‌ కా వావ్‌... పఠాన్‌లోని రాణీ కీ వావ్‌... దక్కన్‌ కోసం శంభాజీ నగర్‌ మినీ తాజ్‌మహల్‌. బౌద్ధ చిత్రాల అజంత గుహలు... శిల్పాల ఎల్లోరా... ఝాన్సీలో వీరాంగణ లక్ష్మీబాయ్‌ కోట.సంక్రాంతి వేడుకల రామ్‌రాజా టెంపుల్‌. మొధేరాలో సూర్యుడి మెత్తని కిరణాలు.ఈ టూర్‌లో మినిమమ్‌ గ్యారంటీలివి. మన భారతం బంగారు భారతం. అందుకే... ఇది స్వర్ణ భారత్‌ యాత్ర.

1వ రోజు
రాత్రి ఏడు గంటలకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రైల్వే స్టేషన్‌కు చేరాలి. ఎనిమిది గంటలకు రైలు అహ్మదాబాద్‌కు బయలుదేరుతుంది. రాత్రి భోజనం రైల్లోనే.

2వ రోజు
ఉదయం రైల్లోనే టీ, రిఫ్రెష్‌మెంట్, బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తయిన తర్వాత పదకొండు గంటలకు అహ్మదాబాద్‌ స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్‌ గదిలో చెక్‌ అవ్వాలి. మధ్యాహ్న భోజనం తర్వాత సబర్మతి ఆశ్రమం, అదాలజ్‌ కా వావ్, సాయంత్రం సబర్మతి రివర్‌ఫ్రంట్‌ విహారం తర్వాత హోటల్‌కు చేరాలి. భోజనం, బస అక్కడే.

సబర్మతి తీరాన హృదయ్‌కుంజ్‌ 
అహ్మదాబాద్‌లో గాంధీజీ నివసించిన ఆశ్రమం సబర్మతి నది తీరాన ఉండడంతో సబర్మతి ఆశ్రమం అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. కానీ గాంధీజీ తన ఇంటికి పెట్టుకున్న పేరు ‘హృదయ్‌ కుంజ్‌’. ఐదెకరాల్లో విస్తరించిన ఆశ్రమంలో గాంధీజీ నివసించడానికి ఒక భవనం, వంట కోసం, భోజనాల కోసం, స్వాతంత్య్ర సమరయోధుల సమావేశాల కోసం అనేక భవనాలను నిర్మించారు. 

ఇప్పుడు కొన్ని భవనాలను మ్యూజియంగా మార్చారు. ఇక రివర్‌ ఫ్రంట్‌ అంటే సబర్మతి తీరాన సూర్యోదయం, సూర్యాస్తమయాల వీక్షణను, వాకింగ్‌కి అనువుగా డెవలప్‌ చేసిన కారిడార్‌. మన స్వాతంత్య్రదినోత్సవం నాడు దేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీజీ ఆశ్రమాన్ని, స్వాతంత్య్ర పథక రచనలు జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన అనుభూతి అనిర్వచనీయమైనది.

వావ్‌... ఇది బావి
అదాలజ్‌ కా వావ్‌. ఇది మెట్ల బావి. ఐదంతస్థుల నిర్మాణం. వర్షాకాలంలో మూడు అంతస్థులు దిగితే నీటిని అందుకోవచ్చు. వేసవిలో ఐదంతస్థుల కిందికి దిగితే కానీ నీరందదు. బయట ఎంత వేడి ఉన్నప్పటికీ ఈ బావి దగ్గర చల్లగా ఉంటుంది. మంచి గాలి వీస్తూ ఆహ్లాదంగా గడపవచ్చు. ఇది గుజరాత్‌ రాజధాని నగరం గాంధీనగర్‌కు సమీపంలో ఉంది. 

మధ్యయుగంలో విదేశాలతో వర్తక వాణిజ్యాలు నిర్వహించే వ్యాపారులు, పర్యాటకులు ఈ ప్రదేశం నుంచి రాకపోకలు సాగించేవారు. వారి సౌకర్యార్థం రాణి రుడాబాయి క్రీ.శ 1498లో దీనిని నిర్మించారు. ఇక్కడ పండుగలకు సంప్రదాయ వేడుకలు నిర్వహిస్తారు.ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత ఎనిమిదిన్నరకు రోడ్డు మార్గాన మొధేరాకు ప్రయాణం. మొధేరా సూర్యదేవాలయ వీక్షణం. లంచ్‌ తర్వాత పఠాన్‌కు ప్రయాణం. రాణీ కీ వావ్‌ విహారం తర్వాత అహ్మదాబాద్‌కు వచ్చి హోటల్‌లో భోజనం, బస.

పుష్పవతి తీరాన సూర్యదేవాలయం
మొధేరాలోని సూర్యదేవాలయం అద్భుతమైన నిర్మాణం. దీని ఆర్కిటెక్చర్‌ గొప్పతనాన్ని వివరించాలంటే ఒక గ్రంథమే అవుతుంది. గుర్జర శైలి నిర్మాణం ఇది. దీనిని క్రీ.శ 11వ శతాబ్దంలో సోలంకి రాజవంశానికి చెందిన మొదటి భీమదేవుడు నిర్మించాడు. ఆలయం ఎదురుగా పెద్ద నీటి కొలను, దాని చుట్టూ జామెట్రికల్‌ డిజైన్‌తో నిర్మించిన మెట్లు మనదేశ నిర్మాణ కౌశలానికి నిదర్శనాలు.

సరస్వతి తీరాన రాణీ కీ వావ్‌
రాణీ కీ వావ్‌ చూస్తే నోరెళ్ల బెట్టి వావ్‌ అనాల్సిందే. ఇది పఠాన్‌ నగరంలో సరస్వతి నది తీరాన ఉంది. పఠాన్‌ నగరం మొధేరాకి 35 కిమీల దూరాన ఉంది. స్టెప్‌ వెల్‌ నిర్మాణాల్లో పతాకస్థాయి నిర్మాణం ఇది. ఈ గోడలకున్న శిల్పాలు, రాతిలో చెక్కిన డిజైన్‌లు చూపుతిప్పుకోనివ్వవు. ఈ గోడల మీదున్న డిజైన్‌లను చేనేతకారులు చీరల మీద నేస్తారు. యునెస్కో ఈ నిర్మాణాన్ని పదేళ్ల కిందట హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది.]

4వ రోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత అహ్మదాబాద్‌లోని హోటల్‌ గదిని చెక్‌ అవుట్‌ చేసి రైల్వేస్టేషన్‌కు చేరి రైలెక్కాలి. తొమ్మిదిన్నరకు రైలు ఏక్తానగర్‌కు బయలుదేరుతుంది. లంచ్‌ రైల్లోనే. ఒంటిగంటకు రైలు దిగి స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ వీక్షణానికి వెళ్లాలి. అక్కడ షో చూసి, వెనక్కి వచ్చి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. రాత్రి పది గంటలకు రైలు ఖాద్కీ (పూనే) స్టేషన్‌కు బయలుదేరుతుంది.

నర్మద తీరాన ఐక్యత నిర్మాణం
సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ మన దేశానికి భౌగోళిక రూపాన్నిచ్చిన ఆర్కిటెక్ట్‌. నర్మద నది తీరాన ఉన్న స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ దాదాపు ఆరువందల అడుగుల విగ్రహం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. ఇది పటేల్‌ నూటయాభైవ జయంతి ఏడాది. పటేల్‌ విగ్రహం తయారీకి శిల్పికి ఒక డిజైన్‌ ఇవ్వడానికి చరిత్రకారులు, కళాకారులు, విద్యావేత్తల బృందం పని చేసింది. ఈ విగ్రహం ఉన్న ప్రదేశం పేరు కెవాడియా. ఇక్కడి రైల్వేస్టేషన్‌కి అదే పేరు. ఇప్పుడు దీనిని ఏక్తానగర్‌గా మార్చారు.

5వ రోజు
ఉదయం ట్రీ, బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత తొమ్మిది గంటలకు రైలు ఖాద్కీ స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి ఆగాఖాన్‌ ప్యాలెస్‌ సందర్శనానికి వెళ్లాలి. హోటల్‌లో చెక్‌ ఇన్‌ అయ్యి, మధ్యాహ్న భోజనం తర్వాత కాస్బా గణపతి, లాల్‌ మహల్, శనివార్‌ వాడాల్లో పర్యటించి హోటల్‌కు చేరాలి. రాత్రి భోజనం, బస అక్కడే.

మూలనది తీరం గాంధీజీ కారాగారం
అగాఖాన్‌ ప్యాలెస్‌ పూనేలో ఉంది. క్విట్‌ ఇండియా ఉద్యమకాలంలో మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడుతో΄ాటు అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడ కారాగార శిక్షను అనుభవించారు. కస్తూర్బా గాంధీ ఇక్కడే తుదిశ్వాస వదిలారు. ప్యాలెస్‌ ప్రాంగణంలో కస్తూర్బా సమాధి, గాంధీజీ చితాభస్మ సమాధి ఉన్నాయి. ప్యాలెస్‌లో క్విట్‌ ఇండియా ఉద్యమ చిహ్నంగా విగ్రహం ఉంది.

ఛత్రపతుల కోట శనివార్‌ వాడా
శనివార్‌ వాడా మరీ ప్రాచీనమైనదేమీ కాదు, 18వ శతాబ్దపు నిర్మాణం. సరైన నిర్వహణ లేక కొంతకాలం కళ తప్పింది. ఇప్పుడు ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహణలోకి వచ్చిన తరవాత కళను సంతరించుకుంటోంది. ఇది ఏడంతస్థుల నిర్మాణం. మరాఠా వీరుల శౌర్యానికి ప్రతీకగా పీష్వా మొదటి బాజీరావ్‌ విగ్రహం ఉంది. ఢిల్లీలోని మొఘల్‌ పాలకులకు ఎదురు నిలబడి దీటుగా బదులిస్తున్నట్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ కోటను ఉత్తరాభిముఖంగా నిర్మించాడు ఛత్రపతి షాహు.

6వ రోజు
ఆరవ రోజు: ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తి చేసుకుని హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి ఎనిమిది గంటలకంతా భీమశంకర్‌ జ్యోతిర్లింగ దర్శనానికి బయలుదేరాలి. దారిలో లంచ్‌ చేసుకుని, ఆ తర్వాత ఆలయ దర్శనం చేసుకుని ఖాద్‌కీ రైల్వేస్టేషన్‌కు చేరి రైలెక్కాలి. భోజనం, బస రైల్లోనే. రైలు రాత్రి పది గంటలకు ఛత్రపతి శంభాజీ నగర్‌ (ఔరంగాబాద్‌)కు బయలుదేరుతుంది.

ప్రకృతి ఒడిలో భీమశంకరుడు
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో భీమశంకర్‌ ఒకటి. ఇది పూనేకి 50 కిలోమీటర్ల దూరాన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో దట్టమైన అడవిలో ఉంది.

7వ రోజు
ఉదయం టీ, రిఫ్రెష్‌మెంట్, బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తయిన తర్వాత రైలు ఛత్రపతి శంభాజీ నగర్‌కు చేరుతుంది. రైలు దిగి బీబీ కా మఖ్బారా వీక్షణానికి వెళ్లాలి. ఆ తర్వాత హోటల్‌ గదిలో చెక్‌ ఇన్, లంచ్‌. ఆ తర్వాత ఎల్లోరా గుహలు చూసుకుని ఘృష్ణేశ్వర్‌ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లాలి. రాత్రి భోజనం, బస హోటల్‌లో.

శంభాజీ నగర్‌ మినీ తాజ్‌మహల్‌
మరాఠా సామ్రాజ్యాన్ని ఏలిన రెండవ ఛత్రపతి శంభాజీ భోసాలే పేరుతో ఔరంగాబాద్‌ నగరానికి శంభాజీ నగర్‌ అని పేరు పెట్టారు. ఇక్కడ ఔరంగజేబు మనుమడు అజమ్‌ షా తన తల్లి దిల్‌రాస్‌ బాను బేగం కోసం తాజ్‌ మహల్‌ నమూనాలో నిర్మించిన బీబీ కా మఖ్బారా (మినీ తాజ్‌మహల్‌) పెద్ద టూరిస్ట్‌ అట్రాక్షన్‌. 

ఇక్కడ పాన్‌ ఫేమస్‌. స్టార్‌ పాన్‌ షాప్‌ నుంచి అరబిక్‌ దేశాలకు పాన్‌లు ఎగుమతి అవుతాయి. అత్యంత ఖరీదైన ఎక్స్‌΄ోర్ట్‌ క్వాలిటీపాన్‌ ధరలు వేలల్లో ఉంటాయి. ఈ టూర్‌ గుర్తుగా తక్కువలో తక్కువగా వచ్చే పాతిక రూపాయల పాన్‌ అయినా రుచి చూడాలి.

8వ రోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి రోడ్డు మార్గాన అజంతా గుహలకు వెళ్లాలి. అజంతా గుహల సందర్శన తర్వాత మధ్యాహ్న భోజనం, ఆ తర్వాత భుసావల్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలెక్కాలి. రైలు సాయంత్రం ఆరు గంటలకు ఝాన్సీకి బయలుదేరుతుంది. రాత్రి భోజనం, బస రైల్లోనే. బౌద్ధ చిత్రాల అజంతఎల్లోరా– అజంతా గుహలు మనదేశంలో బౌద్ధం పరిఢవిల్లిందని చెప్పడానికి మనకున్న గొప్ప చారిత్రక ఆధారాలు. 

యునెస్కో ఈ గుహలను వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది. ఇందులో కొన్ని గుహలు చైత్యాలు. అంటే ప్రార్థన మందిరాలు. కొన్ని విహారాలు... అంటే నివాస ప్రదేశాలు. రంగురంగుల పెయింటింగ్స్‌ కోసమే ఈ గుహలకు వెళ్లాలి. ఎల్లోరా గుహల్లో శిల్పాలుంటాయి. అజంతాగుహలు చిత్రాలకు ప్రసిద్ధి.

9వ రోజు
ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత ఏడుగంటలకు రైలు వీరాంగణ లక్ష్మీబాయ్‌ ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి ఓర్చాలో హోటల్‌ గదికి వెళ్లి రిఫ్రెష్‌మెంట్‌ తర్వాత చెక్‌ అవుట్‌ చేయాలి. ఓర్చాలో ఉన్న రామ్‌ రాజా టెంపుల్, చతుర్భుజ టెంపుల్, జహంగీర్‌ మహల్‌ చూసుకుని లంచ్‌ తర్వాత ఝాన్సీ వైపు సాగి΄ోవాలి. 

ఝాన్సీ కోట, మ్యూజియం సందర్శన తర్వాత ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలెక్కాలి. రైలు రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ, సఫ్దర్‌జంగ్‌ స్టేషన్‌కు బయలుదేరుతుంది. రాత్రి భోజనం, బస రైల్లోనే.

ఉత్తరాదిలో సంక్రాంతి వేడుక
రామ్‌ రాజా మందిర్‌... ఇది మధ్యప్రదేశ్‌ రాష్ట్రం, ఓర్చా పట్టణంలో ఉంది. ఓర్చా టెంపుల్‌గా వ్యవహారంలోకి వచ్చింది. ఈ ఆలయంలో ఏటా శైవ, వైష్ణవ పర్వదినాలతోపాటు మకర సంక్రాంతి వేడుకలు కూడా నిర్వహిస్తారు, రాముడి ఆలయం. రాముడి ఆలయం అంటే ధనుర్ధారిౖయె సీతాలక్ష్మణ సమేతంగా అడవుల బాట పట్టిన కోదండ రాముడి రూపమే ఉంటుంది. 

ఇక్కడ మాత్రం రాముడు రాజు హోదాలో పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న శిల్పాల సముదాయాన్ని చూస్తే అరణ్యవాసం, రామరావణ యుద్ధం పూర్తయిన తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకున్న రాముడిని తలపిస్తుంది. ఆలయ నిర్మాణం కూడా అంతఃపురాన్ని ΄ోలి ఉంటుంది.

ఝాన్సీ కోటలో రాణిమహల్‌
ఝాన్సీ కోట శత్రుదుర్భేద్యంగా ఉంటుంది. కానీ ప్యాలెస్‌లు నిరాడంబరంగా ఉంటాయి. చతుర్భుజి ఆకారంలో రెండతస్థుల భవనం, మధ్యలో బావి, ఫౌంటెయిన్, లాన్, గదుల్లోపల గోడలకు చక్కటి పెయింటింగులతో ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్‌ ప్యాలెస్‌ అందంగా ఉంటుంది. బ్రిటిష్‌ సైన్యంతో ΄ోరాడిన ధీర మహిళ లక్ష్మీబాయ్‌. ఆమె యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధమై, బిడ్డను వీపుకు కట్టుకుని కోట గోడ మీద నుంచి అమాంతం గుర్రం మీదకు దూకిన ప్రదేశాన్ని చూపిస్తారు. ఝాన్సీలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మ్యూజియంలో టెర్రకోట బొమ్మలు, లోహపు బొమ్మలు, ఆయుధాలు, శిల్పాలు, చేతి రాత ప్రతులు, చిత్రలేఖనాలు, బంగారు, వెండి, రాగి నాణేలు, లోహపు విగ్రహాలు, దుస్తులను చూడవచ్చు. 

10వ రోజు
ఉదయం ఆరు గంటలకు రైలు ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్‌ స్టేషన్‌కు చేరుతుంది. టీ తర్వాత రైలు దిగడంతో పర్యటన పూర్తవుతుంది.

స్వర్ణిమ్‌ భారత్‌ యాత్ర 
(సీడీబీజీ 30), ఇది పది రోజుల టూర్‌. ఆగస్ట్‌ 14న మొదలై 23వ తేదీతో పూర్తవుతుంది. ఇందులో 
అహ్మదాబాద్, మొథేరా, పూనే, ఔరంగాబాద్, ఓర్చా, ఝాన్సీ ప్రదేశాలు కవర్‌ 
అవుతాయి. 
టూర్‌ కోడ్‌...   SWARNIM BHARAT YATRA (CDBG30)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement