ప్రభువునందు ఆనందించుటే ఆత్మసంబంధ పండుగ | special story about Christmas: Jetham | Sakshi
Sakshi News home page

ప్రభువునందు ఆనందించుటే ఆత్మసంబంధ పండుగ

Dec 23 2024 3:45 AM | Updated on Dec 23 2024 3:45 AM

special story about Christmas: Jetham

‘ఒకని జన్మ దినము కంటె మరణ దినమే మేలు’ అన్నది దేవుని దృష్టికోణం. ఉన్నతంగా చెప్పబడిన ఈ మాట అందరి గూర్చి అయినా, మరి ముఖ్యంగా, ఒక్క క్రీస్తును గురించి మాత్రమే ఇది చెప్పబడిందంటూ బైబిలు పండితులు వ్యాఖ్యానిస్తుంటారు. సువార్తలు రెండు మూడు లేవు. నాలుగైదు లేనే లేవు. ఒక్కటే సువార్త. అదే క్రీస్తు మరణ సువార్త. ఒక్క క్రీస్తు మరణాన్ని సువార్తగా కాకుండా ఇక వేరే ఏది సువార్తగా ప్రకటించిన వాడు శాపగ్రస్తుడని బైబిలు చాలా ఖండితంగా చెప్పుటను ప్రతి ఒక్కరూ మనస్సు పెట్టి అలోచించాలి. (గలతీ 1:6–10 ).

‘ఆయన భుజములపై రాజ్య భారముండును’,‘నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది’ అను భవిష్యత్‌ ప్రవచనాలు క్రీస్తు నందు క్రీస్తు సంఘమనే రాజ్య స్థాపన ద్వారా నెరవేర్చబడ్డాయి. అపొస్తలుల బోధకు కట్టుబడి విధేయంగా దానికి తలవంచే క్రీస్తు ప్రభువు సంఘాలలో ఆత్మసంబంధిత పండుగ వాతావరణం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది.

అపొస్తలుడైన ΄ûలు బోధ ప్రకారంగా ‘ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి. మరల చెప్పుదును. ఆనందించుడి’(ఫిలిప్పీ 4:4). ఒకరు ఇలా ఎల్లప్పుడూ క్రీస్తు నందు ఆనందిస్తే అతనికి నిత్యమూ పండుగే. క్రీస్తు సువార్త విని లోబడి ఒక ΄ాపి రక్షించబడితే ఇలా మరణంలో నుండి జీవములోనికి దాటితే పరలోకంలో గొప్ప పండుగ వాతావరణం నెలకొంటుంది. భూలోకం వైపు తొంగి చూస్తూ దేవ దూతలు,  దేవ దూతలు సమక్షంలో దేవదూతలే చేసుకోనే పండుగ అది. నిజానికి క్రీస్తు మరణ సత్య సువార్తే ఇంతటి గొప్ప పండుగ వాతావరణాన్ని ఇక్కడ అక్కడ అంతటా సృష్టించ గలదు. సత్య సువార్త అంతటి శక్తిమంతమైనది మరి. ఎందుకంటే ఇది మనిషి

యోచన వలన కలిగినది కాదు. సమాజంగా కూడి క్రీస్తు పునరుత్థాన దినమనే ప్రభువు దినమును పరిశుద్ధ దిన ఆచారంగా ఎంచి క్రీస్తు ద్వారా దేవున్ని ఆరాధిస్తూ ఇలా ఆత్మసంబంధంగా ఆనందిస్తే అదే సంఘమునకు అసలు సిసలైన పండుగ వాతావరణం. దీన్నే ఇశ్రాయేలీయుల రాజైన క్రీస్తు ప్రభువు నందు ఆనందించడంగా చెప్పవచ్చు. ఇది పండుగ కంటే మించినది. వారమునకు ప్రప్రథమ దినములైన ఒక సంవత్సరంలోని యాభై రెండు ఆదివారాలు ప్రభువు నందు ఆనందించగలిగితే అవి క్రైస్తవులకు ఎప్పుడూ పండుగ దినములే.

ప్రతి ఆదివారం క్రీస్తు ద్వారా దేవున్ని ఆరాధించడం దేవుని రాజ్యానికి ఆయన నీతికి ప్రప్రథమ స్థానం ఇవ్వడంగా, వాటిని మొదట వెదకడంగా గ్రంథం చెబుతుంది. దేవుడు ఘనపరచి గొప్ప చేసిన ఉపదేశ క్రమాన్ని అనుసరించి చూస్తే,అపొస్తలుల బోధ ప్రకారంగా క్రైస్తవులు పరిశుద్ధ లేఖనాలను మీరి తమకు నచ్చినట్టుగా ఏ పండుగలు చేయకూడదు. దేవుడు చేయమని అజ్ఞాపించి చెప్పిన పండుగలు అన్నీ ΄ాత నిబంధనలోనే ఉన్నాయి. ఇప్పుడైతే, భౌతిక సంబంధ ఆచార వ్యవహారాలతో ముడిపడిన పండుగలు చేసి దేవుని ఏనాడూ ఘనపరచలేరు.

ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన ఏడు పండుగలు అన్నీ కొత్తనిబంధన ఆత్మ సంబంధ ఆరాధనలోకి వచ్చి చేరి ఇలా విలీనం అయ్యి అందు ఒద్దికగా నిండుగా నిక్షిప్తమవడం విశేషం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ద్వారా అద్వితీయ సత్యదేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుటను మించిన పరిశుద్ధ దినం, ఇట్టి పండుగ వాతావరణం మరొకటి ఎక్కడా కానరాదు. మనోనేత్రాలు వెలిగించబడితేనే ఈ సత్యం అర్థమవుతుంది. భౌతికపరమైన పండుగలు ఆచార వ్యవహారాలు అన్నీ క్రీస్తునందు సిలువలో కొట్టివేయబడ్డాయి. మృత్యుంజయుడైన క్రీస్తును బట్టి నూతన సృష్టి అనబడే క్రైస్తవులకు సంవత్సరంలోని ప్రతి ఒక్క ఆదివారం ఆత్మ సంబంధ పండుగ దినమే.

అపొస్తలులు, ఆదిమ సంఘము వారు ఆత్మ సంబంధులుగా సత్య సంబంధులుగా పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించారు తప్ప వారు ఎలాంటి పండుగలు చేయలేదు. వారి బోధలు, వారి వారి నడతలు మనకు ఎప్పుడూ శిరోధార్యమే అనుటలో ఎలాంటి సందేహం లేదు. క్రొత్త నిబంధన పూర్తిగా ఆత్మ సంబంధమైనది. దాన్ని అలాగే మనం ఆచరించబద్దులము. – జేతమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement