ఓ వ్యక్తి ఎలాంటి తప్పు చేయకుండా బంధింపబడి, బాధలకు గురైతే..కుంగిపోయి ఢీలా పడిపోతాడు. కానీ సోనాబాయి అలా కాదు. తన కష్టాల్ని, నిశబ్ద బాధని అద్భుతమైన కళకు ఊపిరిపోసి, స్వేచ్ఛకు మార్గం వేసింది. పైగా యావత్తు ప్రపంచం తనవైపు తిరిగేలా గుర్తింపు తెచ్చుకుంది. బాధలను వరంగా మార్చుకుని తన ఉనికిని ఎలా తెలియజేయాలో చాటి చెప్పింది.
కళ అంటేనే సృజనాత్మక ప్రతిభకు సంబంధించింది. తన తప్పు ఏమి లేకుండా భర్త చేత సమాజం నుంచి వెలివేయబడి నిర్బంధింపబడింది సోనాబాయి రాజావర్. చత్తీశ్గఢ్కు చెందిన సోనాబాయి తన భర్త దురహంకారానికి బలైన మహిళ అని చెప్పొచ్చు. ఆయన ఆమెను కిటికీలు లేని ఇంట్లో బంధించేవాడు. దాంతో ఆమె తన కొడుకుతో ఒంటిరిగా, నిశబ్ద వేదనను అనుభవించింది.
నాటి మూఢనమ్మకాలు, చాదస్తాలకు బాధితురాలిగా మారిన మహిళ సోనాబాయి. అయితే ఆ బంధనాన్ని తన స్వేచ్ఛను సంపాదించుకునే మార్గానికి పునాది వేసింది. మొదట తన కొడుకుని ఊరడించడానికి బావి వద్ద ఉన్న మట్టితో బొమ్మలు చేసేది. కాలక్రమేణ ఆమెలోని అద్భుత ప్రతిభా పాటవాలతో గొప్ప కళ పుట్టుకొచ్చి..మొత్తం ఇల్లు ఆ బొమ్మలతో నిండిపోయింది. బొమ్మలకు వేసే రంగులను సైతం ఆమె స్వయంగా ఇంట్లో సహజసిద్ధిమైన వాటితో తయారు చేసి ఉపయోగించేది.
అంతేగాదు వేసవికాలంలో ఉక్కపోతాలకు తాళ్లలేక ఇంటిని చల్లగా ఉంచే మార్గం కోసం అన్వేషించి ఓ చక్కటి పరిష్కారాన్ని వెతికింది. వెదురు, బంక మట్టిలతో చిన్నపాటి రంధ్రాలతో ఇంటి చుట్టు ప్రహరీని ఏర్పరుచుకుని చల్లటి గాలి లోపలికి వచ్చి ఎండ వేడిని అధిగమించింది. అంతేగాదు ఆమె ఇంటి గోడలు సైతం తన కళతో కళకళలాడుతుండేవి. నిజానికి టాలెంట్ ఉన్నవాడిని బంధించడం అంత ఈజీ కాదు అనేందుకు ఉదహారణగా నిలిచేలా ఆమె కళకు గుర్తింపు దక్కింది, పైగా ప్రపంచమంతటికీ ఆమె పేరు మారుమ్రోగిపోయింది. సరిగ్గా 1983లో భారత్ భవన్కు చెందిన క్షేత్ర పరిశోధకుల బృందం ఆమె ఇంటిని కనుగొనడంతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
అదే ఏడాది ఆమె తులసి సమ్మాన్ అవార్డును అందుకుంది.ఆమె నిశబ్ద తిరుగుబాటుకు, దృఢత్వానికి ప్రతీకగా మారింది. నిజానికి ఆమె ఈ కళ కోసం ఎలాంటి శిక్షణ తెలుసుకోలేదు. ఆమె బాధలు, కష్టాలకు ఈ కళకు ఊపిరిపోశాయి. అందులోంచే తన ఆనందం, స్వేచ్ఛను వెతుక్కుంటూ మంచి కళకారిణిగా మలుచుకుని జీవితాన్ని స్వర్గధామంగా మార్చుకుంది. అంతేగాదు ప్రతికూల అణిచివేత వాతావరణంలో ఎలాంటి మద్దతు లేకుండా కేవలం కళా ప్రతిభతో ధైర్యంగా మనుగడ సాగిస్తే..ఏదోనాటికి గుర్తింపు లభిస్తుందని ప్రూవ్ చేసింది.
సోనాబాయి 2007లో కన్నుమూశారు. అంతేగాదు ఆమె మరణాంతరం ఛత్తీశ్గఢ్ ప్రభుత్వం 2015లో ఆమె స్వగ్రామం ఫుహ్పుత్రలో ఆమె గౌరవార్థం ఒక మ్యూజియంను స్థాపించింది. రాష్ట్రంలో ఒక కళాకారిణి జ్ఞాపకార్థం నిర్మించిన తొలి మ్యూజియం ఇదే కావడంతో ఇది మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. నిజంగా ఈ కథ అద్భుతమైన జీవిత పాఠాన్ని నేర్పిస్తోంది కదూ..!.
(చదవండి: నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్: ఇంత ప్రమాదకరమైనదా?)


