ఒక వ్యక్తి ఒకానొక టైంలో చదువుని మధ్యలోనే ఆపేసినా..పరిస్థితులు, కష్టాలు, అసామాన్య ప్రతిభను వెలికితీస్తాయి అనేందుకు ఈ కథే ఉదాహరణ. ఆర్థిక కష్టాలు పదోతరగతికి మించి ఉన్నత చదువుని అందుకునే పరిస్థితి కల్పించికపోతేనేం..అచంచలమైన దృఢ సంకల్పంతో ఒక్కోమెట్టు ఎక్కుతూ.. వ్యవస్థాపకుడిగా మారాడు. అక్కడ నుంచి దేశమే గర్వించేలా రక్షణవ్యవస్థ సామర్ధ్యాన్ని బలోపతేం చేసే పేలుడు పదార్థాలు, డ్రోన్ సాంకేతికత అందించే కంపెనీని రన్ చేసే స్థాయికి చేరుకున్నాడు.
అతడే రాజస్థాన్కి చెందిన సత్యనారాయణ్ నువాల్. రాజస్థాన్లోని భిల్వారా గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు. తండ్రి పదవీ విరమణతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పదితోనే చదువు ఆపేయాల్సిన వచ్చింది. దాంతో 1970వ దశకంలో నువాల్ జీవనోపాధి కోసం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉన్న బల్హర్షాకు వెళ్లారు. కనీస వసతి లేక ఆయన రాత్రుళ్లు రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ తర్వాత అనేక చిన్న చిన్న వ్యాపారాలు ప్రయత్నించారు. 18 ఏళ్ల వయసులో ప్రారంభించిన ఫౌంటెన్-పెన్ ఇంక్ తయారీలో నష్టం రావడం వంటి పలు ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కి తగ్గక.. గెలుపు పిలుపు వినిపించ్చేదాక ఏదో ఒక చిన్న వ్యాపార ప్రయత్నం చేస్తూనే ఉండేవారు. ఆ క్రమంలోనే పేలుడు పదార్థాల వ్యాపారి అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్ని కలిశారు. అదే ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది.
వెయ్యితో మొదలై..కోట్లకు విస్తరించేలా..
ఆ వ్యాపారితో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఆయన వద్ద నుంచి లైసెన్సు, నిల్వ సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి నెలకు రూ. 1,000 చెల్లిస్తూ వ్యాపారం మెదలుపెట్టాడు. ఆయన రూ. 250లకు పేలుడు పదార్థాలు కొని వాటిని రూ. 800లకు అమ్మే వ్యాపార చతురత నువాల్లని ఎంతగానో ఆకర్షించింది. అలా ఆయన బ్రిటిష్ సంస్థ ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ (ICI)లో పంపిణీదారుడిగా నియామకం పొంది కీలకమైన పరిశ్రమ అనుభవాన్ని సంపాదించుకుని ఆర్థిక స్థిరత్వాన్ని పొందాడు.
ఆ విధంగా 1995లో రూ. 60 లక్షల రుణంతో నువాల్ నాగ్పూర్లో సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ను స్థాపించారు. ఈ సంస్థ 1996లో ప్యాకేజ్డ్ పేలుడు పదార్థాలు, బల్క్ పేలుడు పదార్థాలు, డిటోనేటర్ల తయారీతో కార్యకలాపాలను ప్రారంభించింది. మొదట చిన్న తరహా సంస్థగా ప్రారంభమైన..కొద్ది కాలంలోనే విస్తరించి భారతదేశంలోనే అతి పెద్ద పేలుడు పదార్థాల ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఈ సంస్థ ఎదిగింది.
రక్షణ వ్యవస్థ కోసం పనిచేయడం..
నాగస్త్రకు అనుబంధంగా భార్గవస్త్ర అనే ఒక అధునాతన కౌంటర్-డ్రోన్ (C-UAS) వ్యవస్థ ఉంది. ఈ మైక్రో-క్షిపణి ఒకేసారి 60 లక్ష్యాల వరకు ఛేదించగలదు. ఈ సామర్థ్యం ఇతర దేశాలు మోహరించిన వ్యవస్థలను మించిపోయింది. మాములుగా ఇవి సాధారణంగా ఒకేసారి నాలుగు ప్రయోగాలను మాత్రమే నిర్వహించగలుగుతాయి. దీంతో 2010 నాటికి సోలార్ ఇండస్ట్రీస్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. అలా రక్షణ దళాల కోసం పేలుడు పదార్థాలను తయారు చేయడానికి భారత ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన తొలి ప్రైవేట్ భారతీయ సంస్థగా ఇది నిలిచింది.
ఆ లైసెన్స్ కాస్తా పేలుడు పదార్థాల నుంచి అత్యాధునిక సాంకేతిక రక్షణ వ్యవస్థల వైపు మళ్లడానికి నాంది పలికింది. ఆ విధంగా నువాల్ నాయకత్వంలో సంస్థ అనూహ్యంగా వృద్ధి చెంది ఇప్పుడు భారతదేశం అంతటా 27 తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. అంతేగాదు ఎనిమిది దేశాల్లో ఉత్పత్తి యూనిట్లను కలిగి ఉండటమే గాక సుమారు 75 నుంచి 90 దేశాలకు ఎగుమతి చేస్తోంది కూడా.
2023 నాటికి, సోలార్ ఇండస్ట్రీస్ ఏకంగా రూ. 8వే కోట్లు ఆదాయంతో ప్రపంచంలోనే ఐదు అగ్ర పేలుడు పదార్థాల తయారీలో ఒకటిగా నిలిచింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1 లక్ష కోట్లను దాటి, దాదాపు రూ. 1.54 లక్షల కోట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇందులో నువాల్ సుమారు 70 శాతం ఈక్విటీని కలిగి ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ సదుపాయాలను సందర్శించి, కంపెనీ సాంకేతిక పురోగతిని ప్రశంసించారు. అలా నువాల్ కంపెనీ రక్షణ వ్యవస్థ కోసం పనిచేయడం ప్రారంభించింది. అంతేగాదు ఆపరేషన్ సింధూర్లో సైతం నాగాస్త్రంతో ఒక నిర్ణయాత్మక పోషించారు. అందుకుగాను భారత ప్రభుత్వం జనవరి 26, 2026న పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి గౌరవించింది. ఒకప్పుడు చదువు మధ్యలో ఆపేసిన వ్యక్తి భారతదేశ రక్షణ ఉత్పాదక విప్లవంలో అగ్రగామిగా ఉన కంపెనీకి సారథ్యం వహించే స్థాయికి చేరడం నిజంగా స్ఫూర్తిదాయకం కదూ..!.
(చదవండి: మురికి వాడ నుంచి ఏఐ ఎక్స్పర్ట్ రేంజ్కి..! పేదింటి అమ్మాయి విజయగాథ)


