ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమై నేడు వ్యాపారులుగా మారిన షీలా దేవి, నీలమ్ సారంగి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రయాగ్రాజ్ సంగం జిల్లాలో 80 వేల రూపాయలతో టెంట్ హౌజ్ వ్యాపారాన్ని మొదలుపెట్టి, ఏడాదికి 15 లక్షలు సంపాదిస్తూ గ్రామీణ మహిళలకు అండగా నిలుస్తోంది షీలా దేవి. బేకర్ కో ఆకర్ ద్వారా వ్యర్థాల నుంచి అర్థవంతమైన వస్తువులను రూపకల్పన చేస్తూ వందకు పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తోంది నీలం సారంగి. మహిళాభివృద్ధిలో వీరు చూపిస్తున్న కృషి ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతుంది.
ఆర్థిక పురోగతి : షీలాదేవి
ట్రాన్స్ యమునా పాకెట్లోని తిక్రి కంజాసా గ్రామానికి చెందిన షీలాదేవి టెంట్ హౌజ్ కంపెనీని స్థాపించి, మహిళల అభ్యున్నతికి పాటు పడుతున్నారు. ఆమె తీసుకున్న ఈ చొరవ అక్కడ ఇతర గ్రామీణ మహిళలను ప్రోత్సహిస్తుంది. వ్యవసాయం, వ్యాపారం ఈ రెండింటి ద్వారా వారి జీవితాలను మారుస్తోంది.
ఇంటి పరిస్థితుల కారణంగా చదువు కలగా మారింది. అంతేకాకుండా ఆమె భర్త అనూజ్ కూడా ఉద్యోగంలో రాణించడం లేదు. ఈ స్థితిలో కుటుంబ జీవనం ఎలా సాగించాలో అర్థం కాలేదు. అసలు ఏమాత్రం అనుకూలంగా లేని పరిస్థితులు.
అయినా, ఆమె ఆశను కోల్పోలేదు. నాలుగేళ్ల క్రితం రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లో చేరి ఉజాలా మహిళా స్వయం సహాయక బృందాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం నుండి అందిన రుణం, తన దగ్గర ఉన్న కొద్దిపాటి పోదుపు మొత్తం జోడించి రూ.80,000 లతో టెంట్ వ్యాపారం మొదలుపెట్టింది. మెల్ల మెల్లగా పరిస్థితులు మెరుగవుతూ వచ్చాయి. ఏడాదిలోపే బ్యాంకు రుణం తిరిగి చెల్లించింది. భర్తకు వ్యాపార బాధ్యతలు అప్పగించి, విద్యుత్ ఫెసిలిటేటర్గా పనిచేయడం ప్రారంభించింది. దీనిద్వారా లభించిన కమిషన్ను ఆమె తన టెంట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది.
నేడు ఆమె ఏడాదికి రూ.12 నుండి 15 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల నుండి చదువుకున్న ఇతర మహిళలను కూడా తన గ్రూపులో చేర్చుకోవడం, వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించడం మొదలుపెట్టింది. టెంట్ అద్దెకిచ్చే వ్యాపారంలో పాతికమందికి పైగా స్థానికులు ఉపాధి పోందుతున్నారు.
సమస్యలు వచ్చాయని కుంగిపోకుండా చేసే చిన్న ప్రయత్నంతోనైనా జీవితాన్ని నిలబెట్టుకోవచ్చుని నిరూపిస్తోంది షీలాదేవి. ఇప్పుడు ఆమె బాటలో మిగతా మహిళలు కదులుతున్నారు.
వ్యర్థాలతో గుర్తింపు: నీలం సారంగి
పర్యావరణ సవాళ్లు ప్రతిరోజూ తీవ్రమవుతున్న ప్రపంచంలో ఎవరో ఒకరు సమస్యను అవకాశంగా మార్చుకుంటారు. నీలం సారంగి స్థాపించిన డీపీఐఐటి గుర్తింపు పోందిన సామాజిక సంస్థ బేకర్ కో ఆకర్ ఓ శక్తిమంతమైన ఉదాహరణ. వ్యర్థాలను సంపదగా ఎలా మార్చవచ్చు... అనే ఓ చిన్న ఆలోచన ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అంతటా వినిపిపిస్తోంది. మహిళా సాధికారత, సమాజ అభివృద్ధిని సమర్థించే ఉద్యమంగా ఎదిగింది. వ్యర్థాల నుంచి సృజనాత్మకత, ఆవిష్కరణ, సామాజిక ప్రయోజనం, పచ్చని భవిష్యత్తును నిర్మించగలవని కూడా నిరూపిస్తున్నారు.
నీలం సారంగి వ్యర్థాలలో దాగి ఉన్న సామర్థ్యాన్ని చూసింది. పాత బూట్లు, టైర్లు, పాత్రలు, సీసాలు, ఇనుప స్క్రాప్, కొయ్యదుంగలు, పారిశ్రామిక వ్యర్థాలతో రీ డిజైన్లో శ్రద్ధ, అంకిత భావంతో వివిధ రకాల ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. ఈ ఆలోచనే బేకర్ కో ఆకర్కు పునాదిగా మారింది. పర్యావరణంపై వ్యర్థాల భారాన్ని తగ్గించడం, గ్రామీణ నిరుపేద మహిళలకు జీవనోపాధిని కల్పించడంపై దృష్టి పెట్టింది.
అద్భుతాల సృష్టి
నీలం సారంగి బృందం గృహ, పారిశ్రామిక వ్యర్థాలైన పాత టైర్లు, స్క్రాప్ మెటల్ను సేకరించి, శిక్షణ పోందిన మహిళా కళాకారులు నిర్వహించే కమ్యూనిటీ ఆధారిత సంస్థ అయిన బేకర్ కో ఆకర్కు చేరుస్తుంటుంది. ఇక్కడ అవి గృహాలకంరణ వస్తువులుగా, కొయ్యదుంగలు హస్తకళాకృతులుగా, పాత బూట్లు, పాత్రలు, ఇతర చెత్త కొత్త రూపాన్ని పోందుతాయి. ఇక్కడ ప్రతి ఉత్పత్తి చేతితో తయారు చేసినదే. పర్యావరణ అనుకూలమైనదే. ఆధునిక గృహాలంకరణ నుండి కార్పొరేట్ బహుమతుల వరకు మంచి మార్కెట్ను ఏర్పరుచుకుంది బేకర్ కో ఆకర్ సంస్థ.
ఈ సంస్థ వందకు పైగా మహిళలకు శిక్షణ ఇచ్చింది. నూట ఇరవై మందికి పైగా ఉద్యోగావకాశాలను కల్పించింది. నీలం దృష్టిలో సాధికారత కేవలం ఆర్థికపరమైనది కాదు, భావోద్వేగపరమైనది, సామాజికమైనది. మహిళలు తమలో దాగి ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకొని, తమ సమాజాలలో మంచి మార్పుకు కారకులుగా మారడానికి ఇది సహాయపడుతుంది. బేకర్ కో ఆకర్ ద్వారా పట్టణ అభివృద్ధికి మహిళలు చురుకుగా సహకరిస్తున్నారు.
ఝాన్సీ నగర్ నిగమ్, ప్రయాగ్రాజ్ నగర్ నిగమ్లతో కలిపి నీలం ఆమె బృందం పెద్ద ఎత్తున పట్టణ సుందరీకరణ ప్రాజెక్టులను అమలు చేశారు. ఒకప్పుడు చెత్త డంపింగ్ ప్రదేశాలుగా ఉన్న ప్రాంతాలను కళాత్మకంగా తిరిగి రూ పోందించారు. దీంతో ఆ ప్రాంతాలు సెల్ఫీ పాయింట్లు, పబ్లిక్ ఆర్ట్ ఇన్స్టాలేషన్లు, మినీ పార్కులతో అందంగా మారిపోయాయి. మున్సిపల్ వ్యర్థాల నుండి సేకరించిన పదార్థాలను ఉపయోగించి నగరాన్ని అందంగా తీర్చిదిద్దవచ్చని ఇది రుజువు చేస్తుంది. మొత్తం 29 నగర సుందరీకరణ ప్రాజెక్టులు చేశారు.


