
ఒకపుడు గర్భం దాల్చడం, ప్రసవించడం, పిల్లలకు పాలివ్వడం ఇవన్నీ చాలా గోప్యమైన వ్యవహారాలుగా భావించేవారు. గర్భధారణ, మాతృత్వం, ప్రసవవేదన, పిల్లల పెంపకం అంత ఈజీ కాదనీ, ఎంతో భావోద్వేగంతో కూడుకున్న ఈ సవాళ్ల గురించి సమాజం తెలుసుకోవాలనే చర్చ ఇటీవలి కాలంలో బాగా జరుగుతోంది. తల్లిపాలు ఇవ్వడం (Breastfeeding)-తల్లుల మానసిక ఆరోగ్యంపై ప్రభావంపై ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు దీని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికే నటీమణులు రాధికా ఆప్టే, బిపాసా బసు ప్రెగ్నెన్సీ అంటే ఫ్యాన్సీ కాదని దీని వెనుక ఎంతో శారీరక,మానసిక ఆందోళనతో పాటు, భావోద్వేగ పూరిత జర్నీ గురించి చర్చించారు. తాజాగా ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గర్భంతో ఉన్న సమయంలోనూ, పాలిచ్చే సమయంలోనే తాను అనుభవించిన సమస్యలు, సవాళ్ల గురించి మాట్లాడటం విశేషం.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) తన నవజాత కొడుకును చూసుకునే బాధ్యత తనను చాలా బాధపెట్టిందని సానియా మీర్జా చెప్పింది. మాతృత్వం అనుభవాలను, ఆటనుంచి రిటైర్ కావడానికి గల కారణాల గురించి ఓ పాడ్ కాస్ట్ లో పంచుకుంది. నిజంగా బిడ్డకు పాలివ్వడం అనేది గర్భధారణకంటే అత్యంత కష్టతరమైనదిగా అనిపించిందని కూడా చెప్పింది. అంతేకాదు మరో మూడు సార్లు అయినా గర్భవతి అవుతానేమో కానీ, పిల్లలకు పాలివ్వడం, వారి ఆకలి తీర్చడం అనే పని మాత్రం తన వల్ల కాదని స్పష్టం చేసింది. ఎందుకంటే ఈ డ్యూటీ శరీరంలో భాగం కాదు, పైగా పిల్లలు మనపై ఆధారపడి ఉంటారు. ఇది నిజంగా మిమ్మల్ని కట్టివేస్తుంది. అందుకు సమయం కేటాయించాలి, తగినంత నిద్ర ఉండదు . బిడ్డకు పాలిచ్చే సమయానికి ఆటపరంగానో, లేదా ఇంకేదో పనుల్లోనో ఉండాల్సి వస్తుంది అంటూ తన బాధల్ని పంచుకుంది.
మానసిక భావోద్వేగం, మతిపోయేంత ఆందోళన
గర్భధారణ అనేది అనేక హార్మన్లతో కూడుకున్న అంశం. ప్రెగ్నెన్సీఅనేది అందమైన అనుభవం కంటే, కానీ ఆ సమయంలో కంటే తన కొడుకు ఇజాన్కు తల్లిపాలు ఇస్తున్నప్పుడు తాను ఎక్కువగా అలసిపోయానని సానియా తెలిపింది. తాను దాదాపు మూడు నెలలు తల్లిపాలు ఇచ్చాననీ, కానీ తన బిడ్డకు పోషకాహారం అందించే ఏకైక వ్యక్తిగా ఉండటం అనేక మానసిక ఆందోళన కలిగించిందని వివరించింది. అలాగే పసిబిడ్డతో నిద్ర లేకపోవడం, బిడ్డ కడుపు నింపే క్రమంలో తాను బాగా అలిసిపోయే దాన్నని చెప్పుకొచ్చింది. శారీరక అంశాల కంటే మానసిక భావోద్వేగం ఎక్కువ ఉంటుందని, ఉద్యోగం చేసే మహిళలకు తల్లిపాలు ఇవ్వడం చాలా కష్టమైన పని అని ఆమె చెప్పుకొచ్చింది.

ఒక దశలో తనకు పిచ్చెక్కిపోతోందనే భావన కలిగిందనీ, దీంతో నేపథ్యంలోనే పిల్లల వైద్యుడిని సంప్రదించా.. ఇంకో నెల కొనసాగించమని చెప్పినా తన వల్ల కాదని చెప్పేశానని తెలిపింది. అలాగే బాడీ షేమ్ చేస్తారనే అంశాన్ని కూడా గుర్తు చేసుకుంది. ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్ కావడానికి గల కారణాలను పంచుకుంటూ సానియా ఇలా చెప్పింది. తన కుమారుడితో ఎక్కువ క్వాలిటీ సమయాన్ని గడపాలనే ఆలోచనతోనే రిటైర్మెంట్నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇజాన్ బాల్యంలో అతనికి అవసరమైనసంరక్షణ అందించాలని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది.
కాగా సానియా మీర్జా , షోయబ్ మాలిక్(మాజీ భర్త) దంపతులకు 2018లో కొడుకు ఇజాన్ జన్మించారు. ప్రస్తుతం సానీయా, షోయబ్ విడాకులు తీసుకోగా, షోయబ్ మరో వివాహం కూడా చేసుకున్నాడు.