
ఉపాధ్యాయురాలిగా పనిచేసే రెమబాయి రిటైర్ అయ్యారు. అదే సమయంలో తల్లి చనిపోయారు. ఏదో శూన్యం ఆవరించినట్లు అనిపించింది. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టారు కేరళలోని కొల్లమ్కు చెందిన రెమబాయి. ఆమెకు అర ఎకరం కూడా వ్యవసాయ భూమి లేదు.
ఇంటి టెర్రస్నే సాగుభూమిగా మార్చుకున్నారు. ‘వ్యవసాయ భూముల్లో కాకుండా టెర్రస్పై డ్రాగన్ ఫ్రూట్స్ పండించడం చాలా కష్టం’ అనే మాటను సవాలుగా తీసుకున్నాకే సాయిల్లెస్ ప్లాంటింగ్ మెథడ్తో ముందుకు వెళ్లారు. కూరగాయల వ్యర్థాలు, ఎండుటాకులు... మొదలైన వాటితో సేంద్రియ ఎరువులు స్వయంగా తయారు చేసుకున్నారు.
డ్రాగన్ ఫ్రూట్ల ఆరోగ్య ప్రయోజనాల గురించి అప్పుడెప్పుడో విన్న రెమబాయి వాటిని పండించాలనుకున్నారు. రిటైర్మెంట్ తరువాత తన కలను నిజం చేసుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్ల ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు అర్జించడం విశేషం! డ్రాగన్ ఫ్రూట్ సాగులో తన అనుభవాలను పంచుకోవడానికి ‘జెసీ వరల్డ్’ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు రెమబాయి.
ఆమె విజయ రహస్యం ఏమిటి?
‘నా వయసు 58 సంవత్సరాలు. అయితే ఎప్పుడూ 20 ఏళ్ల వయసులాగే ఫీలవుతాను’ అంటూ తన విజయ రహస్యాన్ని చెప్పకనే చెప్పారు రెమబాయి.
(చదవండి: సిఈఓలు యవ్వనంగా ఉండాలంటే..! సుందర్ పిచాయ్కి కలిగిన సందేహం)