21 రోజుల్లో 75 వేలమందికి కడుపు నింపిన ప్రణీత | Pranitha Subhash Serves 75,000 Meals In 21 Days Since Lockdown | Sakshi
Sakshi News home page

21 రోజుల్లో 75 వేలమందికి కడుపు నింపిన ప్రణీత

Mar 8 2021 12:04 AM | Updated on Mar 8 2021 2:00 PM

Pranitha Subhash Serves 75,000 Meals In 21 Days Since Lockdown - Sakshi

ప్రణీత సుభాష్‌  

ప్రణీత సుభాష్‌ అనే పేరుకంటే ‘బాపుగారి బొమ్మ’ గా బాగా గుర్తింపు పొందిన కన్నడ నటి ప్రణీత. ‘‘ఏం పిల్లో ఏం పిల్లడో, ‘బావ’, ‘అత్తారింటికి దారేది’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘రభస’, డైనమైట్‌’’ వంటి తెలుగు సినిమాల్లో తన అభినయంతో ఆకట్టుకోవడమేగాక, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో వివిధ చిత్రాల్లో కథానాయికగా రాణిస్తూ.. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అందంతోపాటు స్వచ్ఛమైన మనస్సుకూడా ఉండడంతో హీరోయిన్‌గానే గాక వివిధ సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. కోవిడ్‌ సమయం లోనైతే.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమంది అభాగ్యులకు ఆమె ఆపన్నహస్తం అందించారు. 

లాక్‌డౌన్‌ సమయంలో చాలామంది తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజూ కూలి చేస్తేగానీ పూటగడవని కూలీల అవస్థలు తెలుసుకున్న సినీ నటి ప్రణీత సుభాష్‌ ఒక్కో కుటుంబానికి రూ.2000 చొప్పున 50 కుటుంబాలకు లక్షరూపాయలను విరాళంగా అందచేశారు. పేద ప్రజల కోసం ఆమె దగ్గరుండి వండించి, పంపిణీ చేశారు. ఇలా 21 రోజుల్లో ఏకంగా 75 వేలమందికి భోజనం పెట్టి కడుపు నింపారు. లాక్‌డౌన్‌ సమయంలో ‘హెల్ప్‌ది హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ పేరుతో పదిలక్షల రూపాయలను విరాళంగా సేకరించి 450కి పైగా కుటుంబాలను ఆదుకున్నారు. ఒక హీరోయిన్‌గా కాక, ఒక లీడర్‌గా ఆమె అన్నీ తానే అయి చేశారు. 

ప్రణీత ఫౌండేషన్‌
ప్రణీత తల్లిదండ్రులు ఇద్దరూ బెంగళూరులో ఓ ఆసుపత్రిని నడుపుతున్నారు. వారు స్తోమత లేనివారికి ఉచితంగా వైద్యం చేస్తూ ఎంతోమందిని ఆదుకునేవారు. చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలను దగ్గర నుంచి చూస్తూ పెరిగారు ప్రణీత. ఈ క్రమంలోనే సినిమాల్లో్ల కాస్త నిదొక్కుకున్నాక ప్రణీత తల్లిదండ్రులతో కలసి ‘ప్రణీత ఫౌండేషన్‌’ను ప్రారంభించారు. ఈ ఫౌండేషన్‌ ద్వారా..‘సేవ్‌ గవర్నమెంట్‌ స్కూల్స్‌’ అనే ఉద్యమంలో భాగస్వామిగా వ్యవహరిస్తూ బెంగళూరులోని ప్రభుత్వ స్కూళ్ల పరిరక్షణకు కృషిచేస్తున్నారు. విటార్‌ అనే హెల్త్‌ టెక్‌ స్టార్టప్‌తో కలిసి నిరుపేదలకు హెల్త్‌ చెకప్‌లు ఉచితంగా చేయిస్తూ.. వారిలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్య సమస్యల నివారణకూ కృషి చేస్తున్నారు. ఆర్థికం గా సామాజికంగా వెనుకబడిన వర్గాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రణీత సేవాకార్యక్రమాలను గుర్తించిన కర్ణాటక ఎన్నికల కమిషన్‌ ప్రణీతను ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు అంబాసిడర్‌గా నియమించింది. 

Advertisement
 
Advertisement
Advertisement