సోషల్‌​ మీడియా ట్రోలింగ్‌ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది! | Mother of baby daughter rescued from sun shade dies by suicide in Coimbatore | Sakshi
Sakshi News home page

సోషల్‌​ మీడియా ట్రోలింగ్‌ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!

May 20 2024 11:25 AM | Updated on May 20 2024 1:04 PM

Mother of baby daughter rescued from sun shade dies by suicide in Coimbatore

విచక్షణ లేకుండా,  చేతికొచ్చినట్టు కమెంట్లు చేయడం,  సూటిపోటి మాటలతో ఎదుటివారిని చిత్రవధ చేయడం సోషల్‌ మీడియా ట్రోలర్లకు పరిపాటిగా మారిపోయింది. ఫలితంగా  పెద్ద ప్రమాదం నుంచి బిడ్డ బయటపడిందన్న సంతోషం  ఒక తల్లికి ఎంతో సేపు నిలవనీయలేదు. వేధించి, వేధించి   ఆమె ఉసురు తీసిన ఘటన  విషాదం నింపింది.

ఇటీవలి ప్రమాదవశాత్తు తల్లి చేతుల్లోంచి జారి సన్‌షేడ్‌పై పడిన పాపను రక్షించిన సంఘటన గుర్తుందా?ఎనిమిది నెలల పాపను రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి బిడ్డను కాపాడారు. కానీ ఇపుడా పాపకు తల్లిని దూరం చేసింది మాయదారి సోషల్‌ మీడియా.  

కోయంబత్తూర్‌లో పాపను రక్షించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ విడియో చూసిన నెటిజన్లు "బిడ్డను చూసుకోవటం చేత కాదా?" అని  ఆ తల్లిని విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో తీవ్ర డిప్రెషన్‌కి గురైన ఆమె కోయంబత్తూర్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

కాగా చెన్నైలోని తిరుముల్లైవాయల్‌లోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నాలుగో అంతస్తులో నివసించే రమ్య, వెంకటేష్‌లకు ఇద్దరు పిల్లలు, నాలుగేళ్ల అబ్బాయి, ఏడు నెలల పాప ఉన్నారు. ఏప్రిల్ 28న,  ఐటీ ఉద్యోగి రమ్య తన ఫ్లాట్‌లోని బాల్కనీలో తన పసికందుతో ఆడుకుంటూ ఉండగా, పాప ఆమె చేతుల్లోంచి జారి కింద ఉన్న తాత్కాలిక సన్‌షేడ్‌లో పడింది. దీంతో పొరుగువారు  కింద దుప్పట్లు పట్టుకోగా, ఒక వ్యక్తి సన్‌షేడ్ నుండి పాపను పట్టుకుని సురక్షితంగా క్రిందికి తీసుకు రాగలిగాడు.  ఈ ఘటన తర్వాత  రమ్య  తల్లిగారింటికి వెళ్లింది. అక్కడికి వెళ్లినా ఆమెకు ఉపశమనం లభించలేదు.  దీంతో శనివారం కారమడైలోని తల్లిదండ్రుల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉసురు తీసుకుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement