
అంతర్జాతీయంగా ప్రపంచ సుందరి పోటీలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు మిస్ వరల్డ్గా భారతీయులు కిరీటం గెలిస్తే గొప్పగా కీర్తించుకున్నాం.. కానీ గతేడాది 71వ మిస్ వరల్డ్ ముంబైలో, ఈ సారి 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ (హైదరాబాద్)లో నిర్వహించడంతో ఇండియా విశిష్టత విశ్వవ్యాప్తమైంది. అయితే ఈ సారి నగరంలో జరుగుతున్న పోటీల నేపథ్యంలో హైదరాబాద్కు మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు తెలుగు పాటలు సైతం వైరల్గా మారాయి. ఏ దేశంలో ఈ పోటీలు జరిగినా ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు రావడం సహజమే. అయితే వినూత్నంగా ఈ సారి తెలుగు పాటలు వైరల్గా మారాయి. దీనికి కారణం.. ఈ సారి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలుగు పాటలకు అభిమానులుగా మారడం చెప్పుకోవాల్సిన విషయం.
మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు బసచేస్తున్న ట్రైడెంట్ హోటల్ వేదికగా మిస్ నైజీరియా పాడిన ‘రానూ.. బొంబైకి రానూ’ అనే పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో జానపద సాహిత్యంతో రూపొందించిన ప్రైవేట్ సాంగ్ రాను బొంబైకి రాను..!! తెలంగాణతో పాటు దక్షినాది వరకూ ఫేమస్ కావడం ఓకే.. కానీ ఏకంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఈ పాటను పాడటం, దీనికి స్టెప్పులేయం అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఈ పాట వైరల్ అవ్వడమో లేదా మిస్ నైజీరియాకు తెగ నచ్చేసిందో తెలియదు కానీ.. మిస్ వరల్డ్ పోటీల్లో ముఖ్యమైన టాలెంట్ రౌండ్లోనూ ఈ ముద్దుగుమ్మ ఇదే పాటకు డ్యాన్స్ వేశారు. వినూత్నంగా ఇండో ఆఫ్రికన్ డ్యాన్స్ అంటూ ఈ తెలుగు పాట, తమ దేశానికి చెందిన పాటలతో తన టాలెంట్ రౌండ్ను ప్రదర్శించారు. ఐతే ఇదే రౌండ్ చివరలో 20 దేశాలకు చెందిన టాలెంట్ రౌండ్ ఫైనలిస్టులు మళ్లీ ఇదే పాటకు స్టెప్పులేయడం మరోసారి వైరల్గా మారింది. ఇందులో మిస్ ఇండియా నందినీ గుప్తా అదిరిపోయే స్టెప్పులేశారు..
మార్ఫా స్పెషల్..
మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో మిస్ తారలతో నగరంలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ‘హెరిటేజ్ వాక్’ నిర్వహించిన విషయం విధితమే. ఐతే ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన మార్ఫా సంగీతానికి ఈ సుందరీమణులు డ్యాన్స్ వేసి సందడి చేశారు. ఈ వీడియోలు తమ సోషల్ మీడియా యాప్స్లో పోస్ట్ చేయగా ప్రపంచవ్యాప్తంగా తిలకించారు.
కుర్చీ మడత పెట్టి..
అందరూ తెలుగు పాటలతో అదరగొడితే.. మిస్ ఇండియా నందినీ గుప్తా మాత్రం సూపర్ స్టార్ మహేష్బాబు ‘కుర్చీ మడత పెట్టి...’ అనే డైలాగ్ కం పాటతో తన ప్రత్యేకతను చాటుకున్నారు.
ఎలా ఉన్నారూ..??
మరో కార్యక్రమంలో భాగంగా ఈ ముద్దుగుమ్మలంతా తెలంగాణ వారసత్వ వైభవాన్ని, విశిష్టతను తిలకించడానికి వరంగల్ వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిస్ కెనడా.. తెలుగులో ‘నమస్తే.. ఎలా ఉన్నారు’ అని సందడి చేయగా, మిస్ యూఎస్ఏ.. ‘అందరూ బాగున్నారా’ అంటూ పలకరించారు.
మిస్ అర్జెంటీనా ఐతే పాన్ ఇండియా ఫేమస్ తెలుగు డైలాగ్ ‘తగ్గేదే లే’ అంటూ అలరించారు. ఈ అందాల తారల నోటి వెంట ముచ్చటగొలిపే ఈ మాటలు సైతం యూట్యూబ్లో, సోషల్ యాప్స్లో చక్కర్లు కొడుతున్నాయి.
బాలీవుడ్ స్వరాలు సైతం..
ఇవే కాకుండా జిలేబి బేబీ, ఓం శాంతి ఓం, ధూమచాలే వంటి బాలీవుడ్ ఇండియన్ బాలీవుడ్ పాటలతోనూ పలువురు మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు.
తీన్మార్..
నగరంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ ప్రపంచ సుందరీమణులతో నిర్వహించిన స్పోర్ట్ ఈవెంట్లో కూడా తెలుగు పాటలకు, తీన్మార్ బ్యాండ్కు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. హోర్ట్ ఆఫ్ గోల్డ్ పేరుతో ట్రైడెంట్ హోటల్లో నిర్వహించిన సేవా కార్యక్రమంలో సైతం అనాథ చిన్నారులను ఉత్సాహపరచడానికి తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకొచ్చిన నాటు నాటు పాటతో పాటు డీజే టిల్లూ, ఇడియట్, అద్దాలా మేడలున్నవే అనే తెలుగు పాటలకు డ్యాన్సులు చేసి మరో సారి తెలుగు సంగీతాన్ని, సాహిత్యాన్ని ఆస్వాదించారు.
అందాల బొమ్మ నోట.. బుట్టబొమ్మా పాట..
మిస్ వరల్డ్ కంటెస్టెంట్, మిస్ జర్మనీ సైతం మరో తెలుగు పాటతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందాలొలికే ఈ ముద్దుగుమ్మ క్యూట్ క్యూట్ వాయిస్తో బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా నను చుట్టూకుంటివే అనే అల్లూ అర్జున్ టాప్ హిట్ సాంగ్ పాడి అందరి మనసులూ దోచుకున్నారు. ఈ పాటకు అనుగుణంగా స్టెప్పులేస్తూ చేసిన వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అంతేకాకుండా చుమ్కా కీరా హోయ్ అనే మరో బాలీవుడ్ పాటను సైతం పాడారు.
(చదవండి: Miss World 2025: నందిని గెలిస్తే..నంబర్ వన్ మనమే..! అత్యధిక టైటిల్స్ గెలిచిన ఏకైక దేశంగా..)