గోధుమ రంగు గుట్ట కాదు.. బంగారు గుట్ట అని పిలుస్తాం! | Lord Venkateswara Of The Seven Hills Tirupati Travel | Sakshi
Sakshi News home page

గోధుమ రంగు గుట్ట కాదు.. బంగారు గుట్ట అని పిలుస్తాం!

Jul 6 2026 7:34 AM | Updated on Jul 6 2026 7:34 AM

Lord Venkateswara Of The Seven Hills Tirupati Travel

తాత్త్వికథ

తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే దారిలో ఒక గుట్టపైన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి పాదం ఉంది. స్వామివారు నారాయణవనంలో పద్మావతిని పెళ్ళాడి స్థిర నివాసం కోసం బయలుదేరాడు. దారిలో పుత్తూరు పట్టణం పక్కనున్న గుట్టమీద కాలు పెట్టాడని, అది స్వామిని మోయలేక కదిలిందని చెబుతారు. దాంతో ఆ ప్రయత్నం విరమించుకుంటాడు స్వామి. మరికొన్ని చోట్ల కూడా పాదం మోపి చివరిగా శేషాచలం కొండలపైన కొలువైనాడని భక్తుల నమ్మకం.

ఆ గుట్ట మీదున్న స్వామిపాదాన్ని చూద్దామని తమిళనాడుకు చెందిన కొందరు యువతీ యువకులు జట్టుగా బయలుదేరారు. ఆ బృందానికి ఒక నాయకుడిని ఎంపిక  చేసుకున్నారు. గుట్టపైకి వెళ్ళే  దారి చూపడానికి ఒక స్థానికుడిని మాట్లాడుకున్నారు. నామం పెట్టుకుని, చేతిలో కర్ర, తలకి టోపీ, చలువ కళ్ళద్దాలు తొడిగి చెప్పులు లేకుండా ఆ బృందం బయలుదేరింది. గుట్ట ఎక్కుతున్న వారిని చూసి అక్కడి గ్రామాల ప్రజలు ‘ఈ పిల్లోళ్ళకి ఎంత భక్తి, ఎంత భక్తి’ అని పొగడ్తల వర్షం కురిపించారు.

కొద్దిదూరం నడిచాక గుట్ట మీద ఉన్న గడ్డిని చూసి ఒక మెడికో అమ్మాయి ‘‘ఇక్కడ అంతా పచ్చగా ఉంటుందని అనుకున్నాము, కానీ ఇక్కడేమిటి, అంతా గోధుమ రంగులో ఉంది’’ అని ఆశ్చర్యంగా  అడిగింది. ఆమె చూసింది పూరికప్పు వేసుకోవడానికి ఉపయోగించే బోద గడ్డి అది. ఎండకి బాగా ఎండి అది గోధుమ రంగులోకి మారి ఉంది.

దారి చూపే స్థానికుడు ఆమె మాటలకు చిన్న నవ్వు నవ్వాడు. ‘‘మేము దీన్ని గోధుమ రంగు గుట్ట అని పిలవం, బంగారు గుట్ట అని పిలుస్తాం’’ అని చెప్పాడు. పక్కనే ఉన్న బృందనాయకుడు మనం ఈ గుట్టమీదున్న గడ్డిని చూసి గోధుమ రంగు గుట్ట అనుకుంటున్నాము, దాన్నే భక్తి భావంతో, ఆశావాద దృక్పథంతో ఉన్న ఇక్కడి వారు బంగారు గుట్టగా భావిస్తున్నారు. మన దృక్పథాన్ని పునః పరిశీలించుకోవాల్సి ఉందని వివరించాడు.

మాటల్లోనే గుట్ట మీదకు చేరుకున్నారు. అక్కడున్న ఏనుగు పాదాలు, గుర్రపు పాదాల అడుగులు చూసి ఆశ్చర్యపోయారు. స్వామి పాదం పక్కనే ఉన్న దొనలో కాళ్ళు చేతులు కడుక్కుని పూజలు చేసి గోవిందలు పలుకుతూ వెనుదిరిగారు.
దిగుతూ ఉంటే భక్తి పారవశ్యంతో ఉన్న ఆ మెడికో అమ్మాయికి గుట్ట మీదున్న గడ్డి అందంగా, బంగారు రంగులో కనిపించింది. ఏదైనా చూసే మనసును బట్టి ఉంటుంది ఈ ప్రపంచం అని తెలుసుకుంది ఆ అమ్మాయి. – ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement