Anju టెర్రస్‌ గార్డెన్‌లో తోపు : 600కు పైగా గులాబీలు | Kerala Woman Who Turned Her Terrace Into a Garden of 600 Types of Roses & Adeniums | Sakshi
Sakshi News home page

Anju టెర్రస్‌ గార్డెన్‌లో తోపు : 600కు పైగా గులాబీలు

Jun 28 2025 10:45 AM | Updated on Jun 28 2025 11:37 AM

Kerala Woman Who Turned Her Terrace Into a Garden of 600 Types of Roses & Adeniums

మడిసన్నాక కాపింత కళాపోషనుండాల అన్నట్టు గట్టిగా అనుకోవాలే కానీ చారెడు మట్టినేల లేకున్నా కోరుకున్న పంట పండించవచ్చని నిరూపించింది కేరళకు చెందిన అంజు కార్తీక (Anju Karthika). తన ఇంటి మిద్దె తోటలో ఆమె 600 రకాల గులాబీలను విరబూయించి రోజాపూల ప్రేమికుల గుండెలను గులాబీ సౌరభాలతో నింపేసింది. 

కేరళలోని కయాంకుళానికి చెందిన యాభై రెండు సంవవత్సరాల అంజు కార్తీకకు చిన్నప్పటినుంచి పువ్వులంటే ఎనలేని ప్రేమ. అందులోనూ గులాబీలంటే  ప్రాణం. స్కూల్‌లో చదివేటప్పుడే ఆమెలో గులాబీలపైన ప్రేమ బీజం నాటుకుని మొలకెత్తింది. అది ఆమెతోపాటే పెరిగి పెద్దదై కొమ్మలు రెమ్మలుగా విస్తరించింది. ఆమెకు పూలంటే ఉన్న మక్కువ మట్టిగా... ఆమె కృషి,  పట్టుదలలే నీరు, ఎరువులుగా మారి ఆమె కోరుకున్నన్ని రకాల గులాబీ బాలలయ్యాయి. 

కార్తీకకు పదవ తరగతి విద్యార్థినిగా ఉన్నప్పటినుంచే స్నేహితుల తోటల నుంచి గులాబీల అంట్లు తీసుకొచ్చి తన ఇంటిలో వాటిని పెంచే ప్రయత్నాలు చేసేది. తోటి వారందరూ ఆటపాటలలో బిజీగా ఉన్నప్పుడు ఆమె నిశ్శబ్దంగా తన మొక్కల ప్రపంచంలో పడి వాటిని పెంచడంలో విసుగూ విరామం లేకుండా గంటలు గంటలు గడిపేది. తాను అంటుకట్టిన గులాబీ అందమైన మొగ్గ తొడిగినప్పుడు ఆమె గుండెల్లో ఆనందం ఉప్పొంగేది. గులాబీల పెంపకం పట్ల గల ఆమె అభిరుచి ఆమె టీనేజ్‌ దాటిన తరువాత వయసుతో పాటే పెరుగుతూ వచ్చింది. 

2013లో ఆమె బ్రెజిల్, థాయిలాండ్‌లలో పెరిగే టేబుల్‌ గులాబీ రకాల గురించి తెలుసుకున్నటినుంచి మరింతగా వికసించింది.  15 రకాల గులాబీ మొక్కలను సేకరించి తన టెర్రస్‌పై రకరకాల కంటైనర్లలో పెంచడం ప్రారంభించింది. వాటి  పోషణలో... సంరక్షణలో ఆమె కృషి ఫలించింది. ఈ వాతావరణంలో కూడా అక్కడి గులాబీ రకాలు అభివృద్ధి చెంది రోజుకో రకం మొక్క, పూటకో రకం పువ్వు అన్నట్టు విచ్చుకోనారంభించాయి. ఆమె సేకరించి పెంచుతున్న గులాబీల సౌరభాలు క్రమేణా కేరళ దాటి  పొరుగు రాష్ట్రాలకు, అక్కడినుంచి విదేశాలకు కూడా చేరాయి. అలా ఒక ప్రయోగం ఫలించగానే మరో ప్రయోగం చేస్తూ వచ్చింది. చెన్నై, పూణెలలోని రకరకాల నర్సరీల నుంచి కొత్తరకాల గులాబీ అంట్లను తెప్పించేది. పరాగ సంపర్కాన్ని ఉపయోగించి ఆమె అంటుకట్టిన గులాబీ రకాలు మావిచిగురు, నారింజ, వంకాయ రంగు, ఊదా రంగు.. ఇంకా రకరకాల రంగులలో రూపాలలో ఊపిరి పోసుకుని వివిధ రకాల ఆకృతులలో విచ్చుకోసాగాయి. ఆమె తన ఇంటి మిద్దెనే ప్రయోగశాలగా మార్చుకుని చేసిన వినూత్న ప్రయోగాలు ఆమెకు ఆదాయ మార్గాలుగా కూడా మారాయి. 

చదవండి: Today Tip : షుగర్‌ పేషెంట్లు ఎగ్స్‌ తినవచ్చా? ఎన్ని తినవచ్చు?
 

ఫేస్‌బుక్‌లో ఆమె తాను పెంచుతున్న గులాబీ రకాలను అందమైన ఫొటోలు తీసి  పోస్ట్‌ చేసేది. వాటిని చూసి మైమరచి పోయిన ఆమె స్నేహితులు, బంధువులు తమకు కావాలంటే తమకు కావాలంటూ ఆమెకు ఆర్డర్లు పంపసాగారు. అలా అందుకున్న ఆర్డర్ల ద్వారా ఆమె రోజుకు కొన్ని వేల రూపాయల ఆదాయాన్ని కళ్ల జూసేది. ప్రస్తుతం ఆమె మిద్దెతోటలో లేని గులాబీ రకం లేదంటే అతిశయోక్తి కాదు. ఏవిధమైన ఏజెంట్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ లేకుండానే ఆమె తన నోటిమాటలు, ఫేస్‌బుక్‌ సమూహాల ద్వారా అడిగిన వారికి లేదనకుండా గులాబీ అంట్లను పంపుతూ  వేల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.  చేయాలనే సంకల్పం, దానిని నెరవేర్చుకునేందుకు కావలసిన శ్రద్ధ, అంకిత భావం, పట్టుదల ఉంటే చాలు.. దేనినైనా సాధించి చూపవచ్చుననేందుకు నిదర్శనం అంజు కార్తీక గులాబీ తోట.
 

ఇదీ చదవండి: రూ. 400 చెప్పుల్ని లక్షకు అమ్ముకుంటారా? ప్రాడాపై హర్ష్‌ గోయెంకా విమర్శలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement