అంబేద్కర్‌ యాత్ర... త్రినేత్రుడి దర్శనం | IRCTC Tourism Tour Packages Baba Saheb Ambedkar Yatra | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌ యాత్ర... త్రినేత్రుడి దర్శనం

May 26 2025 9:34 AM | Updated on May 26 2025 9:34 AM

IRCTC Tourism Tour Packages Baba Saheb Ambedkar Yatra

ఈ టూర్‌ మిగతా టూర్‌లకంటే ప్రత్యేకం...ఎందుకు ప్రత్యేకం అంటారా! వినండి!మహాకాళేశ్వర్‌... ఓంకారేశ్వర్‌... త్రయంబకేశ్వర్‌... భీమ్‌శంకర్‌... ఘృష్ణేశ్వర్‌... మొత్తం ఐదు జ్యోతిర్లింగాలను దర్శించవచ్చు. ఓ మహోన్నత వ్యక్తి పుట్టిన ఊరిని కూడా. అది... డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జన్మభూమి... బౌద్ధం తీసుకున్న దీక్షభూమిని చూడవచ్చు.అందుకే ఈ యాత్ర పేరు ‘అంబేద్కర్‌ యాత్ర విత్‌ పంచ్‌ జ్యోతిర్లింగ దర్శన్‌’. 

1వ రోజు
రైలు మధ్యాహ్నం రెండు గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్‌ఖేడ్, నాందేడ్, పూర్ణ స్టేషన్‌లలో కూడా రైలెక్కవచ్చు. 

2వ రోజు
ఉదయం ఎనిమిది గంటలకు రైలు నాగపూర్‌ స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్‌కెళ్లి రిఫ్రెష్‌మెంట్‌ తర్వాత చెక్‌ అవుట్‌ చేయాలి. దీక్షాభూమి స్థూప విజిట్, స్వామి నారాయణ మందిర్‌ దర్శనం తర్వాత తిరిగి రైల్వేస్టేషన్‌కు రావాలి. ట్రైన్‌ జర్నీ రాత్రి ఎనిమిది గంటలకు నాగపూర్‌ నుంచి ప్రయాణం ఉజ్జయినికి సాగుతుంది.

బౌద్ధదీక్ష బూనిన నేల
నాగపూర్‌లో ఉన్న దీక్షభూమికి అంబేద్కర్‌ జీవితంలో మాత్రమే కాదు బౌద్ధంలో కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఇది హిందూ మతం నుంచి బౌద్ధమతంలోకి మారిన ప్రదేశం. అంబేద్కర్‌తోపాటు నాలుగు లక్షల మంది మతం మారి బౌద్ధ దీక్ష తీసుకున్నారు. ఈ చారిత్రక సంఘటన 1956, అక్టోబర్‌ 14 తేదీన విజయదశమి రోజున జరిగింది. బౌద్ధమత పునరుజ్జీవనం కోసం అంబేద్కర్‌ తన మార్కు మార్పులతో బౌద్ధానికి నవయాన బౌద్ధాన్ని ఆవిష్కరించారు. 

అందుకు ప్రతీకగా ఇక్కడ నిర్మించిన స్థూపానికి దీక్షభూమి స్థూపం అనే పేరు పెట్టారు. ఇది నిర్మాణంలో సాంచిలోని బౌద్ధ స్థూపాన్ని పోలి ఉంది. దీక్ష బూనిన సందర్భంగా చేసిన ప్రతిజ్ఞలతో ఇక్కడ ఒక ఫలకం ఉంది. అబద్ధం చెప్పను, దొంగతనం చేయను వంటి 22 ప్రతిజ్ఞలు ఈ ఫలకం మీద ఇంగ్లిష్‌లో ఉంటాయి.

నాగపూర్‌ నారాయణుడు
నాగపూర్‌లోని స్వామినారాయణ్‌ మందిర్‌ కొత్త నిర్మాణం. పదకొండు ఎకరాల్లో విస్తరించి ఉంది. నిర్మాణంలో లాలిత్యం చూపుతిప్పుకోనివ్వదు. ఈ ఆలయాన్ని 2010– 17 వరకు ఏడేళ్ల ΄ాటు నిర్మించారు. గుజరాత్‌ నిర్మాణశైలి నిర్మాణం ఇది. ‘బోచసాంవాశి శ్రీ అక్షర పురుషోత్తమ్‌ స్వామి నారాయణ సంస్థ’ నిర్వహణలో ఉంది. ఇందులోని నారాయణుని విగ్రహం, అలంకరణ కూడా గుజరాత్‌ స్వామి నారాయణుని రూపాన్ని పోలి ఉంటుంది..

3వ రోజు
ఉదయం పది గంటలకు రైలు ఉజ్జయిని స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్‌లో చెక్‌ ఇన్‌ కావాలి. మహాకాళేశ్వర్‌ జ్యోతిర్లింగ దర్శనం తర్వాత తిరిగి హోటల్‌కు చేరాలి. రాత్రి బస ఉజ్జయిని లోనే.

మహాకాలుడి ఆలయం
ఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రానికి, మహాకాళేశ్వర్‌ ఆలయానికి ప్రాచీన కాలం నుంచి ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న నిర్మాణం 18వ శతాబ్దం నాటిది. నిర్మాణపరంగా బాగా నిశితంగా పరిశీలించి ఆస్వాదించాల్సిన ఆలయం. ఇక్కడ శివుడు దక్షిణామూర్తి పేరుతో దక్షిణముఖంగా ఉంటాడు. 

ఈ ఆలయంలో భస్మహారతి ప్రసిద్ధి. ఈ ఆలయంలో డ్రెస్‌కోడ్‌ ఉంది. భారతీయ సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. చీరకొంగు, దుపట్టా లేదా స్కార్ఫ్‌తో తలను కప్పుకోవాలి. ఫొటోగ్రఫీ కి అనుమతి ఉండదు. కాబట్టి ఆలయం రూపం, దేవుని విగ్రహం రూపం మదిలో ముద్రించుకునే వరకు కంటినిండుగా చూడాలి.

4వ రోజు
ఉదయం ఉజ్జయినిలో బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత రోడ్డు మార్గాన జన్మభూమికి వెళ్లాలి. ఇది బీఆర్‌ అంబేద్కర్‌ జన్మభూమి. మధ్యాహ్న భోజనం తర్వాత ఓంకారేశ్వర్‌ దర్శనం. ఆ తర్వాత ఎమ్‌హౌ (మిలటరీ హెడ్‌ క్వార్టర్స్‌ ఆఫ్‌ వార్‌ఫేర్, ఎమ్‌హెచ్‌ఓడబ్ల్యూ) రైల్వే స్టేషన్‌కి చేరి రైలెక్కాలి. ఈ రైల్వేస్టేషన్‌కి అంబేద్కర్‌ నగర్‌ రైల్వేస్టేషన్‌ అనే పేరు. రైలు నాసిక్‌ వైపు సాగి΄ోతుంది.

భీమ్‌ రావ్‌ జన్మభూమి
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పుట్టిన ప్రదేశంలో ఆయన స్మారక భవనం నిర్మించారు. దీనిని భీమ్‌ జన్మభూమి అంటారు. ఇది మధ్యప్రదేశ్‌లోని ఎంహౌ (మిలటరీ హెడ్‌ క్వార్టర్స్‌ ఆఫ్‌ వార్‌ఫేర్‌) ప్రదేశంలో ఉంది. ఈ స్మారకానికి అంబేద్కర్‌ శతజయంతి సందర్భంగా 1991, ఏప్రిల్‌ 14వ తేదీన సంకల్పం జరిగింది. నిర్మాణం పూర్తయిన తర్వాత 2008, ఏప్రిల్‌ 14వ తేదీన 117వ జయంతి నాడు ప్రారంభం అయింది. 

భీమ్‌ జన్మభూమి తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఓంకారేశ్వరుడి దర్శనం. ఈ జ్యోతిర్లింగం నర్మద నదిలోని మాందాత దీవిలో ఉంది. ఓంకారేశ్వరుడి దర్శనంతోపాటు నర్మద నది దక్షిణ తీరాన ఒడ్డు మీద ఉన్న మామలేశ్వర్‌ ఆలయ దర్శనం కూడా చేసుకోవచ్చు.

5వ రోజు
పగలంతా నాసిక్‌కు చేరడంలోనే పూర్తవుతుంది. ట్రైన్‌ సాయంత్రం ఆరు గంటలకు నాసిక్‌ రోడ్‌ రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. హోటల్‌లో చెక్‌ఇన్‌ అయిన తర్వాత రాత్రి భోజనం చేసి విశ్రాంతి తీసుకోవాలి. ఈ రోజు పర్యాటక ప్రదేశాలకు వెళ్లడం కుదరదు.

6వ రోజు
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత హోటల్‌ గది చెక్‌ అవుట్, ప్రయాణం రోడ్డు మార్గాన త్రయంబకేశ్వర్‌ వైపు సాగుతుంది. త్రయంబకేశ్వర్‌ దర్శనం తర్వాత నాసిక్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలెక్కాలి. రాత్రి ఎనిమిది గంటలకు ప్రయాణం పూనా వైపు సాగుతుంది.

ముక్కంటికి గోదారమ్మ అభిషేకం
త్రయంబకేశ్వర్‌ క్షేత్రం ఒక జ్యోతిర్లింగం. ఇక్కడ గర్భాలయంలో పానవట్టం ఒక పళ్లెంలాగ ఉంటుంది. అందులో మూడు చిన్న చిన్న శివలింగాలుంటాయి. ఆ పానవట్టం రాయి నుంచి నీరు ఉబుకుతూ శివలింగాలను అభిషేకిస్తూ ఉంటుంది. పూజారులు ఆ నీటిని చేత్తో తీసి పక్కన పోస్తుంటారు. ఆ నీరు గోదావరి నది నుంచి జాలువారుతున్న జల. 

ఆలయం పక్కనే బ్రహ్మగిరి కొండల నుంచి జాలువారే నీటిపాయ త్రయంబకం దగ్గర శివలింగాలను అభిషేకిస్తూ ముందుకు సాగుతూ క్రమంగా విస్తరిస్తుంది. గోదావరి పుట్టిన ప్రదేశాన్ని చూడాలంటేయువత బ్రహ్మగిరి కొండల్లోకి ట్రెకింగ్‌ చేయవచ్చు. 

కానీ ఈ టూర్‌లో అంత సమయం ఉండదు. ఈ ప్రాచీన ఆలయం సమీపంలో అన్నపూర్ణమాత ఆలయం ఉంది. ఇది పాలరాతి ఆలయం. దశాబ్దకాలం నాడు నిర్మించినది. ఆలయ ప్రాంగణం నుంచి గ్రానైట్‌ స్టోన్‌తో నిర్మించిన త్రయంబకేశ్వర ఆలయం, బ్రహ్మగిరి కొండల వ్యూ అద్భుతంగా ఉంటుంది.

7వ రోజు
తెల్లవారు జామున నాలుగన్నరకు రైలు పూనాలోని ఖడ్‌కీ రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. పూనాలోని హోటల్‌లో చెక్‌ ఇన్‌ అయ్యి రిఫ్రెష్‌మెంట్‌ తర్వాత భీమశంకర్‌ జ్యోతిర్లింగ ఆలయానికి వెళ్లాలి. భీమశంకర దర్శన దర్శనం తర్వాత తిరిగి ఖడ్‌కీ రైల్వేస్టేషన్‌కి చేరి రైలెక్కాలి. రైలు రాత్రి పదకొండు గంటలకు బయలుదేరుతుంది. ప్రయాణం ఔరంగాబాద్‌ వైపు సాగిపోతుంది.

ప్రకృతి దర్శనం
భీమశంకర జ్యోతిర్లింగం దర్శనానికి పూనా నుంచి నూట΄ాతిక కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. మందిరం ఉన్న నివాస ప్రదేశం పేరు కూడా భీమశంకరే. ఈ గ్రామం అటవీ ప్రదేశంలో భీమ నది ఒడ్డున ఉంది. ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా ఉత్తర భారత రాష్ట్రాల నిర్మాణశైలి. నగర శైలి అంటారు. దక్షిణాది ఆలయాల శిల్పచాతుర్యం కనిపించదు. దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో కూర్చుని ప్రకృతి ఒడిలో ప్రశాంతతను ఆస్వాదించవచ్చు.

8వ రోజు
ఉదయం ఏడు గంటలకు రైలు ఔరంగాబాద్‌కు చేరుతుంది. హోటల్‌కి వెళ్లి రిఫ్రెష్‌ అయిన తర్వాత ఘృష్ణేశ్వర్‌ దర్శనానికి వెళ్లాలి. ఈ దర్శనంతో టూర్‌లో చూడాల్సిన ప్రదేశాలన్నీ పూర్తవుతాయి. షాపింగ్‌ తర్వాత రైల్వే స్టేషన్‌ కు వెళ్లి రైలెక్కాలి. 

ట్రైన్‌ సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌కి చేరేలోపు ఎవరికి అనువైన ప్రదేశాల్లో వాళ్లు డీబోర్డ్‌ కావచ్చు. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరేటప్పటకి తొమ్మిదవ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలవుతుంది.

చారిత్రక శివుడు
ఘృష్ణేశ్వర్‌ మందిరాన్ని ఆర్కిటెక్చర్‌ స్టూడెంట్స్‌ చూసి తీరాలి. లేత గులాబీరంగు గ్రానైట్‌ స్టోన్‌తో అందంగా ఉంటుంది. కంప్యూటర్‌లో రంగుల పాళ్లను మారుస్తూ కొత్త షేడ్‌లను తెచ్చినట్లు చాలా లాలిత్యంగా ఉంటాయి. షిరిడీలో సాయి దర్శనం తర్వాత ఎల్లోరా టూర్‌ ప్యాకేజ్‌లో ఈ జ్యోతిర్లింగం కూడా ఉంటుంది. ఎల్లోరా నుంచి రెండు కిలోమీటర్లకు మించదు. 

ఈ ఆలయం ప్రస్తావన స్కందపురాణం, శివపురాణం, రామాయణం, మహాభారతాల్లో కూడా ఉండడంతో హిందువులు ఘృష్ణేశ్వర్‌ దర్శనాన్ని మిక్కిలిగా కోరుకుంటారు. ఈ శివుడు రాజకీయ వివాదాలకు కేంద్రబిందువయ్యి చరిత్రలో ప్రాధాన్యం సంతరించుకున్నాడు. మొఘల్‌– మరాఠా ఆదిపత్య΄ోరులో ఢిల్లీ సుల్తానుల విధ్వంసానికి గురైంది. ఇప్పుడు చూస్తున్న మందిరాన్ని 18వ శతాబ్దంలో ఇందోర్‌ రాణి గౌతమి బాయ్‌ హోల్కర్‌ నిర్మించారు. ఇక్కడ శివలింగానికి భక్తులు స్వయంగా పూజ చేయవచ్చు.

ప్యాకేజ్‌ వివరాలివి!
‘అంబేద్కర్‌యాత్ర విత్‌ పంచ్‌ జ్యోతిర్లింగ దర్శన్‌’... తొమ్మిది రోజుల టూర్‌. ఐఆర్‌సీటీసీలో జూలై ఐదవ తేదీ నుంచి మొదలవుతుంది. ఇందులో దీక్షాభూమి, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమ్‌శంకర్, ఘృష్ణేశ్వర్, జన్మభూమి అనే ప్రదేశాలు కవర్‌ అవుతాయి. 

నాగ్‌పూర్‌లో దీక్షాభూమి, ఉజ్జయిన్‌లోని మహాకాళేశ్వర్‌ జ్యోతిర్లింగంతోపాటు ఓంకారేశ్వర్‌ జ్యోతిర్లింగం, ఎమ్‌హౌ (ఎమ్‌ హెచ్‌ఓడబ్లు్య)లో జన్మభూమి, నాసిక్‌లో త్రయంబకేశ్వర్‌ జ్యోతిర్లింగం, పూనేలో భీమశంకర్‌ జ్యోతిర్లింగం, ఔరంగాబాద్‌లో ఘృష్ణేశ్వర్‌ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు.

టికెట్‌ ధరలిలా!
ఇందులో సింగిల్‌ ఆక్యుపెన్సీ సదు΄ాయం లేదు. ఒక్కరుగా ప్రయాణిస్తున్న వారికి మరొక ఒంటరి ట్రావెలర్‌తో కలిపి రూమ్‌ కేటాయిస్తారు. టికెట్‌ ధరలు ఎకానమీ కేటగిరీలో దాదాపుగా 15 వేల రూపాయలు, స్టాండర్డ్‌ కేటగిరీలో 23 వేలు, కంఫర్ట్‌ కేటగిరీలో 30 వేల రూపాయలవుతుంది. పిల్లలకు సుమారు పదిహేను వందల వరకు తగ్గుతుంది.

భోజనం ఇలాగ!

  • టూర్‌లో ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ ఇస్తారు. శాకాహార భోజనం మాత్రమే.

  • ట్రావెల్‌ ఇన్సూరెన్స్, టూర్‌ ఎస్కార్ట్, సెక్యూరిటీ సౌకర్యాలు కల్పిస్తారు.

  • పర్యాటకుల సహాయం కోసం ఐఆర్‌సీటీసీ అధికారులు కూడా ప్రయాణంలో ఉంటారు.

  • పర్యాటక ప్రదేశాల ఎంట్రీ ఫీజులు, బోటింగ్‌ రైడ్, అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ టికెట్‌లు ప్యాకేజ్‌లో వర్తించవు.

  • ఆహారం విషయంలో నిర్దేశించిన మెనూలో లేని పదార్థాలను తినాలంటే ఎవరికి వారు కొనుక్కోవాలి.

https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG43

– వాకా మంజులారెడ్డి,సాక్షి, ఫీచర్స్‌ ప్రతినిధి 

(చదవండి: శృంగేశ్వర్‌పూర్‌..రాముని వనపథం..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement